గ్రహాంతర ధూళి వెల్లువ

గనుల తవ్వకాలు, వాహనాల కాలుష్యం ఇతరత్రా కారణాల వల్ల మన వాతావరణంలో ధూళి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే....

Published : 12 May 2021 00:12 IST

నుల తవ్వకాలు, వాహనాల కాలుష్యం ఇతరత్రా కారణాల వల్ల మన వాతావరణంలో ధూళి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కానీ, అంతరిక్షం నుంచి కూడా ధూళి ముంచెత్తుతోందని తెలుసా! ఫ్రెంచ్‌ పోలార్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో ఫ్రెంచ్‌ జాతీయ శాస్త్ర పరిశోధన కేంద్రం (సీఎన్‌ఆర్‌ఎస్‌), పారిస్‌ శాక్లే యూనివర్సిటీ, నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నిర్వహించిన పరిశోధన ప్రకారం తోకచుక్కలు, లఘు గ్రహాలు (ఆస్టరాయిడ్ల) నుంచి ఏటా 5,200 టన్నుల సూక్ష్మ ఉల్కలు మన భూమిని తాకుతున్నాయి. ఇవి భూ వాతావరణంలో రాగానే నిప్పు కణికల్లా మండిపోతాయి. వాటిలో కొన్ని సూక్ష్మ ఉల్కలుగా భూమిని చేరతాయి. ఇవి మిల్లీమీటరులో పదో వంతు నుంచి వందో వంతు వరకు ఉంటాయి. ఈ సూక్ష్మ ధూళిని సేకరించటానికి, వీటి గురించి అధ్యయనం చేయటానికి సీఎన్‌ఆర్‌ఎస్‌ పరిశోధకులు జీన్‌ దుప్రట్‌ నేతృత్వంలో రెండు దశాబ్దాలుగా అంటార్కిటికాలోని ఫ్రాంకో-ఇటాలియన్‌ కన్‌కోర్డియా స్టేషన్‌ (డోమ్‌ సి) వద్ద ఆరు అన్వేష యాత్రలు నిర్వహించారు. ఇక్కడ మంచు సాంద్రత తక్కువ. భూగోళం నుంచి వచ్చే ధూళి కూడా ఉండదు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఒక చదరపు మీటరు ప్రాంతంలో పడే అంతరిక్ష ధూళిని పరిశీలించి ఆ ప్రకారం భూగోళం మొత్తానికి లెక్కగట్టారు. ఇలా చూస్తే ఏటా 5 వేల టన్నులకు పైగా సూక్ష్మ ఉల్కలు భూమిని చేరుతున్నాయి! వీటిలో దాదాపు 80 శాతం తోకచ్కుల నుంచి, మిగిలినవి ఆస్టరాయిడ్ల నుంచి వస్తున్నట్లు అంచనా. భూమి పుట్టినప్పుడు నీరు, కర్బన అణువులు ఏర్పడటంలో ఇవి ఎలాంటి పాత్ర పోషించాయన్నది అర్థం చేసుకోటానికి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని