Rashmika mandanna: ఎవరు చెప్పారు మీకు.. ఇలాంటి వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి?

Rashmika mandanna: గతంలో రష్మిక నటించిన ఓ సినిమాను ఉద్దేశిస్తూ నెటిజన్‌ చేసిన కామెంట్‌పై ఆమె స్పందించారు.

Published : 14 Feb 2024 02:23 IST

హైదరాబాద్‌: వరుస సినిమాలతో తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్న కథానాయిక రష్మిక మందన (Rashmika). ఇటీవల ‘యానిమల్‌’ విజయంలో భాగస్వామి అయిన ఆమె ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఎక్స్‌ (అంతకుముందు ట్విటర్‌) వేదికగా ఓ నెటిజన్‌ పెట్టిన కామెంట్‌పై రష్మిక అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రాధికా, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ చిత్రంలో రష్మిక నటించడంపై నెటిజన్‌ చేసిన కామెంట్‌ను రష్మిక ఖండించారు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ స్క్రిప్ట్‌ రష్మికకు నచ్చలేదు. అయినా కిషోర్‌ తిరుమల, శర్వాల మీద ఉన్న నమ్మకంతో సినిమాకు సంతకం చేసింది’ అంటూ విచారం వ్యక్తం చేస్తున్న ఎమోజీలను పంచుకున్నాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ ‘‘ఎవరు చెప్పారు మీకు. స్క్రిప్ట్‌పై నాకు నమ్మకం ఉంటేనే సినిమాలను చేస్తా. ఆ చిత్రం బృందంతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. ఇలాంటి నిరాధార వార్తలు ఎక్కడి నుంచి పుడతాయో ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ తలపట్టుకున్న ఎమోజీలతో సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల కిందట రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు ఆ చర్యను ఖండిస్తూ రష్మికకు మద్దతుగా నిలిచారు.

అల్లు అర్జున్‌ (Allu arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్‌’లో (Pushpa: The Rule) రష్మిక నటిస్తోంది. ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీలో ఆమె శ్రీవల్లిగా నటిస్తోంది. తొలి భాగాన్ని మించి ఇందులో రష్మిక పాత్ర ఉంటుందని టాక్‌. అలాగే ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘చావా’ తదితర చిత్రాల్లోనూ రష్మిక నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని