Rakul Preet Singh: ఒక్కరి పోస్ట్‌ చర్చకు దారి తీస్తుంది.. ‘పాన్‌ ఇండియా’ అర్థం నాకు తెలియదు: రకుల్‌ప్రీత్‌

తన కొత్త సినిమా ‘ఛత్రీవాలీ’ ప్రచారంలో పాల్గొన్న నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పలు విషయాలపై స్పందించారు. ఆ వివరాలివీ...

Published : 21 Jan 2023 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పాన్‌ ఇండియా’ అర్థం తనకు తెలియదని, అదొక కమర్షియల్‌ టర్మ్‌ అనుకుంటున్నానని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) అన్నారు. తన కొత్త సినిమా ‘ఛత్రీవాలీ’ (Chhatriwali) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎంతోమంది నటులు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పనిచేశారు. మీరూ కూడా. కొత్తగా పాన్‌ ఇండియా ట్యాగ్‌లైన్‌ తెరపైకి వచ్చింది’ అంటూ యాంకర్‌.. రకుల్‌ అభిప్రాయాన్ని కోరగా ఆమె ఇలా స్పందించారు. ‘‘ఒక్కటే ఇండియా. ఇండియా అంటే ఇండియానే. కొవిడ్‌ తర్వాత ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథా చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొరియన్‌ వెబ్‌సిరీస్‌లనూ చూస్తున్నారు. అలాగే పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళం.. ఇలా మన రీజినల్‌ సినిమాలు జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని అలరిస్తున్నాయి. పాన్‌ ఇండియా అనే పదం ఉంటే పెద్ద సినిమా అని భావిస్తున్నారు. ఆ ట్యాగ్‌ ఉంటే తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని భాషల ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తారు. అదొక కమర్షియల్‌ కోణం అని అనుకుంటున్నా. సినిమాలకు భాష కంటే ఎమోషన్‌ ముఖ్యం అనేది నా అభిప్రాయం. ఓ నటిగా ఏ భాషలోనైనా మంచి కథలు ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా’’ అని రకుల్‌ వివరించారు.

‘బాలీవుడ్‌ సినిమాలు విజయం సాధించలేకపోతున్నయి’ అనే విషయంపై స్పందించిన రకుల్‌.. ‘‘ఏదో చిన్న తప్పు చేస్తే ఫలానా నటుడు, ఫలానా నటి చెడ్డవారని, బాలీవుడ్‌ చిత్రాలు విజయం అందుకోలేకపోతున్నాయని ఎవరో ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడతారు. అది తీవ్ర చర్చకు దారి తీస్తుంది. బాగోలేని సినిమాను ప్రశంసించమని నేను చెప్పను. కానీ, ఏదైనా చిత్రం సరిగా ఆడకపోతే దానికి కారణాలు చాలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవాలి’’ అన్నారు. తేజాస్‌ డియోస్కర్‌ దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘ఛత్రీవాలీ’ నేరుగా ఓటీటీ ‘జీ 5’లో జనవరి 20న విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని