Gambhir : స్టెయిన్‌-మోర్కెల్‌ స్పెల్‌ అత్యుత్తమని సచినే చెప్పాడు: గంభీర్‌

టీమ్‌ఇండియా క్రికెట్‌ చరిత్రలో పదకొండేళ్ల క్రితం జరిగిన భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య...

Published : 08 Jan 2022 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెట్‌ చరిత్రలో పదకొండేళ్ల క్రితం (2010-11 సీజన్‌) జరిగిన భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అప్పటికే చెరో మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ విజేతను నిర్ణయించే ఆఖరి టెస్టులో టీమ్‌ఇండియా అద్భుత పోరాటంతో డ్రాగా ముగించడం.. సిరీస్‌ (1-1) కోల్పోకుండా స్వదేశానికి తిరిగి రావడం తెలిసిన విషయమే. ఆనాటి మ్యాచ్‌లో సఫారీల భీకరమైన పేస్‌బౌలింగ్‌ గురించి గౌతమ్‌ గంభీర్‌ ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడాడు. కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ (146, 14*) తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించగా.. గౌతమ్‌ గంభీర్‌ (93, 64) అర్ధశతకాలు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌, తొత్సెంబే వంటి ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడం ఇప్పటికీ గర్వంగా ఉంటుందని గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సచిన్‌-డేల్‌ స్టెయిన్‌ మధ్య పోరాటం ఆటకే హైలైట్‌.  నేను, సచిన్‌ కలిసి స్టెయిన్‌-మోర్కెల్‌ స్పెల్‌ను ఎదుర్కొన్నాం. తన టెస్టు కెరీర్‌లో ఎదుర్కొన్న బౌలింగ్‌ స్పెల్స్‌లో ఇదే అత్యుత్తమని సచిన్‌ చెప్పాడు. ఒక గంట టైమ్‌లో మేం కేవలం ఎనిమిది పరుగులే చేశాం. బ్యాటింగ్‌ను రొటేట్ చేయలేదు. కనీసం బ్యాటింగ్‌ ఎండ్‌ను కూడా మార్చుకోలేదు. వారి బౌలింగ్‌ ఎటాక్‌ ఎంత భయకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని తెలిపాడు. అంతేకాకుండా తాను ఎదుర్కొన్న బెస్ట్‌ ఫాస్ట్‌బౌలర్లలో మోర్నీ మోర్కెల్‌ ఒకడని అభినందించాడు. ‘‘నేను బ్రెట్‌లీ, షోయబ్‌ అక్తర్‌ వంటి ప్రపంచ శ్రేణి స్పీడ్ బౌలర్లను ఎదుర్కొన్నా. అయితే నేను ఫేస్‌ చేసిన అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లలో మోర్నీ మోర్కెల్‌ ఉంటాడు. అతడు ఎత్తుగా ఉండటం వల్ల సంధించే పేస్‌ను ఆడటం ఎప్పుడూ బ్యాటర్‌కు కఠినంగానే ఉండేది. మరీ ముఖ్యంగా నాకైతే కొంచెం కష్టతరమే’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో డేల్‌స్టెయిన్‌ (5/75) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 

భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1 సమం చేసింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్‌ డీన్ ఎల్గర్‌ (96*) చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి విజయతీరాలకు చేర్చాడు. జనవరి 11 నుంచి ఆఖరి టెస్టు మ్యాచ్‌ కేప్‌టౌన్‌ వేదికగా ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు