Yash: దక్షిణాది చిత్రాలపై ఉత్తరాది వాళ్లు ఎగతాళి చేశారు: యశ్‌

‘కేజీయఫ్‌’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కన్నడ నటుడు యశ్‌. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో  ఆయన పాల్గొని దక్షిణాది సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 06 Nov 2022 13:49 IST

ముంబయి: రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని.. సౌత్‌ సినిమా ఇంతటి ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ఆ క్రెడిట్‌ మొత్తం జక్కన్నదేనని నటుడు యశ్‌ అన్నారు. ‘కేజీయఫ్‌’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సుమారు పదేళ్ల క్రితం నుంచే ఉత్తరాదిలో డబ్బింగ్‌ చిత్రాలకు ప్రాధాన్యత పెరిగింది. మొదట్లో మా సినిమాలు ఇక్కడ తక్కువ ధరకే అమ్ముడయ్యేవి. డబ్బింగ్‌ సరిగ్గా ఉండేది కాదు. ఫన్నీ టైటిల్స్‌ పెట్టి సినిమాలు విడుదల చేసేవారు. దాంతో ఇక్కడి వాళ్లు దక్షిణాది చిత్రాలు చూసి ఎగతాళి చేసేవారు. ‘ఇదేం యాక్షన్‌.. హీరో కొడితే రౌడీలు అలా ఎగిరిపోతున్నారేంటి’ అని నవ్వుకునేవాళ్లు. రాను రాను వాళ్లే మా సినిమాల్లోని కళను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్‌ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు. అలాగే, డిజిటల్‌ రంగంతో మా సినిమాలను ప్రపంచవ్యాప్తం చేసుకునే అవకాశం దక్కింది’’ అని యశ్ పేర్కొన్నారు. అనంతరం ‘కేజీయఫ్‌-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్‌లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని