Gangubai Kathiawadi: అసలు ఎవరీ గంగుబాయి.. ‘మాఫియా క్వీన్‌’ ఎలా అయ్యింది..?

హిస్టారికల్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ‘గంగూబాయి’ చిత్రంలో ఏముంది? ఎవరిది ఈ కథ?

Updated : 22 Feb 2022 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గంగూబాయి కథియావాడి’ (Gangubai Kathiawadi) ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ మూవీ. అలియా భట్‌ కీలక పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిస్టారికల్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ‘గంగూబాయి’ చిత్రంలో ఏముంది? ఎవరిది ఈ కథ?గంగా హర్‌జీవన్‌దాస్‌.. గంగూబాయిగా ఎలా మారింది? ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ హుస్సేన్‌ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబయి’ పుస్తకంలో గంగూబాయి గురించి ఏం చెప్పారు?

నటిగా ఎదగాలని...

గంగా హర్‌జీవన్‌దాస్‌ గుజరాత్‌కు చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే సినిమాల్లో కథానాయికగా రాణించాలని కలలు కనేది. హీరోయిన్‌లా రెడీ అవటం, హావభావాలు పలికించటం, దుస్తులు ధరించడం.. ఇలా సినిమాలపై అంతులేని ప్రేమను పెంచుకుంది. ఎలాగైనా ముంబయి వెళ్లి వెండితెరపై రాణించి ధ్రువతారలా ఓ వెలుగు వెలగాలనుకునేది. పైకి కనిపించే అందమైన గులాబీల వెనుక ముళ్లు ఉంటాయన్న సంగతి గుర్తించలేనంత అమాయకురాలు గంగ. ఒక వైపు సినిమా కలలు, మరోవైపు ప్రేమ. గంగ కలలకు ఆమె ఇష్టపడిన వాడు మరింత రంగులు అద్దాడు. దీంతో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయి ముంబయి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎవరికీ చెప్పకుండా ముంబయి రైలెక్కేశారు.

ఆశలు ఆవిరైన వేళ..

ముంబయి చేరుకున్న గంగ, ఆమె ప్రియుడు కొద్దిరోజులు సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. త్వరలోనే తన సినిమా కలలు నిజమవుతాయని గంగ భావించింది. అయితే తాను వచ్చింది మేక వన్నె పులితో అని గ్రహించలేకపోయింది. ఈ క్రమంలోనే గంగ ప్రియుడు ఆమెను ఒక ప్రాంతానికి తీసుకెళ్లాడు. అలాంటి చోటును ఆమె ఇంతకుముందెప్పుడూ చూడలేదు. ఒక ఇంటి లోపలికి వెళ్లి మాట్లాడి కాసేపటికి బయటకు వచ్చాడు. అక్కడి వాళ్లు వచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. సాయంత్రమైనా కట్టుకున్న వాడు రాలేదు. అసలేం జరిగిందో తెలుసుకున్న గంగకు కన్నీళ్లు ఆగలేదు. నమ్మించి తీసుకొచ్చిన వాడు తనని రూ.500కు వ్యభిచార గృహానికి అమ్మేశాడని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువ సేపు పట్టలేదు. దుఃఖం కట్టలు తెంచుకుంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తోడేళ్ల గుంపు మధ్య చిక్కుకుపోయిన జింక పిల్లలా గంగ జీవితం సర్వనాశనమైంది.

కష్టాలు.. కన్నీళ్లు.. దాటి..

మోసపోయి కామాఠిపుర చేరిన గంగకు సాలెగూడులాంటి వ్యభిచార కూపంలోనే తన జీవితం ముగిసిపోతుందని అర్థమైంది. గతిలేక తాను ఉంటున్న వ్యభిచార గృహ యజమాని చెప్పినట్లు చేస్తూ, అటు మానసికంగా, ఇటు శారీరకంగా తీవ్ర వేదన అనుభవిస్తూ నిత్యం నరకాన్ని చూసేది. ముంబయిలోని మాఫియా గ్యాంగుల్లో కరీంలాలా గ్యాంగ్‌ ఒకటి. అందులోని ఒక వ్యక్తి చేతిలో గంగ అత్యాచారానికి గురైంది. తనకు న్యాయం చేయమని కరీంను వేడుకోగా అతడు ఆమెతో రాఖీ కట్టించుకుని తన సోదరిని చేసుకున్నాడు. అంతేకాదు, కామాఠిపురపై ఆమెకు అధికారం కల్పిస్తూ తీర్మానం చేశాడు. అప్పటి నుంచి గంగ కామాఠిపురలోని పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకుంది. తనలాంటి వాళ్లెందరో అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం వాళ్లను మనుషులుగా కూడా చూడటం లేదని అర్థమైంది. తమకూ హక్కులు ఉంటాయని, వాటిని కాలరాసే అధికారం ఎవరికీ లేదని చెప్పాలనుకుంది. అక్కడే ఉంటూ తమతో వ్యభిచారం చేయిస్తూ తమనే పావుల్లా వాడుకొంటున్న వారిపై యుద్ధం ప్రకటించింది. వారితో పోరాటం చేసింది. ఈ క్రమంలో ఆమెను అంతం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నించాయి. వాటిని దాటుకుని నెమ్మదిగా కామాఠిపురపై పట్టు సాధించింది.

గంగూబాయిగా మారిన గంగ

ఒక్కో సవాల్‌ను అధిగమిస్తూ కామాఠిపురను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న గంగ.. అక్కడి వారందరికీ గంగూబాయి (Gangubai Kathiawadi)గా మారింది. అప్పటి నుంచి ఆమె చెప్పిందే అక్కడ వేదం. రాజకీయంగా బలోపేతం కావడానికి గంగూబాయి మాఫియాతోనూ చేతులు కలిపింది. తన గుర్తింపును సుస్థిరం చేసుకునే క్రమంలో మాదక ద్రవ్యాల విక్రయం, డబ్బులు తీసుకుని హత్యలు చేయించడం ఇలా నేర సామ్రాజ్యంలో మాఫియా క్వీన్‌గా ఎదిగింది. అయితే, ఇవన్నీ గంగూబాయి జీవితానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తనలాంటి వాళ్లు ఎంతో మంది దుర్భరజీవితాన్ని గడుపుతున్నారని గంగూబాయి గుర్తించింది. వాళ్ల అభ్యున్నతికి కృషి చేయాలంటే రాజకీయాలే సరైన దారని భావించింది. నెమ్మదిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన గంగూబాయి అక్కడి స్థానిక ఎన్నికల్లో  విజయం సాధించింది. ఈ క్రమంలో సెక్స్‌ వర్కర్ల జీవితాలను సమూలంగా మార్చాలని కంకణం కట్టుకుంది. వాళ్లకు కనీస హక్కులు ఉండాలని పోరాటం చేసింది. అంతేకాదు, కామాఠిపురలో పుట్టిన పిల్లల గుర్తింపు, అభ్యున్నతి కోసం నడుం బిగించింది. వాళ్లంతా చదువుకోవాలని, వాళ్ల తల్లుల్లా వాళ్లు ఈ నరక కూపంలో కాకుండా జనంలో ఒకరిలా బతకాలని ఆకాంక్షించింది. ఈ క్రమంలో రాజకీయంగా ఎదురైన వాళ్లను గట్టిగా ఎదుర్కొంది. ఒకానొక దశలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను కలిసి అక్కడి మహిళల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది.

సినిమాకున్న న్యాయపరమైన సమస్యలు ఏంటి?

ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి చిత్ర బృందానికి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. గంగూబాయి (Gangubai Kathiawadi) 1970లలో చనిపోయింది. ఆమెకు పిల్లలు లేరు. అయితే, తమను గంగూబాయి దత్తత తీసుకున్నారంటూ పలువురు పుట్టుకొచ్చారు. సినిమా షూటింగ్‌ మొదలైన నాటి నుంచి గంగూబాయి జీవిత కథను తప్పుగా చూపిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో ముంబయిలోని కోర్టు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, అలియాభట్‌కు సమన్లు జారీ చేసింది. తన తల్లిని వ్యభిచారిణిగా, మాఫియా క్వీన్‌గా తప్పుగా చూపిస్తున్నారని సదరు గంగూబాయి దత్తత తీసుకున్న కుమారుడినంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ సమన్లు పంపింది. అయితే ఆ తర్వాత సినిమా విడుదల కాకుండా ఇంజక్షన్ ఆర్డర్‌ ఇవ్వాలంటూ గంగూబాయి కుటుంబ సభ్యులు పెట్టుకున్న పిటిషన్‌ను ముంబయి సివిల్‌ కోర్టు కొట్టివేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని