తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తెలుగు తల్లికి పద్యాభిషేకం’

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న ‘నెల నెలా తెలుగు వెలుగు’లో భాగంగా ఫిబ్రవరి 27న, 33వ అంతర్జాల

Updated : 03 Mar 2022 05:55 IST

అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న ‘నెల నెలా తెలుగు వెలుగు’లో భాగంగా ఫిబ్రవరి 27న, 33వ అంతర్జాల దృశ్య సమావేశం ‘తెలుగు తల్లికి పద్యాభిషేకం’ అనే కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించగల శక్తి పద్యానికున్నదని, పద్యం రాయగలగడం ఒక ప్రత్యేక కళ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది లబ్దప్రతిష్ఠులు పాల్గొనడం చాలా సంతోషం అంటూ అతిథులందరకూ ఆహ్వానం పలికారు.    

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఏ ఇతర భాషలకూ లేని పద్యం, అవధానం లాంటి సౌందర్యం, సొగసులు మన తెలుగు భాషకున్నాయన్నారు. ఇంతటి ఘనమైన మన మాతృభాషా పరిరక్షణ కోసం తానా కంకణం కట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా అవిరళ కృషి చేస్తోందని తెలిపారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ ఉన్న డా.వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్రను డా.ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు. సాధారణంగా రాజులు సంగీత, సాహిత్య, నృత్యాంశాలను అభిమానిస్తూ, ఆదరిస్తుంటారు. కాని వేంకటగిరి సంస్థానంలో వెలుగోటి రాజవంశంలో జన్మించిన డా.సాయి కృష్ణ యాచేంద్ర స్వతహాగా సంగీత సాహిత్య ప్రతిభామూర్తికావడం, మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టా పొందడం విశేషం అని డా.ప్రసాద్‌ తోటకూర అన్నారు. డా.సాయి కృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ.. సాహిత్యలోకంలో అంతగా ప్రచారంలో లేని ప్రముఖ యోగిని, గొప్ప కవయిత్రి తరిగొండ వెంగమాంబ కలం నుంచి భాగవతం, వేంకటాచల మహత్యం, రమా పరిణయం, యక్షగాన కృతులు, శివ నాటకం లాంటి అనేక ఉత్తమ సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయన్నారు. 12 స్కందాల భాగవతంలో 7, 8, 9, స్కందాల కోసం శోధించవలసిన అవసరం ఉందన్నారు. బాల వితంతువైన వెంగమాంబ ఎక్కువ కాలం ధ్యాన యోగంలో గడిపేవారని, ఆనాటి సామాజిక పరిస్థితుల వల్ల ఆమె నిరాదరణకు గురైనా, వాటినన్నింటినీ తట్టుకుంటూ ఎదురునిల్చి పోరాడిన ఆమె జీవితం నారీ జనాభ్యుదయానికి నాందీ గీతంగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, నటుడు, గాయకుడు, ప్రయోక్త డా.అక్కిరాజు సుందర రామకృష్ణ, ప్రముఖ రచయిత, నటుడు, సంగీత నవావధాని, కళారత్న డా.మీగడ రామలింగస్వామి, పరవస్తు పద్యపీఠం, తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణి శయనసూరి, పద్యపరిమళం యూట్యూబ్ ఛానల్ ద్వారా పద్యాభిషేకం చేస్తున్న పాతూరి కొండల్ రెడ్డి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పని చేసిన ప్రముఖ సినీ, జానపద, శాస్త్రీయ గాయకులు చంద్ర తేజ, ఆకాశవాణిలో లలిత సంగీతంలో ఉత్తమ శ్రేణి కళాకారుడుగా గుర్తింపు పొందిన తాతా బాలకామేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, కవులు, పండితులు, రచయితలు సృష్టించిన సాహిత్యం, చలన చిత్రాల నుంచి వీరు అనేక పద్యాలను శ్రావ్యంగా ఆలపించి, తమ గాన మాధుర్యంతో తెలుగు తల్లికి పద్యాభిషేకం చేసి అందర్నీ పరవశింపజేశారు.  

ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి, గౌరవ అతిథులకు, సహకారం అందిస్తున్న ప్రసార మాధ్యమాలకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలను తెలిపారు.  ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మార్చి 27న పౌరాణిక నాటక వైభవం అనే 34వ సాహిత్య కార్యక్రమం అంతర్జాల దృశ్య సమావేశంగా జరుగుతుందని డా.ప్రసాద్‌ తోటకూర ప్రకటించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని