రాహుల్‌.. ఇదేం జట్టు?

పంజాబ్‌ కూర్పు ఏ మాత్రం బాగాలేదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా విమర్శించారు. అందుకే ఆ జట్టు గెలవాల్సిన మ్యాచులను ఓడిపోతోందని పేర్కొన్నారు. కివీస్‌ ఆటగాడు జేమ్స్‌ నీషమ్‌ ‘మ్యాచ్‌ విజేత’ కాడన్నారు. ముజీబుర్‌ రెహ్మాన్‌కు తుది జట్టులో చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ప్రపంచంలో ఇదేనని...

Published : 02 Oct 2020 14:36 IST

ముజీబ్‌కు చోటివ్వలేక పోతున్నారన్న ఆకాశ్‌ చోప్రా 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ కూర్పు ఏ మాత్రం బాగాలేదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా విమర్శించారు. అందుకే ఆ జట్టు గెలవాల్సిన మ్యాచులను ఓడిపోతోందని పేర్కొన్నారు. కివీస్‌ ఆటగాడు జేమ్స్‌ నీషమ్‌ ‘మ్యాచ్‌ విజేత’ కాడన్నారు. ముజీబుర్‌ రెహ్మాన్‌కు తుది జట్టులో చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ప్రపంచంలో ఇదేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. అబుదాబి వేదికగా ముంబయితో జరిగిన మ్యాచులో రాహుల్‌ సేన 48 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

‘నేను చెప్పేదొక్కటే. పంజాబ్‌ సరైన జట్టుతో ఆడటం లేదు. తుది జట్టులో ముజీబ్‌కు చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ఇదే. విదేశీ పేసరైన నీషమ్‌ను వారు ఆడిస్తున్నారు. అటు పవర్‌ప్లే, ఇటు డెత్‌లో అతడు బౌలింగ్‌ చేయలేడు. ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే అతడు మ్యాచ్‌ విజేత కాదు. నాలుగు, ఐదు స్థానాల్లో భారీ షాట్లు ఆడి గెలిపించలేడు. మరి అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకుంటున్నారు? గెలిపించలేని ఆటగాడిని ఆడించడం వల్ల లాభమేంటి?’ అని ఆకాశ్‌ ప్రశ్నించారు.

మహ్మద్‌ షమి సైతం టీమ్‌ఇండియాకు తొలి ప్రాధాన్యం ఉన్న డెత్‌బౌలర్‌ కాదని చోప్రా అన్నారు. ముంబయి మ్యాచులో 15 ఓవర్లకు ముందే కాట్రెల్‌ కోటాను పూర్తి చేయించారని విమర్శించారు. ‘ఇది ఏ రకమైన బౌలింగ్‌? మరి డెత్‌లో ఎవరితో వేయిస్తారు?కాట్రెల్‌ను మినహాయిస్తే మిగిలింది నీషమ్‌, గౌతమ్‌, షమి. టీమ్‌ఇండియాకు షమి తొలి ప్రాధాన్య డెత్‌ బౌలర్‌ కాదు. అందుకే 20వ ఓవర్‌ను గౌతమ్‌కు ఇచ్చారు. ఈ రోజుల్లో అనుభవజ్ఞులైన నరైన్‌, అశ్విన్‌, భజ్జీకి సైతం ఆఖరి ఓవర్‌ బంతి ఇవ్వడం లేదు కదా’ అని ఆయన అన్నారు. తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఆకాశ్‌వాణి’లో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని