Kim Jong Un: స్వయంగా యుద్ధ ట్యాంకు నడిపిన కిమ్‌

Kim Jong Un: నిరంతరం యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైన ఉత్తర కొరియా తాజాగా ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది. అందులో ఆ దేశ అధినేత స్వయంగా యుద్ధ ట్యాంకును నడపడం గమనార్హం.

Published : 14 Mar 2024 11:35 IST

Kim Jong Un | సియోల్‌: ఉత్తర కొరియా ఈ మధ్య కాలంలో నిరంతర యుద్ధ సన్నద్ధత, ఆయుధాల ప్రయోగ పరీక్షలతో వార్తల్లో నిలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, పొరుగుదేశం దక్షిణ కొరియాకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తోంది. స్వయంగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ఎప్పటికప్పుడు సైనిక సన్నద్ధతను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆయన సొంతంగా ఓ యుద్ధ ట్యాంకును నడిపినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. వాటికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.

సైనికుల్లో స్ఫూర్తి నింపేందుకు స్వయంగా కిమ్‌ (Kim Jong Un) రంగంలోకి దిగినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. ఇటీవల అభివృద్ధి చేసిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ట్యాంకుల’ పనితీరును సైనికులతో ఆయన పర్యవేక్షించినట్లు తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. వీటిని ఉత్తర కొరియా తమపై ఆక్రమణకు సన్నాహకంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిస్పందనగా ట్యాంకులతో తమ పాటవాన్ని ప్రదర్శిస్తోంది.

సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే అణు దాడి చేస్తాం

భారీ యుద్ధ ట్యాంకులతో చేసిన విన్యాసాల్లో ఉత్తర కొరియా సైన్యం అత్యంత కఠిన పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. డమ్మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు చెప్పింది. 2022 ఆరంభం నుంచి ఈ దేశం నిరంతరం క్షిపణులు, అత్యాధునిక తుపాకులు సహా వివిధ రకాల ఆయుధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని