WhatsApp: వాట్సాప్‌లో రాబోయే కొత్త ఫీచర్లివే... 10 పాయింట్లలో వివరాలు!

యూజర్లకు మెరుగైన సేవలందించేదుకు వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లు ఏంటి? వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయనేది తెలుసుకుందాం. 

Published : 10 Jun 2022 14:33 IST

యూజర్లకు మెరుగైన సేవలందించేదుకు వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే ఎమోజీ రియాక్షన్‌, మల్టీ డివైజ్‌, ఆడియో ప్రివ్యూ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. మరికొన్ని ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. మరి వాట్సాప్‌ తీసుకొస్తున్న ఆ కొత్త ఫీచర్లు (WhatsApp New Features) ఏంటి? వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయనేది తెలుసుకుందాం

  1. గతంలో వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌లో కనిపించే వెబ్‌ లింక్‌ వివరాలు తెలుసుకోవాలంటే దానిపై తప్పక క్లిక్ చేయాల్సిందే. కానీ, వాట్సాప్‌ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న ఫీచర్‌తో స్టేటస్‌ అప్‌డేట్‌లో వెబ్‌ లింక్ షేర్‌ చేస్తే దానికి సబంధించిన ప్రాథమిక సమాచారం కూడా అందులో కనిపిస్తుంది. 
  2. డిస్‌అప్పియరింగ్‌ ఫీచర్‌లో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్‌తో యూజర్లు ఒకేసారి మల్టీపుల్‌ చాట్‌లను డిలీట్‌ చేయొచ్చు. అంతేకాకుండా డిస్‌అప్పియరింగ్ ఫీచర్ ఎనేబుల్‌ చేసి పంపిన మెసేజ్‌లలో ముఖ్యమైనవి ఉంటే, అవి డిలీట్ కాకుండా యూజర్‌ వాటిని సేవ్‌ చేసుకునేలా మరో అదనపు ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేయనుంది. 
  3. ఇతరులకు పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులుంటే దాన్ని ఎడిట్ చేసుకునే ఫీచర్‌ ఉంటే బావుంటుందని ఎంతో కాలంగా యూజర్లు కోరుతున్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం వాట్సాప్‌ త్వరలో మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. మెసేజ్‌ పంపిన తర్వాత దాన్ని  సెలెక్ట్ చేస్తే కాపీ (Copy), ఫార్వార్డ్ (Forward) వంటి ఆప్షన్లతో పాటు కొత్తగా ఎడిట్‌ (Edit) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మెసేజ్‌లో మార్పులు చేసుకోవచ్చు. 
  4. వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానున్న మరో ముఖ్యమైన ఫీచర్‌ ‘అన్‌డు మెసేజ్‌ డిలీషన్‌’ (Undo Message Deletion). వాట్సాప్‌ చాట్‌ పేజీ నుంచి మెసేజ్‌ డిలీట్ చేసిన తర్వాత, తిరిగి దాన్ని పొందాలనుకుంటే పేజ్‌ కింద భాగంలో మెసేజ్‌ డిలీటెడ్‌ అన్‌డూ (Message Deleted Undo) అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే మెసేజ్‌ తిరిగి చాట్ పేజ్‌లో కనిపిస్తుంది. 
  5. యూజర్ల మధ్య చాట్‌ సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పించినట్లుగానే ఖాతాల భద్రత కోసం వాట్సాప్‌ డబుల్ వెరిఫికేషన్‌ కోడ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు కొత్తగా ఏదైనా అదనపు డివైజ్‌లో వాట్సాప్‌ లాగిన్‌ కావాలంటే రెండు దశల్లో వెరిఫికేషన్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.   
  6. ఏదైనా కారణంచేత వాట్సాప్‌ గ్రూపులోంచి బయటకు రావాలంటే ఇతర సభ్యులు ఏమనుకుంటారో అని సందేహిస్తాం. ఎందుకుంటే మనం గ్రూపు నుంచి బయటికి వచ్చినట్లు అందరికీ తెలుస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్‌ త్వరలో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో మనం గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయినా.. అడ్మిన్‌ సహా ఇతర సభ్యులకు తెలియదు. 
  7. వాట్సాప్‌లో గతంలో జరిగిన చాట్‌ సంభాషణలను సులువుగా వెతికేందుకు వీలుగా మరో కొత్త ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. చాట్‌ ఫిల్టర్‌ పేరుతో వస్తోన్న ఈ ఫీచర్‌లో కాంటాక్ట్స్‌, గ్రూప్స్‌, నాన్‌-కాంటాక్ట్స్‌, అన్‌రీడ్ చాట్స్‌ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. యూజర్లు వాటిలో ఏదైనా ఒక ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆ కేటగిరీ మెసేజ్‌లు చాట్ పేజ్‌లో కనిపిస్తాయి. 
  8. ప్రస్తుతం ఉన్న గ్రూప్స్‌ ఫీచర్‌కి భిన్నంగా కమ్యూనిటీ అనే ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలో పరిచయం చేయనుంది. ఇందులో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే కమ్యూనిటీకి అడ్మిన్‌గా ఉన్న వ్యక్తి అన్ని గ్రూపులకు మెసేజ్‌లు పంపవచ్చు. కమ్యూనిటీలోని సభ్యులు ఇతర సభ్యులతో సంభాషించాలా? వద్దా? అనేది కూడా అడ్మిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 
  9. వాట్సాప్‌ బిజినెస్‌ యూజర్ల కోసం డివైజ్‌ రీనేమ్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో బిజినెస్‌ ఖాతాదారులు ఉపయోగించే డివైజ్‌లకు తమకు నచ్చిన పేరును మార్చుకోవచ్చు. ఒకవేళ యూజర్ ఏదైనా డివైజ్‌లో లాగౌట్‌ చేయడం మరిచిపోయినా..మొబైల్‌లోని మల్టీ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా సులువుగా సదరు డివైజ్‌ నుంచి లాగౌట్ చేయొచ్చు. 
  10. ఐప్యాడ్‌ వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి మల్టీ డివైజ్‌ 2.0 వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా వాట్సాప్‌ యూజర్లు భవిష్యత్తులో ఒకే ఖాతాను మొబైల్‌, టాబ్లెట్‌కు లింక్‌ చేసుకొని వాడుకోవచ్చు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని