Ravindra Jadeja: కెప్టెన్‌లా ఆలోచిస్తా.. ఫీల్డింగ్‌లో గొప్ప అనుకోను: రవీంద్ర జడేజా

భారత్ వరుసగా ఎనిమిది విజయాలు నమోదు చేసి వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికానూ 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

Updated : 06 Nov 2023 11:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాను (IND vs SA) 83 పరుగులకే ఆలౌట్ చేయడంలో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (5/33) కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఈ వరల్డ్‌ కప్‌లో 110 పరుగులు, 14 వికెట్లు తీశాడు. టీమ్‌ఇండియా విజేతగా నిలిచిన 2011 వరల్డ్‌ కప్‌లో యువరాజ్‌ సింగ్‌ నిర్వర్తించిన బాధ్యతలను ఈసారి జడ్డూ చేయడం విశేషం. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జడేజా (Ravindra Jadeja) మాట్లాడాడు. ఆల్‌రౌండర్‌గా తన పాత్ర ఏంటనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లు తెలిపాడు.

‘‘తొలి రోజు నుంచీ నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు 30-35 పరుగులు చేయడం.. కీలక సమయంలో వికెట్ తీసి బ్రేక్‌ ఇవ్వడం నా బాధ్యత. మ్యాచ్‌పై నా ప్రదర్శనతో ప్రభావం చూపించడానికే ప్రయత్నిస్తా. ఇక ఫీల్డింగ్‌లో నేనే గొప్ప అని భావించను. క్యాచ్‌ను కూడా మిస్‌ చేశా. అయితే, ఎప్పటికప్పుడు సన్నద్ధమవుతూనే ఉంటా. ఒక క్యాచ్‌ పట్టగానే.. మైదానంలో రిలాక్స్‌ అయిపోను. మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. కొన్నిసార్లు అందుకోలేకపోవచ్చు. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపను.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఫాస్ట్‌ బౌలర్లు త్వరగా వికెట్లు తీయడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. నేను లైన్ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేశా. కీలక మ్యాచుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించడం ఆనందంగా ఉంది. నా ఆటపట్ల నాకెప్పుడూ నమ్మకం ఉంటుంది. పేసర్లు ఆరంభంలోనే వికెట్లను అందించడం వల్ల స్పిన్నర్లకు మరింత సులువవుతుంది. నాకౌట్‌ దశలోనూ ఇదే ఆటతీరును ప్రదర్శిస్తామని భావిస్తున్నా’’ అని రవీంద్ర జడేజా వెల్లడించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 49వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో సచిన్‌ (49) వన్డే శతకాల రికార్డును సమం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్ (77) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో జడేజా (29*), సూర్యకుమార్ యాదవ్ (22) దూకుడుగా ఆడేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని