Pakistan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు!

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు పదేళ్ల జైలు శిక్ష పడింది.

Updated : 30 Jan 2024 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్‌ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.

ఇమ్రాన్‌ దోషిగా తేలితే.. పార్టీకి నిషేధం ముప్పు!

తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. అయితే, ఆ వెంటనే సైఫర్‌ కేసులో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఈ కేసులో పాక్‌ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతేడాది సెప్టెంబర్‌లో ఇమ్రాన్‌ ఖాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నైన్‌ జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా వారికి పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఏమిటీ సైఫర్‌ కేసు..?

అమెరికాలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం మార్చి 2022లో ఓ కీలక అంశాన్ని పాక్‌కు చేరవేసినట్లు సమాచారం. పీటీఐ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందన్నది దాని సారాంశం. అదే ఏడాది ఇమ్రాన్‌ ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ కొన్ని పత్రాలు చేతితో పట్టుకొని చూపించారు. అమెరికాలోని పాక్‌ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లు చెప్పారు. దీంతో అఫీషియల్‌ సీక్రెట్స్‌ యాక్టును (Official Secrets Act) ఉల్లంఘించారనే అభియోగాలతో ఆయనతోపాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీలపై కేసు నమోదయ్యింది. ఈ కేసులోనే వీరికి తాజాగా శిక్ష పడింది.

150 కేసులు..

ఇమ్రాన్‌ ఖాన్‌పై 2022 మార్చిలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధానమంత్రి పదవిని వీడాల్సి వచ్చింది. అనంతరం ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 150 కేసులు నమోదైనట్లు అంచనా. తాజా తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని పీటీఐ తెలిపింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ కీలక తీర్పు వెలువడటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని