ఛూమంతర్‌.. భూమాయ!

ఆకాశాన్నంటుతున్న భూముల విలువలు అవకాశవాదులకు రూ.కోట్లు కురిపిస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్థిరాస్తి మోసాలు మామూలయ్యాయి. పోలీస్‌స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో 40 శాతం ఇలాంటివే ఉంటున్నాయి. ఏటా రూ.వందల కోట్లలో జరుగుతున్న ఈ తరహా మోసాలు ఎప్పటికప్పుడు కొత్త రూపు ధరిస్తున్నాయి

Published : 09 Dec 2021 05:00 IST

స్థిరాస్తి గాలం.. మొదటికే మోసం
మాయగాళ్ల లీలలు ఎన్నో
ఏటా రూ. వందల కోట్ల మేర వంచన
ఈనాడు - హైదరాబాద్‌

ఆకాశాన్నంటుతున్న భూముల విలువలు అవకాశవాదులకు రూ.కోట్లు కురిపిస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్థిరాస్తి మోసాలు మామూలయ్యాయి. పోలీస్‌స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో 40 శాతం ఇలాంటివే ఉంటున్నాయి. ఏటా రూ.వందల కోట్లలో జరుగుతున్న ఈ తరహా మోసాలు ఎప్పటికప్పుడు కొత్త రూపు ధరిస్తున్నాయి. ఒకరిద్దరు స్థిరాస్తి వ్యాపారులు కలిసి ముందుగా ఎకరం భూమి నామమాత్రపు ధరకు కొంటారు. అందులో వాణిజ్య సముదాయం నిర్మిస్తానని పెట్టుబడులు ఆకర్షిస్తారు. నమ్మకం కలిగించేందుకు ఒక్కొక్కరికి అవిభాజ్య వాటాగా 30 గజాల చొప్పున ఒప్పంద పత్రం రాసిస్తారు. ఎకరాకు 4,840 గజాల స్థలం వస్తుంది. డెవలప్‌మెంట్‌కు వదలగా మిగిలిన 3,000 గజాల స్థలాన్ని 100 మందికి తలా 30 గజాలను రూ. 50 లక్షల చొప్పున అమ్ముతారు. అంటే రూ. 50 కోట్ల ఆర్జన. మరే వ్యాపారంలోనూ ఇంత కళ్లు చెదిరే సంపాదన ఉండదు! అనుమతులు వచ్చాక అభివృద్ధి పేరుతో వాటాలు కొన్న వారితో     మళ్లీ ఒప్పందం చేసుకుంటారు.
లేని భూమి ఉన్నట్లు..: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భూమి కొనుక్కోవడం సామాన్యులకు కలలా మారింది. ఇదే అదునుగా లేని భూమి ఉన్నట్లు నమ్మించి ఎడాపెడా అమ్మేస్తున్నారు. తీరా కొనుక్కున్నవారు స్థలం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు అసలు యజమానులు రంగంలోకి దిగుతున్నారు. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు చిరు వ్యాపారులను దళారులు ఇలానే బోల్తా కొట్టించారు. వారిద్దరూ చెరో వంద గజాలు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక స్థలానికి కంచె వేసుకునేందుకు వెళ్లగా అసలు బండారం బయటపడింది. ధ్రువపత్రాల్లో సర్వే నంబరు, స్థలం వివరాలు ఉన్నప్పటికీ వాస్తవంగా అక్కడ భూమి లేదు. దీంతో దళారులను నిలదీస్తే తమకేం సంబంధం లేదని చేతులెత్తేశారు.

వెంచర్‌ పేరుతో
స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాం.. పెట్టుబడి పెట్టండి. భారీగా లాభాలు వస్తాయంటూ కొందరు ప్రచారంతో ఊదరగొడుతుంటారు. భూమి కొనకముందే అన్ని అనుమతులూ వచ్చినట్లు నమ్మిస్తారు. అందమైన బ్రోచర్లు.. ఫ్లెక్సీలు తయారుచేస్తారు. తీరా పెట్టుబడి పెట్టాక అసలు విషయం తెలుస్తుంది. లాభం సంగతి దేవుడెరుగు పెట్టిన డబ్బు కూడా తిరిగిరాదు. ఈ మోసాలు ఏకంగా దేశం దాటిపోయాయి. కాంబోడియాలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ పేరుతో హైదరాబాద్‌వాసి నుంచి రూ.4 కోట్లు కొల్లగొట్టిన ఉదంతంపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంధ్యా కన్వెన్షన్‌ శ్రీధర్‌రావుదీ ఇదే తీరు.

ప్రీ లాంచింగ్‌ ఆఫర్‌
నిర్మాణం మొదలుకాకముందే కొనుక్కుంటే తక్కువ ధరకు ఇస్తామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆశపడి డబ్బు కట్టిన వారికి ఆనక చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని సంస్థలు సకాలంలో నిర్మాణం పూర్తి చేస్తున్నా మరికొందరు దీన్నో అవకాశంగా మలచుకొని అనుమతులు రాని వెంచర్లకూ డబ్బువసూలు చేస్తున్నారు. చెప్పిన సమయానికి పూర్తిచేయకుండా చుక్కలు చూపిస్తున్నారు.

డబుల్‌ రిజిస్ట్రేషన్లు
ఇప్పుడు ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి రిజిస్టర్‌ చేయడం మామూలైపోయింది. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఓ చిరుద్యోగి దాచిపెట్టుకున్న డబ్బుతో ఇటీవల 150 గజాల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించగానే మరో వ్యక్తి వచ్చాడు. ఆ స్థలం పదేళ్ల క్రితమే తాను కొనుక్కున్నట్లు చెబుతూపత్రాలన్నీ చూపించాడు. దాంతో బాధితుడు తమకు స్థలం అమ్మిన వ్యక్తిని నిలదీస్తే, పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసుకొమ్మని అతడు బెదిరించాడు.

అన్నీ చూసుకోవలసిందే..  
ఆస్తులు కొనే ముందు దస్త్రాలు, అనుమతులు, ఆస్తి వివరాల వంటివాటిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. లేకపోతే తిప్పలు తప్పవు. ఉదాహరణకు ఏదైనా లేఅవుట్‌లో ప్లాట్‌ కొంటుంటే దానికి పంచాయతీ, పురపాలక సంస్థల అనుమతి ఉందో, లేదో చూసుకోవాలి. అవసరమైతే ఆ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీయాలి. కొనే ఆస్తి ఏదయినా ప్రభుత్వం జారీ చేసిన నిషేధిత చట్టం పరిధిలో లేదని నిర్ధారించుకోవాలి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ వివరాలు ఉంటాయి. లింకు డాక్యుమెంట్లు అన్నీ ముందుగానే తెప్పించుకొని చూసుకోవాలి. వాటిలో పేరు, ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు ఒకేలా ఉన్నాయో, లేవో పరిశీలించాలి. అమ్మకందారు వారసుల సమ్మతి తీసుకోవాలి. సదరు ఆస్తి తాకట్టులో లేదని నిర్ధారించుకోవాలి. ఇక జనరల్‌ పవరాఫ్‌ అటార్నీ వంటివి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదు అయిందో, లేదో తెలుసుకోవాలి. కొనే ముందే స్థలం సర్వే చేయించుకోవాలి. కొన్న వెంటనే సరిహద్దు రాళ్లు పాతించుకొని తరచూ వెళ్లి పరిశీలిస్తుండాలి.

నిర్మాణాల విషయంలో
* నగరం, శివార్లలో నిర్మాణాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి అనుమతి ఉందో లేదో నిర్ధారించుకోవాలి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్లలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలు పొందుపరుస్తున్నారు. సంబంధిత కార్యాలయంలో సంప్రదించి కూడా నిర్ధారించుకోవచ్చు.
* లేఅవుట్లు అయితే హెచ్‌ఎండీఏ/ డీటీసీపీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అనుమతి  కోసం దరఖాస్తు  చేశారా? అనుమతి వచ్చిందా అనేది నిర్ధారించుకోవాలి.
* జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చాక ప్రతి ప్రాజెక్టును స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (రెరా)లో రిజిస్టర్‌ చేయించాలి. అన్నీ పరిశీలించాక రెరా నంబరు కేటాయిస్తారు. కాబట్టి తెలంగాణ రెరా వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవచ్చు.

నయావంచన-2
ఇటీవల సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇలానే ఓ స్థిరాస్తి వ్యాపారి భూయజమానితో జీపీఏ చేసుకొని రూ. 10 కోట్లకు కొన్న ఎకరం స్థలం మీద రూ. 150 కోట్లు రాబట్టాడు. దాంతో భూయజమానికి    ఆశపుట్టింది. మధ్యలో ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్యా వివాదం మొదలైంది.పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఇలాంటి వెంచర్లు రాజధాని చుట్టుపక్కల 150 వరకూ నడుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరు ప్రధానంగా ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని