Rashmika: నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించింది వాళ్లిద్దరే!: రష్మిక

నటిగా తన కెరీర్‌ ప్రారంభం కావడం గురించి నటి రష్మిక (Rashmika) స్పందించారు. రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 18 Jan 2023 16:36 IST

హైదరాబాద్‌: కన్నడ నటులు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty), రిషబ్‌ శెట్టి (Rishab shetty)ల విషయంలో ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న నటి రష్మిక (Rashmika) తాజాగా వాళ్లిద్దరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల వల్లే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలిగానని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నటిగా ఇన్ని భాషల్లో పనిచేస్తున్నందుకు, ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆనందిస్తున్నా. ఇప్పటివరకూ కెరీర్‌లో నేను మంచి నటీనటులతో కలిసి పనిచేశాను. అయితే, ఒక నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టినే కారణం. వాళ్లే నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించారు. నటిగా తొలి అవకాశాన్ని ఇచ్చారు’’ అని రష్మిక పేర్కొన్నారు.

అనంతరం ఆమె సోషల్‌మీడియా ట్రోలింగ్‌పై స్పందించారు. ‘‘సాధారణంగా నేను మౌనంగా ఉండే వ్యక్తిని. అందుకే మొదట్లో ఎన్ని ట్రోలింగ్స్‌ వచ్చినా పట్టించుకోలేదు. ప్రేక్షకులపై నాకున్న గౌరవం అలాంటిది. అదీ కాక మొదట్లో నా గురించే విమర్శలు చేసేవారు. అవేమీ నన్ను ఇబ్బందిపెట్టలేదు. కానీ, ఇప్పుడు ఆ ట్రోల్స్‌ నా చెల్లి, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నేను వాటిని అంగీకరించలేకపోతున్నా. నా సోదరి మానసిక ఆరోగ్యం కాపాడటమే నా బాధ్యత’’ అని తెలిపారు. జీవితమంటేనే పోరాటమని.. ప్రతి విషయంలోనూ పోరాటం చేయకతప్పదని ఆమె తెలిపారు. కెరీర్‌ ఆరంభంతో పోలిస్తే సమస్యలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయని ఆమె అన్నారు.

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తోన్న ఈ భామ గతేడాది ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన కెరీర్‌ ఎలా మొదలైందో చెప్పారు. ‘కిరిక్‌ పార్టీ’తో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన ‘పరంవా’ బ్యానర్‌ పేరు చెప్పడానికి ఆమె ఆసక్తి కనబర్చలేదు. రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి రిషబ్‌ దర్శకత్వం వహించారు. మరోవైపు రిషబ్‌ నటించిన ‘కాంతార’ చూడలేదని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్‌ సైతం ఈ ప్రవర్తన పట్ల అసహనంగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని