అజరామరం ఆయన పాట..!

పాటలు అందరూ రాస్తారు.. కానీ, కథలోని సన్నివేశం, సందర్భం రక్తికట్టేలా పాటలు రాసేవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. అలాంటి వాళ్లలో వెన్నెలకంటి

Updated : 24 Nov 2023 12:23 IST

పాటలు అందరూ రాస్తారు.. కానీ, కథలోని సన్నివేశం, సందర్భం రక్తికట్టేలా పాటలు రాసేవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. అలాంటి వాళ్లలో వెన్నెలకంటి ఒకరు. నేరుగా తెలుగు పాట రాయడం ఒకెత్తయితే, డబ్బింగ్‌ సినిమాలకు పాటలు, మాటలు రాయడం కత్తిమీద సాము. ఏమాత్రం తేడా ఉన్నా ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్‌ కాలేడు. కానీ, వెన్నెలకంటి కలం పట్టుకుంటే అది ఏ భాష సినిమా అయినా, తెలుగువాడి గుండెకు హత్తుకునేలా సంభాషణలు, మాటలు ఉంటాయి. అంతటి ధారణశక్తి కలిగిన ఆయన మంగళవారం గుండెపోటుతో కన్నుమూసి, చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచారు. భౌతికంగా ఆయన మనల్ని విడిచి వెళ్లినా, ఆయన రాసిన పాటలు అజరామరం. అందుకే వెన్నెలకంటిని స్మరిస్తూ, ఆయన గురించి, ఆయన పాటల గురించి కొన్ని విషయాలు మీకోసం..

11వ ఏటే శతక రచన

వెన్నెలకంటి తన 11వ ఏటనే ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని రాశారు. అలా విద్యార్థి దశలో ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశారు. కానీ, తన మనసంతా నాటకాల మీద, సినిమాల మీదే ఉండేది. నాటకాలు వేస్తుండేవారు.అనంతరం కొన్ని సంవత్సరాలకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా అనే ఆత్మ విశ్వాసంతో ఉండేవారు. అదే ఆయన్ని సినీ గేయ రచయితగా నిలబెట్టింది.

నెల్లూరుకి మద్రాసు దగ్గర కావడంతో సరదాగా అక్కడకు వెళ్తుండేవారు. 1986లో నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో ‘‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల’’ పాట రాసే అవకాశమిచ్చారు. అదే తన తొలి సినీగీతం. 1987లో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ‘అన్నా చెల్లెలు’ సినిమాకి ‘‘అందాలు ఆవురావురన్నాయి’’ పాట రాశారు. అలా నా పాటల ప్రయాణం మెల్లిగా ఊపందుకుంది. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సినిమా రంగంలో సాహిత్య ప్రయాణం చేశారు.

అలరించిన ‘మాటరాని మౌనమిది’
‘మహర్షి’ (1988) సినిమాలో ‘‘మాటరాని మౌనమిది’’ పాట ప్రతి ఒక్కరినీ అలరించింది. ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి వంటి గొప్పవారి స్ఫూర్తితో స్రవంతి రవికిషోర్, వంశీ సూచన మేరకు ‘ముక్తపదగ్రస్థం’ వచ్చేట్టు ఒక పాట, మామూలు వర్షన్‌లో వచ్చేలా మరొక పాట రాశారు. ‘‘మాటరాని మౌనమిది... మౌనవీణ గానమిది.. గానమిదీ నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిదీ.. ప్రాణమైన మూగ గుండె రాగమిది’’ అనే  పాట బాగా హిట్‌ అయింది. ‘‘ముత్యాల పాటల్లో కోయిలమ్మా.. ముద్దారబోసేది ఎప్పుడమ్మా.. ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా.. దీపాలు పెట్టేది ఎప్పుడమ్మా’’ చరణంతో నిర్మాత బాగా ఇంప్రెస్‌ అయ్యారు. ఇళయరాజా అద్భుతంగా ఈ పాటను స్వరపరిచారు. ఈ పాట హిట్‌ అవడంతో రవికిషోర్‌ తనకు ‘నాయకుడు’ డబ్బింగ్‌ వర్షన్‌లో రెండు పాటలు రాసే అవకాశాన్ని ప్రోత్సహించారు.

బాలు, చిత్ర పాడిన ‘‘చల్తీకా నామ్‌ గాడీ.. చలాకీ వన్నె లేడీ.. రంగేళి జోడీ.. బంగారు బాడీ.. వేగంలో చేసెను దాడీ.. వేడెక్కి ఆగెను ఓడి.. అహో.. ఇక ముప్పల తిప్పలు తప్పవా తప్పవా’’ అనే పాట సందర్భానికి రాసిన సరదా పాట. ఈ పాటలో హీరో ఒక డొక్కు కారును గురించి పొగడ్తలు చెప్పడమే ఉద్దేశం. ‘‘అశోకుడు యుద్ధంలోన వాడింది ఈ కారు.. శివాజీ గుర్రం వీడీ ఎక్కింది ఈ కారు’’ అంటూ చరణంలో పలికే ప్రగల్భాలు  చెట్టుకింద ప్లీడరు సినిమాలో బాగా పండాయి. ఈ పాటనే స్ఫూర్తిగా తీసుకొని ఆరేళ్ల విరామం తరువాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో వంశీ ‘‘వెన్నెల్లో హాయ్‌.. హాయ్‌’’ పాటను చక్రి చేత ట్యూన్‌ చేయించుకున్నారు.

రెండో పాట ‘‘అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కథలా రావే.. మల్లెపూల చినుకై రావే.. పల్లవించి పలుకై రావే’’ అంటూ సాగే సాధారణ ప్రేమ గీతం. ఇందులో ‘‘జావళీలు పాడే జాణ.. జాబిలమ్మ తానై’’ అనే ప్రయోగం వంశీకి ఎంతో నచ్చింది. ఈ సినిమాలో మొదట సిరివెన్నెలతో ‘‘నిజమంటే నిప్పేకాదా.. ముట్టుకుంటే చుట్టుకోదా మంటా’’ అనే పాటను రాయించారు. ఈ పాట రికార్డు కూడా విడుదలైంది. వంశీ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అతనికి వైవిధ్యం కావాలి. ప్రాస కుదరాలి. ‘మంచీ-చెడు’ సినిమాలో ఆత్రేయ రాసిన ‘‘రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి.. నీ కంటి చూపుల వెంట నా పరుగంటి’’ పాటలా సాగిపోవాలి అంటూ వంశీ రెండు చరణాలకు రెండు సీన్లు ఇచ్చారు. పాట డైలాగుల్లా కాకుండా పాట రూపంలో ఆ రెండు సీన్లు రావాలి అని షరతుపెట్టి, పాట రాయమన్నారు. అన్నీ నిజాలే చెప్తే వచ్చే అనర్ధాలను పాట రూపంలో చెప్పారు. ‘‘మాటంటే మాటేనంట.. కంటబడ్డ నిజమంతా అంటా - రుజువంటూ దొరికిందంటే.. గంట కొట్టి చాటేస్తూ ఉంటా’’ అనే పల్లవిని రాజేంద్రప్రసాద్‌కు, ‘‘నిజమంటే తంటాలంటా.. నిక్కుతుంటే తిక్క దిగుతాదంటా.. మొదలంటూ చెడతావంట.. వెంటబడి తెగ తంతారంట’’ అనే పల్లవిని శోభనకు రాశారు. చూస్తున్నదే వింటున్నట్లు, వింటున్నదే చూస్తున్నట్లు రాయడంతో ఆ పాట బాగా పాపులర్‌ అయ్యింది.

పింగళి మళ్లీ కనిపించారు

సంగీత దర్శకుడు మాధవపెద్ది రమేష్‌ ‘‘షిర్డీ సాయి’’ ఆల్బమ్‌ కోసం వెన్నెలకంటితో నాలుగు పాటలు రాయించారు. ఆ పాటల సాహిత్యం విన్న సింగీతం శ్రీనివాసరావు ఆ పాటల్లో ‘ఆత్మ’ ఉంది అని మెచ్చుకున్నారట. అలా ఆయనకు ‘బృందావనం’ సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. 17 ఏళ్ల విరామం తరువాత విజయా వారు నిర్మించిన ఈ సినిమాకి పాటలు రాశారు. పింగళి, ఘంటసాల, పెండ్యాల కూర్చొని పాటలు రాసి మట్లు కట్టిన చారిత్రాత్మక గదిలో కూర్చొని పాటలు రాసినప్పుడు ఒళ్లు పులకించిందంటారు- వెన్నెలకంటి. ఈ పాటలకు స్వరాలు అల్లడానికి నలభై రోజులు పట్టింది. ముఖ్యంగా ‘‘మధురమే సుధా గానం.. మనకిదే మరో ప్రాణం.. మదిలో మోహన రాగం.. మెదిలే తొలి సంగీతం’’ పాట విజయా వారి ‘ట్రేడ్‌ మార్క్‌’ పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ‘‘ఓహో ఓహో బుల్లి పావురమా.. అయ్యో పాపం అంటే అది నేరమా.. అతివలకింత పంతమా.. అలకలు వారి సొంతమా’’ అంటూ బాలు, ‘‘పదే పదే వెటకారమా.. అతివలు అంత సులభమా.. శ్రుతి ఇంక మించనీకుమా’’ అని జానకి ఆలపిస్తారు. ఈ వరసలు విన్న రావి కొండలరావు, సింగీతం శ్రీనివాసరావు, బాబ్జీ ‘‘అబ్బా! మళ్లీ పింగళి గారు కనిపిస్తున్నారయ్యా’’ అంటూ మిస్సమ్మ సినిమాలో పింగళివారి ‘‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’’ పాటను గుర్తు చేసుకున్నారు. ‘అంతకు మించిన అవార్డు నాకేం కావాలి?’ అనే వారు వెన్నెలకంటి ‘‘ఆ రోజు నారాణి’’, ‘‘అబ్బో ఏమివింత’’, ‘‘మా మామయ్యా’’ పాటలు కూడా బాగా హిట్‌ అయినవే! సింగీతం దర్శకత్వం నిర్వహించిన ‘ఆదిత్య 369’లో వెన్నెలకంటి రాసిన ‘‘రాసలీల వేళ రాయబారమేలా.. మాటే మౌనమై మాయజేయ నేలా’’ పాటను సాధన చేసి రికార్డింగుకు సిద్ధమవుతూ బాలు, సింగీతంతో ‘‘ఈ పాట చాలా బాగా వచ్చిందండీ’’ అంటే... సింగీతం ‘‘నేను ఈ కుర్రాణ్ణి చెడగొడదామనుకున్నాను. అతను చెడిపోకపోగా చాలా అద్భుతంగా పాట రాశాడు. నాకు పింగళి గారితో రాయించుకున్న ఫీలింగు కలుగుతోంది’’ అన్నారట. అది అదే తనకు గొప్ప ప్రశంసా పత్రం అంటారాయన.

కళాతపస్వి విశ్వనాథ్‌ సినిమా ‘‘స్వాతికిరణం’’ సినిమాకు ‘‘కొండా కోనల్లో లోయల్లో.. గోదారి గంగమ్మా సాయల్లో.. కోరి కోరి కూసింది కోయిలమ్మ..’’ అని పల్లవి మొదలెట్టి ‘‘నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా.. రివ్వున గువ్వే సాగంగా.. నవ్వే మువ్వై మోగంగా.. ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా.. ఊపిరి ఊయలలూగంగా... రేపటి ఆశలు తీరంగా.. తెనుగుతనం నోరూరంగా... తేటగీతి గారాబంగా.. ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగా’’ అంటూ చరణాలు రాసుకెళ్ళారు. ‘‘అలతి పదాలతో ఎంత కమ్మగా పాట రాశావయ్యా’’ అని విశ్వనాథ్‌ మెచ్చుకుంటుంటే తన మేను రోమాంచితమైంది.. అది మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి అంటారు- వెన్నెలకంటి

‘గజినీ’ సినిమాలో ‘‘హృదయం ఎక్కడున్నదీ.. నీ చుట్టూనే తిరుగుతున్నదీ’’ పాట రెండు సంవత్సరాలు మారు మోగిపోయింది. ‘బాషా’ సినిమాలో ‘‘నేను ఆటోవాణ్ణి, ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి - న్యాయమైన రేటు వాణ్ణి.. ఎదురులేని ఆటగాణ్ణి’’ అంటూ ‘‘మంచోళ్లకు మంచివాణ్ణి.. తప్పుడోళ్ల వేటగాణ్ణి.. అచ్చమైన తెలుగువాణ్ణి’’ అంటూ తెలుగుదనం నింపారు. ‘మహానది’లో ‘‘శ్రీరంగం రంగనాథుని దివ్య రూపమే చూడరే.. శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడరే - నీలవేణిలో నీటిముత్యాలు.. కృష్ణవేణిలో అలల గీతాలు’’ పాట వంటివి ఎన్నో మధురానుభూతులు!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని