ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!

సినిమాలకి కొబ్బరికాయ కొట్టక ముందే నటీనటులు... సాంకేతికవర్గం పూర్తిగా ఖరారైపోతుంది. ఒక్కసారి సినిమా మొదలయ్యిందంటే ఆ స్క్రిప్టులో... ఇతరత్రా విషయాల్లో చిన్న మార్పు చేయడానికి ఇష్టపడని దర్శక   నిర్మాతలు, హీరోలు చాలామందే. తొలి నాళ్లల్లో ఈ విషయంలో మరింత పక్కాగా ఉండేవారు.

Published : 17 Apr 2021 15:33 IST

సినిమాలకి కొబ్బరికాయ కొట్టక ముందే నటీనటులు... సాంకేతికవర్గం పూర్తిగా ఖరారైపోతుంది. ఒక్కసారి సినిమా మొదలయ్యిందంటే ఆ స్క్రిప్టులో... ఇతరత్రా విషయాల్లో చిన్న మార్పు చేయడానికి ఇష్టపడని దర్శక   నిర్మాతలు, హీరోలు చాలామందే. తొలి నాళ్లల్లో ఈ విషయంలో మరింత పక్కాగా ఉండేవారు. ఏం చేసినా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే! అంత పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగేవారు. ఇటీవల ఆ విషయంలో చాలా మార్పులే కనిపిస్తున్నాయి.   సినిమాలు సగం పూర్తయినా నటీనటుల ఎంపికపై స్పష్టత రావడం లేదు. వాళ్లపై సన్నివేశాలు తీసేవరకు అన్వేషణ సాగుతోంది. సాంకేతిక బృందం విషయంలోనూ అంతే.

* కావాలి నాయిక.. రావాలి ప్రతినాయకుడు
ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా సగానికి పైగా పూర్తయ్యాక సంగీత దర్శకుల్ని ఎంపిక చేశారు. దక్షిణాది భాషల్లో జస్టిన్‌ ప్రభాకర్‌, హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
* అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రీకరణ చాలా భాగం పూర్తయ్యాక, అందులో విలన్‌ పాత్ర కోసం ఇటీవలే ఫాహద్‌ ఫాజిల్‌ ఎంపికయ్యారు. ఆయన ఇంకా సెట్స్‌పైకి రాలేదు. వచ్చే నెలలో చిత్రీకరణకు రానున్నారని తెలుస్తోంది.
* చిరంజీవి - రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’లో కథానాయిక విషయంలో ఇలాగే జరిగింది. సగానికి పైగా సినిమా పూర్తయ్యాకే పూజాహెగ్డేని రంగంలోకి దించారు. ఆయా తారల కాల్షీట్లు... పారితోషికాలు తదితర విషయాల్ని దృష్టిలో ఉంచుకుని ఆచితూచి ఎంపిక ప్రక్రియని పూర్తి చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
*ఇప్పుడు సెట్స్‌పై ఉన్న రెండు ప్రధాన చిత్రాలకి ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి కథానాయకులుగా ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా సరసన కథానాయికగా ఐశ్వర్య రాజేష్‌ ఎంపికయ్యారు. పవన్‌కి తగ్గ జోడీనే ఇంకా కుదరలేదు. అయితే ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. పవన్‌కి జోడీగా నటించే కథానాయికలంటూ పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా నిత్యమేనన్‌ పేరు వినిపిస్తోంది.
* మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఆయన్ని ఢీ కొట్టే విలన్‌ ఎవరన్నది ఇంకా తేలలేదు. అరవింద్‌ స్వామి, ఉపేంద్ర తదితర పేర్లు వినిపించినా ఇంకా ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. తాజాగా మాధవన్‌ పేరు తెరపైకొచ్చింది. మరి ఎవరనేది తెలియాలంటే ప్రకటన రావాల్సిందే. సినిమాల్లో మలుపుల్ని మించిపోయేలా నటీనటుల్ని అనూహ్యంగా ఎంపిక చేస్తూ ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేస్తున్నాయి ఆయా సినిమా బృందాలు.
ఎందుకిలా?
కొన్నిసార్లు సినిమా చిత్రీకరణల్లో ఆలస్యం జరుగుతుంటుంది. అలాంటి సమయంలో తారల కాల్షీట్లు వృథా అవుతాయి. ముఖ్యంగా కథానాయికల కాల్షీట్లు. వాళ్లు ఒకే సమయంలో నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. హీరోలైతే సినిమా పూర్తయ్యాక గానీ, మరో సినిమా కోసం రంగంలోకి దిగరు. కథానాయికలు అలా కాదు... అందుకే చిత్రీకరణ సాగుతున్న తీరుని దృష్టిలో ఉంచుకుని ఆ సమయంలో అందుబాటులో ఉన్న కథానాయికల్ని ఎంపిక చేసుకుంటుంటారు. కొన్నిసార్లు సరైన జోడీ దొరికేవరకు అన్వేషణ సాగుతుంటుంది. ప్రతినాయకులు, ఇతర ముఖ్యపాత్రల విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తారు. తుది ఎంపిక పూర్తయ్యేలోపు సినిమాని ఆపకుండా... హీరోలు, ఇతర తారాగణంపై తీయాల్సిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని