మల్టీప్లెక్స్‌పై కన్నేసిన టీటౌన్‌ తారలు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు సినీ ప్రియుల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక వైపు కథానాయకుడిగానే కాకుండా నిర్మాతలుగానూ కొత్త కథలతో అలరిస్తున్న పలువురు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు....

Published : 24 Mar 2021 16:24 IST

కొత్త వ్యాపారంలోకి స్టార్‌ హీరోలు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు సినీ ప్రియుల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక వైపు కథానాయకుడిగానే కాకుండా నిర్మాతలుగానూ కొత్త కథలతో అలరిస్తున్న పలువురు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. భారీ మల్టీప్లెక్స్‌లను నిర్మించి వినోదాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నారు. ఇప్పుటికే మహేశ్‌బాబు, ప్రభాస్‌.. ఆ రంగంలో రాణిస్తుండగా తాజాగా అల్లు అర్జున్‌ సైతం థియేటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ స్టార్‌హీరోలకు చెందిన థియేటర్లు ఎక్కడ ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి..!

‘ఏఎంబీ’తో మహేశ్‌ మెరుపులు

‘ది గోల్డ్‌ వెర్షన్ ఆఫ్‌ సిల్వర్‌ స్క్రీన్‌’ అనుభూతిని పొందాలంటే తప్పకుండా ‘ఏఎంబీ సినిమాస్‌’కు వెళ్లాల్సిందే. మల్టీప్లెక్స్ రంగంలో ఖ్యాతి ఘడించిన ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులు ఈ థియేటర్‌ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 2018లో ప్రారంభమైన ఈ థియేటర్‌లో మొత్తం ఏడు స్క్రీన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో ‘ఏఎంబీ సినిమాస్‌’ ప్రతిఒక్కర్నీ ఆకర్షిస్తోంది. చివరిగా ఏఎంబీ సినిమాస్‌ అంటే ఏషియన్‌ మహేశ్‌బాబు సినిమాస్‌.

ప్రభాస్‌ ‘వి-ఎపిక్‌’ థియేటర్

ఇండియాలో గల బిగ్‌ స్క్రీన్స్‌లో ‘వి-ఎపిక్‌’ ఒకటి. నెల్లూరు సూళ్లూరుపేటలోని జాతీయ రహదారి పక్కన ఇది నిర్మితమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ సభ్యులకు చెందిన ఈ థియేటర్‌లో స్టార్‌హీరో ప్రభాస్‌కు కొంత భాగముంది. 2018లో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ దీనిని ప్రారంభించారు. ‘సాహో’ ఇచ్చట ప్రదర్శితమైన మొదటి చిత్రం. భారీ స్క్రీన్స్‌, సౌండ్ టెక్నాలజీ సినీ వీక్షకులకు విభిన్న అనుభూతిని అందిస్తోంది.

రౌడీకి రంగం సిద్ధం

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ సైతం మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఆయన తన సొంత జిల్లాలో బిగ్‌ స్క్రీన్‌ నిర్మిస్తున్నారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లోని తిరుమల థియేటర్‌ స్థానంలో ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ సినిమాస్‌ నిర్మితమవుతోంది. ఇందులో మొత్తం మూడు స్క్రీన్స్‌ ఉండనున్నాయి. ప్రస్తుతం ఇది నిర్మాణదశలో ఉంది. అలాగే, ఆయన త్వరలోనే హైదరాబాద్‌లోనూ ‘ఏవీడీ’ సినిమాస్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బన్నీ ఆగయా..!

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం ఓ భారీ సినిమా హాల్‌ను నిర్మిస్తున్నారు. కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్న ఆయన త్వరలోనే ‘ఏఏఏ’ సినిమాస్‌ పేరుతో మార్కెట్‌లోకి రానున్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ స్థానంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అతి త్వరలో ఈ మల్టీప్లెక్స్‌ అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని