జాట్‌ల చేతిలో హరియాణా!

హరియాణా.. వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. అక్కడ రైతులంటే జాట్‌లు.. జాట్‌లంటే రైతులు. ఈ రాష్ట్రంలో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతోపాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి.

Updated : 15 Apr 2024 06:24 IST

పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్న  రైతు వర్గం
భాజపా, జేజేపీలకు ప్రతిఘటన

హరియాణా.. వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. అక్కడ రైతులంటే జాట్‌లు.. జాట్‌లంటే రైతులు. ఈ రాష్ట్రంలో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతోపాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాలు వారి నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాట్‌లు ఎటు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. తమ ఆందోళనల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతుందనే కోపం హరియాణా జాట్‌లలో స్పష్టంగా కనిపిస్తోంది. జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) పట్ల కూడా వారు ఆగ్రహంగానే ఉన్నారు.

ప్రచారంలో నిరసనలు

భాజపా, జేజేపీలకు ప్రచారంలో నిరసనలు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోకి ఈ పార్టీల నేతలు వెళ్లినప్పుడు ప్రతిఘటనను చవిచూడాల్సి వస్తోంది. సోనీపత్‌లోని దహియా ఖాప్‌ పరిధిలో ఉన్న 24 గ్రామాలవారు భాజపాను బాయ్‌కాట్‌ చేశారు. సిర్సాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫతేహాబాద్‌లో భాజపా నేత అశోక్‌ తన్వర్‌ ర్యాలీల్లో రైతులు నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు. జాట్‌ల ప్రాబల్యమున్న హిసార్‌లోని నారాలో ప్రజలు మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్‌ చౌటాలాను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.

రిజర్వేషన్లు

వెనుకబడిన వర్గాలపై ఆధారపడిన భాజపా, జేజేపీలకు రిజర్వేషన్ల అంశమూ ఇబ్బందికరంగా మారింది. జాట్‌ నేతలపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలతో భాజపాపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది అధికంగా ఉంది. దీని నుంచి బయటపడటానికి స్థానిక జాట్‌ నేతలను మచ్చిక చేసుకునే పనిలో భాజపా పడింది.

అధికారం కోసం ఆరాటం

దాదాపు పదేళ్లపాటు జాటేతర నేత అధికారం చెలాయించడంతో జాట్‌లలో అధికారం సాధించాలనే కాంక్ష మళ్లీ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల కంటే వాటి తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలే జాట్‌ నేతలకు ముఖ్యంగా కనిపిస్తోంది.

1966 నుంచి జాట్‌ల ప్రాభవం

1966లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ హరియాణాలో జాట్‌లే చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రంలో జాట్‌లు 26శాతం నుంచి 28శాతం వరకూ ఉన్నారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 చోట్ల వారి ప్రాబల్యం అధికం. 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో 4 చోట్ల ఎన్నికలను ప్రభావితం చేయగలరు. ఇందులో రెండు చోట్ల కాంగ్రెస్‌ నుంచి వచ్చిన అశోక్‌ తన్వర్‌, నవీన్‌ జిందాల్‌లకు భాజపా టికెట్లిచ్చింది. 58ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 33ఏళ్లపాటు జాట్‌ నేతలే సీఎంలుగా ఉన్నారు. రాష్ట్రాన్ని దేవీలాల్‌, బన్సీలాల్‌, భూపేందర్‌సింగ్‌ హుడ్డా లాంటి జాట్‌ నేతలే పదేళ్ల కిందటి వరకూ శాసించారు.

2019లో భాజపాకే మొగ్గు

2019 లోక్‌సభ ఎన్నికల్లో 42.4 శాతం మంది జాట్‌లు భాజపాకు మద్దతిచ్చారు. 39.8 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేశారు. మిగిలిన వారు జేజేపీ, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌కు (ఐఎన్‌ఎల్‌డీ) మద్దతిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జేజేపీకి 12.7 శాతం మంది ఓటేశారు. కాంగ్రెస్‌కు 38.7శాతం మంది, భాజపాకు 33.7శాతం మంది మద్దతిచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఆరుగురు జాట్‌ నేతలకు టికెట్లు ఇస్తే ఐదుగురు ఓడిపోయారు.

ఓబీసీల మద్దతుతో..

జాట్‌ల మద్దతు లేకపోయినా జాటేతరులు, ఓబీసీల అండతో భాజపా హరియాణాలో నెగ్గుకొస్తోంది. గత రెండు ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను సాధించడంద్వారా జాట్‌ల ఓట్లకు ప్రాధాన్యం లేకుండా చేయగలిగింది. ఇటీవలే పంజాబీ వర్గానికి చెందిన ఖట్టర్‌ను తప్పించి ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్‌ సింగ్‌ సైనీని ముఖ్యమంత్రిని చేసింది.


కాంగ్రెస్‌కు కలిసివచ్చేనా?

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేందర్‌సింగ్‌ హుడ్డా జాట్‌ల ఓట్లను స్థిరీకరించడంలో విజయం సాధించారు. ఇపుడు ఆయన  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే ప్రాధాన్యమిస్తున్నారు. మరో జాట్‌ నేత బీరేంద్ర సింగ్‌ కూడా పోటీ చేయడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికలు మినహా అన్నిసార్లూ జాట్‌లు కాంగ్రెస్‌కే మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం భూపేందర్‌ సింగ్‌ హుడ్డా, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, బీరేంద్ర సింగ్‌ లాంటి జాట్‌ నేతలతో కాంగ్రెస్‌ పటిష్ఠంగానే ఉంది.


చౌటాలాలకూ మద్దతు

జాట్‌ ఓట్లను ఐఎన్‌ఎల్‌డీ కూడా భారీగానే సాధించగలుగుతుంది. ఓం ప్రకాశ్‌ చౌటాలా ఉన్నప్పుడు కలిసి ఉన్న పార్టీ ఆ తర్వాత కుమారుల హయాంలో చీలిపోయింది. అజయ్‌ చౌటాలా జేజేపీని స్థాపించారు. ఆయన కుమారుడు దుశ్యంత్‌ 2019లో ఖట్టర్‌ ప్రభుత్వంలో చేరారు. ఇటీవలే బయటికొచ్చారు.


జేజేపీతో విడిపోవడమూ ఇబ్బందే

ఇటీవల జేజేపీతో విడిపోవడమూ భాజపాకు ఇబ్బందికరంగానే ఉంది. దీంతో జాట్‌ ఓటర్లను అది ప్రభావితం చేయలేకపోతోంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నా జాట్‌లలో విశ్వసనీయతను సాధించడంలో భాజపా విఫలమైంది. ప్రముఖ జాట్‌ నేతలైన ఓపీ ధన్‌ఖడ్‌, కెప్టెన్‌ అభిమన్యులను లోక్‌సభ ఎన్నికల్లో పట్టించుకోకపోవడమూ భాజపాకు ఇబ్బందికరంగానే మారింది. మరో జాట్‌ నేత బీరేంద్ర సింగ్‌ ఇటీవల భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని