TANA: తానా మహాసభలకు రానున్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌

జులైలో జరగనున్న తానా మహాసభల్లో పాల్గొనేందుకు సద్గురు జగ్గీవాసుదేవ్‌ అంగీకరించారు. తానా ఆహ్వానం మేరకు జులై 8న ఆయన గౌరవ అతిథిగా సభల్లో పాల్గొననున్నారు.

Published : 31 May 2023 21:19 IST

వాషింగ్టన్‌ డీసీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభలకు అనేకమంది ప్రముఖులను తానా ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ శ్రీ సద్గురు‌ జగ్గీవాసుదేవ్‌ను తానా ప్రతినిధులు కలిసి మహాసభలకు గౌరవ అతిథిగా రావాలని ఆహ్వానించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ఆహ్వానాన్ని మన్నించిన ఆయన జులై 8న తానా మహాసభల్లో పాల్గొనేందుకు అంగీకరించారు.

సద్గురు కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహ ప్రాంగణలో ఈషా ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచ దేశాల్లో పలు కార్యక్రమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి పరిరక్షణ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్న నేపథ్యంలో తానా మహాసభలకు ఆయన రాక మరింత ఆకర్షణీయంగా ఉంటుందని తానా ప్రతినిధులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని