Congress: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది.

Updated : 17 Jan 2024 19:57 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం(ఈ నెల 18) వరకూ గడువు ఉంది. అద్దంకి దయాకర్‌తో పాటు బల్మూరి వెంకట్‌కు అవకాశం ఇచ్చినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ, మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉన్నందువల్ల రెండు స్థానాలనూ గెలిచేందుకు అవకాశముంది.

మెడిసిన్‌ చదివి రాజకీయాల్లోకి..

ఎంబీబీఎస్‌ చదివిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ గతంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ లభించలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టి.. పార్టీలో గుర్తింపు పొందారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.

అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన అద్దంకి దయాకర్‌

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ స్పందించారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడిని. పార్టీ కోసం సహనంగా ఉంటా. నాకు మరింత మంచి స్థానం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. శ్రేయోభిలాషులు ఎవరూ బాధపడొద్దు’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు