Israel - Hamas Conflict: దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్‌ దళాలు.. పాలస్తీనా ప్రధానికి జైశంకర్‌ ఫోన్

హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో గాజాలో మానవతా సాయంపై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Updated : 10 Dec 2023 12:26 IST

టెల్‌ అవీవ్‌/గాజా: ఇజ్రాయెల్‌ (Israel), హమాస్‌ (Hamas) కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి (UN)లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా (USA) అడ్డుకున్న తర్వాత గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తీవ్రతరం చేశాయి. ఆదివారం ఉదయం దక్షిణ గాజాలోని ఖాన్‌ యునిస్‌ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేసినట్లు హమాస్‌ తెలిపింది. మరోవైపు హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) పునరుద్ఘాటించారు.

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం కావడంతో ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. మానవతా సాయం అందక ఎంతో మంది సామాన్య పౌరులు ఆకలి, వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 17,700 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారని హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 40 శాతం మంది 18 ఏళ్లలోపు పిల్లలే ఉంటారని తెలిపింది. 

కార్గిల్‌ చొరబాట్లను నేను వ్యతిరేకించా

పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) శనివారం రాత్రి పాలస్తీనా (Palestine) ప్రధాని మహమ్మద్‌ ష్టయ్యేహ్‌ (Mohammad Shtayyeh)తో ఫోన్‌లో మాట్లాడారు.  ‘‘పాలస్తీనా ప్రధానితో మాట్లాడాను. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనాపై భారత్‌ దీర్ఘకాలిక వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశాను’’ అని జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని