WhastApp: తీసేసిన ఫీచర్‌ను తిరిగి తీసుకొస్తున్న వాట్సాప్‌!

వాట్సాప్‌ గతేడాది తొలగించిన ఓ ఫీచర్‌ను తిరిగి పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వెబ్, మొబైల్‌ యాప్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంది. పరీక్షల అనంతరం డెస్క్‌టాప్‌ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది.

Updated : 02 Jan 2023 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా (Social Media) సంస్థలు తమ పోటీదారుకంటే మెరుగైన సేవలు అందిస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం  చేయడం, భద్రతాపరమైన లోపాలను సరిచేయడం వంటివి చేస్తుంటాయి. అలానే, యూజర్‌ డిమాండ్‌లేని ఫీచర్లతోపాటు, కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను సైతం తొలగిస్తుంటాయి. కొద్దిరోజుల తర్వాత వాటిని అప్‌డేట్‌ చేసి తిరిగి లైవ్‌లోకి తీసుకొస్తాయి. తాజాగా వాట్సాప్‌ ( WhatsApp) సైతం ఇదే విధానాన్ని పాటిస్తోంది. గతేడాది తొలగించిన ఓ ఫీచర్‌ను తిరిగి మళ్లీ తీసుకొస్తోంది. ఇంతకీ ఆ ఫీచర్‌ ఏంటంటే..?

వాట్సాప్‌లో ఒకటి కంటే ఎక్కువ మెసేజ్‌లను ఒకేసారి సెలెక్ట్‌ చేసి ఇతరులకు పంపేందుకు లేదా డిలీట్ చేసేందుకు మల్టీపుల్‌ చాట్‌ సెలక్షన్‌ (Multiple Cgat Selection) ఫీచర్‌ను ఉపయోగిస్తాం. గతేడాది ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌ యాప్‌ నుంచి వాట్సాప్‌ తొలగించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌ వెర్షన్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను సెలెక్ట్ చాట్స్‌ (Select Chats) పేరుతో డెస్క్‌టాప్‌ యాప్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ ఫీచర్‌ను తిరిగి లైవ్‌లోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోందట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న సెలెక్ట్ చాట్స్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్లు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మెసేజ్‌లను సెలెక్ట్ చేసి ఫార్వార్డ్‌, డిలీట్ లేదా మ్యూట్ చేయొచ్చు. 

దీంతో పాటు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది. యూజర్లు తమకు నచ్చిన టెక్ట్స్‌, మీడియాఫైల్స్‌ లేదా వెబ్‌ లింక్‌లను ఇతరులు చూసేలా స్టేటస్‌లో పెట్టుకుంటారు. వాటిపై ఇతర యూజర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాట్సాప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌ రిపోర్ట్ అనే ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని