కెప్టెన్‌గా రో‘హిట్‌’

కీలక ఆటగాళ్లు లేరు.. అయినా అతను బెదరలేదు. తొలి టెస్టులోనే ఓటమి ఎదురైంది.. అయినా అతను ఢీలా పడలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు మద్దతుగా నిలిచి.. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుని.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో జట్టును విజయతీరాల వైపు నడిపించాడు.

Updated : 11 Mar 2024 04:33 IST

ఈనాడు క్రీడావిభాగం

కీలక ఆటగాళ్లు లేరు.. అయినా అతను బెదరలేదు. తొలి టెస్టులోనే ఓటమి ఎదురైంది.. అయినా అతను ఢీలా పడలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు మద్దతుగా నిలిచి.. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుని.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో జట్టును విజయతీరాల వైపు నడిపించాడు. నాయకుడంటే.. సవాళ్లకు ముందు నిలిచేవాడు. సారథి అంటే.. ప్రతికూల పరిస్థితుల్లోనూ జట్టును గెలుపు వైపు మళ్లించేవాడు. తాజాగా ఇంగ్లిష్‌ జట్టుతో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ శర్మ అదే చేశాడు. నాయకత్వంతో మెప్పించి.. జట్టు 4-1తో సిరీస్‌ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్‌తో తాజాగా ముగిసిన సిరీస్‌ను పరిశీలిస్తే.. తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమ్‌ఇండియా అద్భుతంగా పుంజుకున్న తీరు కనిపిస్తుంది. ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా.. తామున్నామంటూ దూసుకొచ్చిన యువ క్రికెటర్ల సత్తా తెలుస్తుంది. పటిష్ఠమైన ప్రత్యర్థి బజ్‌బాల్‌ వ్యూహాన్ని చిత్తు చేసిన జట్టు తెగువ అర్థమవుతుంది. అయితే వీటన్నింటి వెనుక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ టెస్టులో పరాజయం తర్వాత అతను జట్టును నడిపించిన తీరు.. కుర్రాళ్లను ప్రోత్సహించిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఇప్పటివరకూ రోహిత్‌ కెప్టెన్సీ కెరీర్‌లోనే ఈ సిరీస్‌ కఠిన సవాలు విసిరింది. బజ్‌బాల్‌ అంటూ దూకుడుతో వచ్చిన ఇంగ్లాండ్‌ను స్వదేశంలో నిలువరించకపోతే తీవ్రమైన విమర్శలు తప్పేవి కావు. పైగా జట్టులో కుర్రాళ్లు. అంతర్జాతీయ అనుభవం లేని వాళ్లతో కలిసి సాగడం అంత సులువు కాదు. కానీ రోహిత్‌ అడ్డంకులను అధిగమించాడు.

వాళ్లు లేకపోయినా..

టెస్టుల్లో టీమ్‌ఇండియా సంధి దశలో ఉంది. దాదాపు దశాబ్ద కాలంగా జట్టులో మూడు, అయిదు స్థానాల్లో ఆడిన పుజారా, రహానె ఇప్పుడు లేరు. వీళ్ల స్థానాలను భర్తీ చేసే బాధ్యతను శుభ్‌మన్‌, శ్రేయస్‌ తీసుకున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కోహ్లి, షమి పూర్తిగా దూరమయ్యారు. గాయం తదితర కారణాలతో తొలి టెస్టు తర్వాత కేఎల్‌ రాహుల్‌, రెండో టెస్టు తర్వాత శ్రేయస్‌ అందుబాటులో లేకుండా పోయారు. రెండో టెస్టులో జడేజా ఆడలేదు. నాలుగో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌.. ఇలా ఈ సిరీస్‌లో అయిదుగురు టెస్టుల్లో అడుగుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టును నడిపించడమంటే సులువైన విషయం కాదు. కానీ అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుని రోహిత్‌ సాగిపోయాడు. కుర్రాళ్లకు అవకాశాలిస్తూ.. సరైన జట్టు కూర్పును ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎవరున్నా.. ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకే ప్రయత్నించాడు. అనుభవం లేని బ్యాటింగ్‌ ఆర్డర్‌పై నమ్మకం పెట్టాడు. ఇక రాజ్‌కోట్‌ టెస్టులో అశ్విన్‌ మధ్యలో వెళ్లివచ్చినా.. ఉన్న బౌలర్లనే సమర్థంగా వాడుకుని ఇంగ్లాండ్‌ వికెట్లు పడేలా చూశాడు.

కుర్రాళ్లకు మద్దతుగా..

ఒకప్పుడు కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ.. యువ రక్తంతో నిండిన జట్టును ధోని పరుగులు పెట్టించాడు. ఇప్పుడు రోహిత్‌ కూడా అలాగే సాగుతున్నాడు. యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నాడు. జట్టులో, డ్రెస్సింగ్‌ గదిలో ఉత్తమ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నాడు. ఎవరి ఆట వాళ్లు ఆడేలా స్వేచ్ఛనిస్తున్నాడు. కుర్రాళ్లతో కలిసిపోతూ.. సరదాగా ఉంటూ.. జట్టు బంధాన్ని పెంచుతున్నాడు. అందుకే యువ ఆటగాళ్లు చెప్పినట్లు వినేలా చేసే సమ్మోహన శక్తి రోహిత్‌కు ఉందని ప్రధాన కోచ్‌ ద్రవిడ్‌ అన్నాడు. అరంగేట్రంలో ఉండే ఒత్తిడిని యువ ఆటగాళ్లు తట్టుకునేలా రోహిత్‌ అండగా నిలిచాడు. రజత్‌ వరుసగా విఫలమైనా.. తొలి టెస్టు సిరీస్‌లో ఒత్తిడి ఉంటుందని, మద్దతుగా ఉంటామని రోహిత్‌ అన్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం రోజు అతని తండ్రి నౌషద్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అప్పుడు సర్ఫరాజ్‌ను తన చేతుల్లో పెడుతున్నానంటూ రోహిత్‌ను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు. ఓ కెప్టెన్‌ బాధ్యతను గుర్తుచేశాయి. ఆ బాధ్యతలను రోహిత్‌ సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. కుర్రాళ్లతో కుర్రాడిగా కలిసిపోతూ.. మరోవైపు సీనియర్‌గా జట్టు భారాన్ని మోస్తూ.. రోహిత్‌ తన    పాత్రను గొప్పగా పోషిస్తున్నాడు. తాజాగా గార్డెన్‌లో తిరిగే కుర్రాళ్లంటూ.. గిల్‌, యశస్వి, సర్ఫరాజ్‌, ధ్రువ్‌తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

బ్యాటింగ్‌తోనూ..

ఈ సిరీస్‌లో సారథిగా మెప్పించిన రోహిత్‌.. బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. సీనియర్‌ బ్యాటర్‌గా పరుగులు సాధిస్తూ.. కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 400 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఓ అర్ధశతకం ఉంది. రాజ్‌కోట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. ధర్మశాలలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో భారీ స్కోరుకు పునాది వేశాడు. రాంచి టెస్టులో ఛేదనలో కీలకమైన 55 పరుగులతో రాణించాడు. మూడు ఫార్మాట్లలోనూ వెయ్యి పరుగులు చేసిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. ధోని, కోహ్లి ముందున్నారు. ప్రపంచ క్రికెట్లో చూసుకుంటే బాబర్‌ అజాం, డుప్లెసిస్‌, విలియమ్సన్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్‌ఇండియా.. ఫైనల్‌ దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించే బాధ్యత రోహిత్‌దే. ఈ నేపథ్యంలో సారథిగా అతను దేశానికి ఒక ఐసీసీ ట్రోఫీ అందిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ.  

2022 మార్చిలో అన్ని ఫార్మాట్లలోనూ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారిన రోహిత్‌ సారథ్యంలో భారత్‌ ఇప్పటివరకూ 16 టెస్టుల్లో 10 విజయాలు సాధించింది. రెండు డ్రా చేసుకుంది. నాలుగింట్లో ఓడింది.


‘‘నేను కెప్టెన్‌ అయినప్పటి నుంచి ఎప్పుడూ పూర్తిస్థాయి జట్టుతో ఆడలేదు. అలా చెప్పి తప్పించుకోను. అందుబాటులో ఉన్న జట్టుతో కలిసి పనిచేయాలి. మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. స్వేచ్ఛగా ఆడనివ్వాలి. ఉన్న ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నా. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినందుకు సంతోషంగా ఉంది. కెప్టెన్‌గా నేనెక్కడ వెనుకబడ్డానో, విభిన్నంగా ఏమేం చేయాలో మరింతగా అర్థమైంది’’

రోహిత్‌శర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని