Balakrishna: ఇంకా కసి తీరలేదు.. అలా అనుకునే వారికి సమాధానమదే: బాలకృష్ణ

‘నేనెప్పుడూ రాయలసీమకే పరిమితమవుతానని చాలా మంది అంటుంటారు. అది నిజం కాదు’ అని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ‘వీరసింహారెడ్డి’ వేడుకలో ఆయన మాట్లాడారు.

Updated : 06 Jan 2023 23:18 IST

ఒంగోలు: బాలకృష్ణ (Balakrishna) హీరోగా .. దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒంగోలులోని అర్జున్‌ ఇన్‌ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో నిలిపినందుకు నా తండ్రి ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు. నటనలో ఆయన ప్రయోగాల దిట్ట. అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని నేనే కాదు ప్రతి నటుడూ అంగీకరించక తప్పదు. ఆయన సినిమాలతో కళామ తల్లి పండుగ చేసుకుంది. ఈ వేడుకతో ఈ రోజు నుంచే సంక్రాంతి సందడి మొదలైంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ వేడుకకు అందాన్ని, పెద్దరికాన్ని తీసుకొచ్చేది దర్శకుడు బి. గోపాల్‌గారనే అనుకుని ఆయన్ను ఆహ్వానించాం. నటులు, టెక్నిషియన్ల నుంచి ప్రతిభను వెలికితీయగల సత్తా ఉన్న ఒంగోలు గిత్త మన గోపీచంద్‌ మలినేని. ఈయనే కాదు నా తదుపరి చిత్రం దర్శకుడు అనిల్‌ రావిపూడిది ఒంగోలే. నేనెప్పుడూ రాయలసీమకే పరిమితమవుతానని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, అది నిజం కాదు’’

‘‘మానవారణ్యంలో కల్మషం, కుతంత్రాలను వేటాడే సింహరాజు నేనే. రెడ్డిని నేనే, నాయుడిని నేనే. అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. ఎన్నో రకాల సినిమాలు చేసినా నాకు ఇంకా కసి తీరలేదు. భిన్నమైన పాత్రలు పోషించడం, బాధ్యతలు నిర్వహించడంలోనే తృప్తి. ‘ఇక బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలకే పరిమితం’ అని అనుకునే వారికి సమాధానం ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమం. టాక్‌ షోలలో అది నంబరు 1గా నిలిచింది. అలానే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో ‘వీరసింహారెడ్డి’ ఒకటి. నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేశారు. దునియా విజయ్‌ కన్నడ చిత్ర పరిశ్రమ హీరో అయినా ఈ సినిమాలో విలన్‌ నటించడం గొప్ప విషయం. సప్తగిరి నుంచి నేను కామెడీ టైమింగ్‌ నేర్చుకోవాలి. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఎలా ఉన్నాయో చూశారు. థియేటర్లలో.. రీ రికార్డింగ్‌కు మళ్లీ ఎన్ని సౌండ్‌ బాక్సులు బద్దలవుతాయో చూస్తారు. సాయి మాధవ్‌ బుర్రా రాసిన మాటలు పేలతాయి. అద్భుతమైన సినిమా ఇది. బాగా ఆడి తీరుతుంది’  అని బాలకృష్ణ అన్నారు.

శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ.. ‘‘గోపీచంద్‌ దర్శకత్వంలో నేను నటించిన మూడో సినిమా ఇది. ఆయన్ను నేను అన్నయ్యగా భావిస్తా. బాలకృష్ణగారు పాజిటివ్‌ పర్సన్‌. ఎంతో ఉత్సాహంగా ఉంటారు’’ అని శ్రుతిహాసన్‌ అన్నారు.

ఇది అభిమానులు తీసిన సినిమా: గోపీచంద్‌

‘‘మీ అందరిలానే నేనూ బాలయ్య అభిమానిని. నేను నా స్నేహితులతో కలిసి 1999 సంక్రాంతికి బాలయ్యగారి ‘సమరసింహారెడ్డి’ సినిమాకి వెళ్లా. థియేటర్‌ దగ్గర గొడవ జరగడంతో సినిమా మిస్‌ అయిపోతానేమో అని బాధపడ్డా. కానీ, నైట్‌ షో చూసే అవకాశం దక్కింది. అలాంటిది.. నేను ఆయన్ను డైరెక్ట్‌ చేయడమంటే అంతకు మించిన ఆనందం ఏముంది? సెట్స్‌లో ఓ కంటితో అభిమానిగా మరో కంటితో దర్శకుడిగా బాలయ్య బాబుని చూశా. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రుతిహాసన్‌ నా లక్కీ హీరోయిన్‌. యాక్టింగ్‌, డ్యాన్స్‌.. ఏదైనా అద్భుతంగా చేస్తుంది. దునియా విజయ్‌ను ఈ సినిమాలో విలన్‌గా నటించాలనగానే.. నేనూ బాలయ్య అభిమానినే అని వెంటనే ఓకే చెప్పారు. సాయిమాధవ్‌ బుర్రా గారు అదిరిపోయే సంభాషణలు రాశారు. రామ్‌- లక్ష్మణ్‌ మాస్టర్లు యాక్షన్‌ సీన్స్‌ అద్భుతంగా రూపొందించారు. బాలకృష్ణ అభిమానులంతా కలిసి చేసిన సినిమా ఇది’’ అని గోపీచంద్‌ తెలిపారు.

‘‘నందమూరి తారకరామారావుగారంటే నాకు చాలా అభిమానం. ఓ అభిమాని అయిన నేను ఆయన సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. బాలయ్య అంటే ఇంకా ఇష్టం. ఆయనతో కలిసి నేను తీసిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి’’ అని సీనియర్‌ దర్శకుడు బి. గోపాల్‌ పేర్కొన్నారు.


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని