Tollywood: బాక్స్‌ఫీసుకు ‘న్యాయం’ చేశారు

కొత్త కథలు... కొత్త నేపథ్యాలు... కొత్త రకమైన పాత్రలు. - ఇలా చిత్రసీమ దృష్టి ఎప్పుడూ కొత్తదనంపైనే! కొత్త కథల్ని ఎలాగో చెప్పలేం అనుకున్నప్పుడు కొత్త నేపథ్యాలనైనా తెరపై ఆవిష్కరిద్దాం అన్నట్టుగా

Published : 21 Dec 2021 16:00 IST

కొత్త కథలు... కొత్త నేపథ్యాలు... కొత్త రకమైన పాత్రలు. - ఇలా చిత్రసీమ దృష్టి ఎప్పుడూ కొత్తదనంపైనే! కొత్త కథల్ని ఎలాగో చెప్పలేం అనుకున్నప్పుడు కొత్త నేపథ్యాలనైనా తెరపై ఆవిష్కరిద్దాం అన్నట్టుగా రచయితలు, దర్శకులు కలాల్ని ఝుళిపిస్తుంటారు. ఈ ఏడాదీ ఆ ప్రయత్నం ఘనంగానే జరిగింది. అలా చేసిన ప్రయత్నాలకి విజయాలూ దక్కాయి. అయితే చిత్రసీమలో ఒకొక్క ఏడాది ఒక్కో రకమైన కథల జోరు కనిపిస్తుంటుంది. ఒక సినిమా విజయవంతం అయ్యిందంటే ఆ తరహాలో సాగే మరికొన్ని చిత్రాలు పట్టాలెక్కడం పరిపాటే. దాన్నే ట్రెండ్‌ అంటారు. కొన్నిసార్లు విజయాలతో సంబంధం లేకుండా ఒకే రకమైన జోనర్‌ సినిమాలు దూసుకొస్తూ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంటాయి. అలా ఈ ఏడాదిలో కోర్ట్‌ రూమ్‌ డ్రామా కథలు విరివిగా పట్టాలెక్కాయి.  

వన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’, అల్లరి నరేష్‌ ‘నాంది’, సూర్య  ‘జై భీమ్‌’, సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పు పొందగా... గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’తోపాటు, మరికొన్ని విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ సినిమాలన్నిటిలోనూ నల్లకోటు తళ తళ మెరిసింది. కోర్ట్‌ గదిలో వాదనలు... బాక్సాఫీసులో వసూళ్ల వర్షం కురిపించాయి. అక్కడ కేసులు... ఇక్కడ నిర్మాతల సూట్‌కేసుల్ని నింపాయి. నిజానికి కోర్ట్‌ రూమ్‌ డ్రామా కథలు తెలుగుకి కొత్తేమీ కాదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ సినిమాల ఉద్ధృతి బలంగా కనిపించింది. వాటి విజయాలు మరికొన్ని అలాంటి సినిమాల్ని పట్టాలెక్కించడానికి కారణమయ్యాయి.


సాబ్‌ సందడి

కోర్ట్‌లో వాదించడం తెలుసు, కోట్‌ తీసి కొట్టడమూ తెలుసు అంటూ నల్లకోటుతోనే హీరోయిజాన్ని ప్రదర్శించారు అగ్ర కథా  నాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన న్యాయవాది సత్యదేవ్‌గా నటించిన ‘వకీల్‌సాబ్‌’ ప్రేక్షకుల మెప్పు పొందింది. హిందీలో  విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా శ్రీరామ్‌ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం అటు అభిమానుల్ని, ఇటు ప్రేక్షకుల్నీ మెప్పించింది. మహిళలకి ఎదురవుతున్న సమస్యలే ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రానికి కోర్ట్‌ గదిలో జరిగిన వాదనలే హైలెట్‌గా నిలిచాయి. పవన్‌కల్యాణ్‌,   ప్రకాశ్‌రాజ్‌ పోటాపోటీగా నటించారు. ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఆమె వేసుకునే దుస్తుల్లో, చేసే పనుల్లోనూ, ఆమె ప్రవర్తననిబట్టి అంచనా వెయ్యడం తప్పు. వాళ్లకి నచ్చినట్టు వాళ్లు ఉండటం వాళ్ల ప్రాథమిక హక్కు అనే విషయాన్ని బలంగా చెప్పిందీ చిత్రం. కరోనా రెండో దశ భయాలు ఊపందుకున్న దశలో ఈ సినిమా విడుదలైనా ఘన విజయాన్ని అందుకుంది.


సెక్షన్‌తో కొట్టాడు

భారతీయ శిక్షా స్మృతిలోని కొన్ని సెక్షన్ల ఆధారంగా రూపుదిద్దుకుని విజయవంతమైన చిత్రాలు చాలానే. అలాంటివి హిందీలో ఎక్కువగా రూపుదిద్దుకున్నాయి. తెలుగులోనూ ‘నాంది’తో ఆ ప్రయత్నం చేశారు యువ దర్శకుడు విజయ్‌ కనకమేడల. అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న అల్లరి నరేష్‌ని మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది. చాలా మందికి తెలియని సెక్షన్‌ 211 గురించి ఈ చిత్రం ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 2015 నాటికి 3 లక్షల 66 వేల మందికి పైగా రకరకాల శిక్షలు అనుభవిస్తే, అందులో 2 లక్షల 50 వేల మంది తప్పు చేశామో చేయలేదో తెలియకుండానే అండర్‌ ట్రైయల్‌ ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నారని, భారతీయ శిక్షా స్మృతి లక్ష్యం శిక్షలు వేయడమే కాదు, న్యాయం చేయడమూ అనే విషయాన్ని బలంగా చెప్పిందీ చిత్రం. అన్యాయంగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న యువకుడిగా నటించిన అల్లరి నరేష్‌ ప్రేక్షకుల మనసుల్ని గెలిచాడు. బాధితుడి పక్షాన నిలబడి కేసుని భుజాన వేసుకుని పోరాటం చేసిన  యువ న్యాయవాదిగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటన అలరించింది.


శభాష్‌ భీమ్‌

నిజాయతీతో కూడిన ఓ కథని నమ్మి, అంతే నిజాయతీగా ఓ అగ్ర కథానాయకుడు చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ‘జై భీమ్‌’ చాటి చెప్పింది. సూర్య కథానాయకుడిగా జ్ఞానవేల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీ వేదికలోనే విడుదలైనప్పటికీ ప్రేక్షకులకు గొప్పగా చేరువైంది.  నిజ జీవిత ఘటనలతో రూపొందిన ఈ చిత్రంలో లాయర్‌ చంద్రుగా నిజ జీవిత పాత్రనే పోషించారు సూర్య. అన్యాయంగా  పోలీసులు అరెస్ట్‌ చేసిన తన భర్తని విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అమాయకులపై అక్రమంగా కేసులు మోపి, వాళ్లు చేయని నేరాల్ని కూడా ఒప్పుకొనేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడుతుంటారో కళ్లకి కట్టినట్టు చూపించారు దర్శకుడు. పాత్రలో సూర్య ఒదిగిపోయిన విధానం అద్భుతం అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో తమిళనాట కొన్ని వివాదాలూ సూర్యని చుట్టుముట్టాయి. కానీ ఓ మంచి ప్రయత్నం చేసిన కథానాయకుడు, నిర్మాత అయిన ఆయనకి ప్రేక్షకుల నుంచి, పరిశ్రమ నుంచి గట్టి మద్దతు లభించింది.


మరికొన్ని...

త్యదేవ్‌ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన  ‘తిమ్మరుసు’ కోర్ట్‌ రూమ్‌ డ్రామా కథతోనే తెరకెక్కింది. ఈ కథల్లో ఎక్కువగా వాదనలు, ప్రతివాదనలు ఉంటాయి. ఇందులో తన కేసు కోసం కథానాయకుడు చేసే పరిశోధనే హైలెట్‌ అయ్యింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ హత్య నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సత్యదేవ్‌ న్యాయవాదిగా ఒదిగిపోయిన తీరు మెప్పిస్తుంది. ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాలన్నీ విజయవంతం కాగా, గోపీచంద్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్‌’ త్వరలో విడుదల కానుంది.  ఈ సినిమాలో గోపీచంద్‌ న్యాయవాదిగా కనిపిస్తారు. హాస్యం ప్రధానంగా ఈ సినిమాని మారుతి మలుస్తున్నారు.

* కోర్ట్‌ నేపథ్యంలో సాగే కథతోనే ప్రియమణి ప్రధాన పాత్రధారిగా ‘యాక్ట్‌ 1978’ అనే సినిమాని రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయవంతమైన ‘జాతిరత్నాలు’ సినిమాలోనూ హీరోయిన్‌ న్యాయవాదిగా కనిపించి నవ్వించారు. పతాక సన్నివేశాల్లో కోర్ట్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అలరిస్తాయి. ఇలా నల్లకోటు ధరించి మెప్పించిన తారలు మనకు కొత్త కానే కాదు. ‘చెట్టుకింద ప్లీడర్‌’లో రాజేంద్రప్రసాద్‌, ‘అభిలాష’లో చిరంజీవి, ‘ధర్మచక్రం’లో వెంకటేష్‌, రాధాగోపాళం’లో శ్రీకాంత్‌, స్నేహ... ఇలా చాలా మందే న్యాయవాదులుగా కేసులు చేతపట్టారు. విజయాల్ని అందుకున్నారు. 2022లోనూ వీటి ఉద్ధృతి కొనసాగుతుందేమో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు