Millionaires Migration: భారత్‌ నుంచి సంపన్నుల వలసలు.. ఈ ఏడాది 6500 మంది!

భారత్‌ నుంచి ఈ ఏడాది 6500 మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లే (Millionaires Migration) అవకాశం ఉందని తాజా నివేదిక వెల్లడించింది.

Updated : 14 Jun 2023 20:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిపోయే సంపన్నుల (Millionaires Migration) సంఖ్య భారీగా ఉంటోంది. కేవలం 2023లోనే సుమారు 6500 మంది అత్యధిక ఆదాయం కలిగిన వ్యక్తులు (HNWI) దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే ‘హెన్లీ ప్రైవేట్‌ మైగ్రేషన్‌ నివేదిక-2023’ ఈ వివరాలను వెల్లడించింది. హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ (Henley and Partners) ప్రకారం.. 10లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే వారిని మిలియనీర్లు లేదా అత్యధిక సంపద కలిగిన వ్యక్తులుగా (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) పరిగణిస్తుంది.

సంపన్నులను కోల్పోబోతున్న దేశాల జాబితాలో ఈ ఏడాది చైనా ముందు నిలిచింది. 2023లో చైనా నుంచి దాదాపు 13,500 మంది హెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు వలస వెళ్తారని అంచనా. తర్వాతి స్థానంలో భారత్‌ ఉన్నప్పటికీ.. గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య తక్కువే. గతేడాదిలో భారత్‌ నుంచి 7500 సంపన్నులు వలస వెళ్లారని అంచనా. ఈ ఏడాది వెళ్లేవారిలో ఎక్కువగా.. దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు వలస వెళ్తున్నట్లు తేలింది. ఇక యూకే నుంచి 3200 మంది, రష్యా నుంచి 3వేల మంది వెళ్లిపోనున్నారట. బ్రిటన్‌లో ఈ సంఖ్య గతేడాదితో (1600 మంది) పోలిస్తే రెట్టింపుగా ఉంది. ఇలా గడిచిన దశాబ్ద కాలంగా మిలియనీర్ల వలసల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ సీఈవో డాక్టర్‌ జుయెర్జ్‌ స్టెఫెన్‌ పేర్కొన్నారు.

భారత్‌ నుంచి భారీ సంఖ్యలో వెళ్లిపోతున్నప్పటికీ అంతకుమించిన సంఖ్యలో మిలియనీర్లు తయారవుతున్నారని న్యూ వరల్డ్‌ వెల్త్‌కు చెందిన పరిశోధకుడు ఆండ్రూ ఆమోయిల్స్‌ పేర్కొన్నారు. అందుకే ఇలా భారత్ నుంచి వలసలు ఉంటున్నప్పటికీ ప్రమాదం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. అయితే, విదేశీ పన్ను చెల్లింపులకు సంబంధించి భారత్‌లో కఠిన నిబంధనలు ఉండటం వంటి సమస్యలు విదేశాల్లో పెట్టుబడుల ఆసక్తికి  కారణమవుతున్నాయని మార్కెట్‌ నిపుణురాలు సునితా సింగ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని