ఇరువురు భామలు.. ఇరుకున కథానాయకులు

ఒకే హీరోని రెండు విభిన్న పాత్రల్లో చూస్తే ప్రేక్షకులకు ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అదే హీరో పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తే అంతకన్నా ఎక్కువ

Published : 23 Feb 2021 09:26 IST

ఒకే హీరోని రెండు విభిన్న పాత్రల్లో చూస్తే ప్రేక్షకులకు ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అదే హీరో పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తే అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఏ నాయికని ప్రేమిస్తాడు? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? అంటూ సినిమా మొదలైన క్షణం నుంచే ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇలా ఇద్దరు భామల మధ్య నలిగిపోయే కథానాయకుల కథలు టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వస్తున్నా ఈ మధ్య వాటి సంఖ్య కాస్త తగ్గిందని చెప్పొచ్చు. కాదు అంటూ ఈ ఏడాది కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. అవేంటి.. ఎవరా నాయకానాయికలు? చూసేద్దాం...

 ఇద్దరున్నా.. ఒకరితోనేనా! 

నితిన్‌ గతంలో నటించిన ‘అల్లరి బుల్లోడు’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అ ఆ’ తదితర చిత్రాల్లో ఇద్దరు నాయికలకు అవకాశం ఉంది. ‘చెక్‌’తో మరోసారి ఇద్దరు భామలతో సందడి చేయనున్నారు. నితిన్‌ కథానాయకుడుగా వైవిధ్య దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియాంక ప్రకాశ్‌ వారియర్‌ నాయికలు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్‌ ఖైదీగా కనిపించనున్నాడు. రెండు అందాలు ఉన్నప్పటికీ నితిన్‌.. ప్రియాంక వారియర్‌తోనే రొమాన్స్‌ పండించనట్లున్నాడు ట్రైలర్‌ని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. అతనికి సాయం చేసే అమ్మాయిగా లాయర్‌ పాత్ర పోషించింది రకుల్‌. ఈ ఇద్దరి భామలతో నితిన్‌ చేసిన సందడి చూడాల్సిందే ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే.

 ‘జగదీష్‌’ ఎవరికి సొంతం

నాని సరసన ఇద్దరు కథానాయికలుంటే ఎంత వినోదం ఉంటుందో ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమీందార్‌’, ‘జెంటిల్‌మేన్‌’, ‘మజ్ను’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు తెలియజేశాయి. మరోసారి టక్‌ చేసుకుని జగదీష్‌గా అదే సరదాని ప్రేక్షకులకు అందించనున్నారు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఇంకోసారి ఇంకోసారి’ లిరికల్‌ వీడియో నాని-రీతూ మధ్య బంధాన్ని తెలియజేసింది. ఐశ్వర్య రాజేష్‌తో నాని కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఏప్రిల్‌ రావాల్సిందే. ఏప్రిల్‌ వరకూ వేచి చూడాల్సిందే!

‘శ్యామ్‌ సింగరాయ్‌’కీ ఇద్దరున్నారు

‘టక్‌ జగదీష్‌’ తర్వాత నాని నటిస్తున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’లోనూ ఇద్దరు నాయికలు ఎంపికయ్యారు. టాక్సీవాలా ఫేం రాహుల్‌ సాంక్రిత్యన్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథ అని సమాచారం.

‘ఖిలాడి’ ఏ లేడీకి..

 

ఇద్దరు బ్యూటీస్‌తో మాస్‌ మహారాజా రవితేజ చేసే ఆ అల్లరే వేరు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో ఇద్దరు నాయికలతో ఆడిపాడిన ఆయన ‘ఖిలాడి’తో అదే జోరు కొనసాగించనున్నారు. ‘వీరా’ చిత్రం తర్వాత రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమానే ‘ఖిలాడి’. ఏ స్టూడియోస్‌ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రవితేజ శైలిలో సాగే మంచి వినోదాత్మక చిత్రం. రవితేజ సరసన నాయికలు మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ నటిస్తున్నారు. వీళ్లతో రవితేజ చేసిన హంగామా చూడాలంటే మే 28వరకు ఆగాల్సిందే.

ఎవరితో ‘సీటీమార్‌’

తమన్నా, దిగంగన సూర్యవంశీతో అలరించేందుకు సిద్ధమయ్యారు గోపీచంద్‌. మరో అందం అప్సర రాణి ప్రత్యేక గీతంలో కనువిందు చేయబోతుంది. వీళ్లంతా కలిసి నటించిన చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకుడు. శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోందీ సినిమా. కోచ్‌ పాత్రలు పోషిస్తున్నారు గోపీచంద్‌, తమన్నా. ఓ జట్టు సభ్యురాలిగా దిగంగన కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఏప్రిల్‌  2న విడుదల కాబోతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని