Chandrababu: వైకాపా డీఎన్‌ఏలోనే శవరాజకీయం: చంద్రబాబు

జగన్‌ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Updated : 04 Apr 2024 19:25 IST

కొవ్వూరు: జగన్‌ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘వైకాపా డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉంది. తండ్రి లేరు.. బాబాయ్‌ని చంపారంటూ జగన్‌ ఓట్లు అడిగారు. రక్తంలో మునిగిన వైకాపాకు ఓట్లు వేయవద్దని అతని చెల్లి కోరుతున్నారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా? రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టుకట్టాం.

మీపార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకో.. 

వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. కానీ, రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు.. ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా. మా ప్రభుత్వం వచ్చాక వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నా.  వైకాపా ఇవ్వలేకపోతే తెదేపా వచ్చాక రూ.4వేల చొప్పున పింఛను ఇస్తామన్నాం. భయపడి నిన్న డబ్బులు విడుదల చేశారు. ప్రశ్నిస్తే గొడ్డలిని చూపి బెదిరిస్తున్నారు. మీ (వైకాపా) పార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకోండి.. కానీ, రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో జనసేన రెండు చోట్ల పోటీ చేస్తోంది. ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. మిగిలిన ఐదుస్థానాల్లో ఒక సీటు భాజపాకు ఇచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫ్యాన్‌ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 

రైతు కూలీల కోసం కార్పొరేషన్‌

తెదేపా కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌, జే బ్రాండ్‌ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్‌ ఛార్జీలు పెరగవు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తాం. రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్‌ పెట్టి వారిని ఆదుకుంటామని హామీ ఇస్తున్నా. నేను టిడ్కో ఇళ్లు ఇస్తే.. ప్రజల్ని జగన్‌ ఇబ్బందులకు గురి చేశాడు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా’’అని చంద్రబాబు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని