Vishwak Sen: ‘గామి’ విజయం.. విశ్వక్‌ సేన్‌ ఆసక్తికర పోస్ట్‌

‘గామి’(Gaami)తో ఈ ఏడాదిలో మొదటి విజయాన్ని అందుకున్నారు నటుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen). తాజాగా ఆయన ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

Published : 13 Mar 2024 18:23 IST

హైదరాబాద్‌: ‘గామి’ (Gaami)తో ఈ ఏడాది ఆరంభంలోనే నటుడు విశ్వక్‌సేన్‌ (Vishwaksen) తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విద్యాధర్‌ కాగిత తెరకెక్కించిన ఈ ఎపిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌లో విశ్వక్‌ అఘోరా పాత్ర పోషించారు. శంకర్‌గా ఆయన నటనకు సినీప్రియులు ఫిదా అయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని విశ్వక్‌సేన్‌ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ప్రతీ సినిమా నాకొక ప్రయాణం లాంటిదే. చుట్టూ ఉండే పరిస్థితుల గురించి పాఠాలు నేర్పిస్తుంది. ఈసారి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాగే ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్నా. సినిమాని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అని పేర్కొన్నారు. #TeluguCinema, #Gaami అనే హ్యాష్‌ట్యాగ్స్‌ జత చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘గామి’ అద్భుతంగా ఉంది’’, ‘‘విభిన్నమైన కథలతో మీరు మరెన్నో విజయాలు అందుకోవాలి’’ అని కామెంట్స్‌ పెట్టారు.

‘గామి’ కథేంటంటే: శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ అఘోరా. తనెవరు.. గతమేంటి.. అనే విషయాలేం గుర్తుండవు. పైగా మనిషి స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతనిని శాపగ్రస్థుడుగా భావించి, ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు శంకర్‌. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు.. అతడిని ఎందుకు వెంటాడుతుంటాయి?  వాళ్లతో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికర విశేషాలతో ‘గామి’ తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని