సిలికానాంధ్ర వర్సిటీలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులతో ఎన్నారైల సమావేశం

అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంస్థ చేస్తోన్న సేవల్ని ప్రశంసించారు.

Published : 26 Feb 2023 18:17 IST

సిలికానాంధ్ర: వివిధ రంగాల్లో పనిచేస్తోన్న ప్రవాస భారతీయులతో అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధుల బృందం సమావేశమైంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో జరిగిన ఈ సమావేశానికి అనేకమంది ప్రముఖ ఎన్నారైలు హాజరయ్యారు. సిలికానాంధ్ర వర్సిటీ అధిపతి డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల స్వాగతోపన్యాసం చేశారు. విశ్వవిద్యాలయానికి మాతృసంస్థ అయిన సిలికానాంధ్ర గత రెండు దశాబ్దాలకు పైగా తెలుగు భాష, సంస్కృతి, కళల అభ్యున్నతికి చేస్తోన్న కృషిని, సామాజిక సేవా కార్యక్రమాలను ఆ బృందానికి వివరించారు. అలాగే, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అతి త్వరలో ప్రారంభించే MS కంప్యూటర్ సైన్స్ కోర్సు గురించి, విశ్వవిద్యాలయం రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల బృహత్‌ ప్రణాళికను సమావేశంలో ఉన్నవారందరికీ వివరించారు. అంతేకాకుండా, ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చి తమ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు I-20 మంజూరు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నుంచి అనుమతి లభించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 

ఈ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించిన దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ నాన్సీ ఇజో జాక్సన్ మాట్లాడుతూ.. అమెరికా భారత్ సంబంధాల మెరుగుదలకు సిలికానాంధ్ర సంస్థ చేస్తోన్న కార్యక్రమాల్ని అభినందించారు. అతి కొద్ది సమయంలోనే విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను కొనియాడుతూ భవిష్యత్ కార్యాచరణలో కృతకృత్యమయ్యేందుకు తమ బ్యూరో సహాయ సహకారాల్ని అందిస్తుందని ఆమె సభాముఖంగా ప్రకటించారు. ప్రతినిధి బృందంలో బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ డివిజన్ చీఫ్ నాన్సీ సడ్విక్, USAID మిషన్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా కిమ్ క్లిమౌస్కీ, డొమెస్టిక్ ఔట్‌ రీచ్ సీనియర్ అడ్వైజర్ జెన్నీఫర్ మిల్లర్; మహిళల ఆర్థిక సాధికారికత సీనియర్ అడ్వైజర్ రాధిక ప్రభు తదితరులు ఉన్నారు.

ప్రతినిధి బృందం ఈ సమావేశానికి హాజరైన ప్రవాస భారతీయులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యరూపక ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఈ సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన అజయ్ భుటోరియాకు యూనివర్సిటీ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వంద మందికి పైగా విచ్చేసిన సిలికాన్ వ్యాలీ ప్రవాస భారతీయ ప్రముఖులతో స్ఫూర్తిదాయకంగా జరిగిన ఈ సమావేశానికి హాజరైన ఆహూతులు, మీడియా బృందం వారికి, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.  చివరగా కార్యకర్తలు ఏర్పాటుచేసిన విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని