ఆ వృద్ధుల చేతులు అద్భుతాలు చేస్తున్నాయి!

దిక్కూమొక్కూ లేకుండా ఓ పెద్దావిడ నడిరోడ్డుమీద కళ్లుమూయడం చూసిన అతడు కదిలిపోయాడు. అలాంటి వాళ్లకోసం తనవంతుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని చివరకు ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేశాడు.

Updated : 26 Mar 2023 07:02 IST

ఆ వృద్ధుల చేతులు అద్భుతాలు చేస్తున్నాయి!

దిక్కూమొక్కూ లేకుండా ఓ పెద్దావిడ నడిరోడ్డుమీద కళ్లుమూయడం చూసిన అతడు కదిలిపోయాడు. అలాంటి వాళ్లకోసం తనవంతుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని చివరకు ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేశాడు. అక్కడితోనే ఆగిపోకుండా... వాళ్లకు టెర్రకోట వస్తువుల తయారీలో శిక్షణా ఇప్పించాడు. ఇప్పుడు ఆ వృద్ధులు తయారుచేసే టెర్రకోట నగలూ, వంటింటి సామగ్రీ దేశవిదేశాల్లో అమ్ముడవుతున్నాయి. వాటినుంచి వచ్చే ఆదాయంతో వాళ్ల జీవితమూ సాఫీగా సాగిపోతోంది.

ఈ రోజుల్లో వృద్ధులు రోడ్డున

పడటానికి రకరకాల కారణాలు. ఇంట్లోంచి బయటకు వచ్చాక వాళ్లకు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక... ఎవరైనా దయతలచి ఇచ్చింది తింటూ రోడ్డుమీదే తమ జీవితాల్ని వెళ్లదీస్తుంటారు. అలాంటివాళ్లకు ఓ నీడను కల్పించాలని వెలుగు ఆశ్రమాన్ని ప్రారంభించాడు ఖలీలుల్లా షరీఫ్‌షా. ‘ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తే. బండిమీద వెళ్తుంటే డివైడర్‌కు అవతలివైపు ఓ పెద్దావిడ పడిపోయి ఉంది. చుట్టూ తిరిగి వెళ్లి చూసేసరికి... దాహం దాహం అంటూనే ప్రాణం విడిచిందావిడ. అటువైపు ఎంతోమంది తిరుగుతున్నారు కానీ... ఆమెను పట్టించుకున్నవాళ్లే లేరు.

ఇంటికొచ్చాకా ఆ పెద్దావిడే గుర్తొచ్చేది. చివరకు మా నాన్న సలహాతో సొంత డబ్బులతోనే ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేశా’నని చెప్పే ఖలీల్‌బాబు స్వస్థలం ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామం. తండ్రి సూఫీ మత గురువు. కొన్నాళ్లకు ఖలీల్‌ కుటుంబం విజయనగరంలో స్థిరపడటంతో బాబామెట్టలో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఆ వృద్ధులకు చల్లని నీడనిచ్చి వేళకింత తిండి పెడుతున్నా ఆ పెద్దవాళ్లలో ఏదో అసంతృప్తి. వాళ్లల్లో కొందరు తమ పరిస్థితిని తలుచుకుని మానసికంగా కుంగిపోతే... మరికొందరిలో విపరీతమైన కోపం, అసహనం కనిపించేవి. అవన్నీ చూశాక వాళ్లకు ఇంకేదో చేయాల్సిన అవసరం ఉందనుకున్నాడు.  

శిక్షణ ఇప్పించి మరీ...

ఆ పెద్దవాళ్లకు ఒక వ్యాపకం కల్పిస్తే తమ బాధల్ని మర్చిపోతారని భావించిన ఖలీల్‌... మట్టి వస్తువుల తయారీలో శిక్షణ ఇప్పించాడు. శిక్షకుడి సూచనలతో మొదట కొన్ని జపమాలల్ని తయారుచేశారు. ఓసారి ఆశ్రమం చూడ్డానికి వచ్చిన కొందరు.. వాటన్నింటినీ కొనుక్కోవడంతో ఆ పెద్దవాళ్లలో ఇంకేదో చేయాలనే తపన మొదలైంది. దాంతో ఖాళీ సమయంలో జపమాలల్ని తయారుచేయడమే పనిగా పెట్టుకున్నారు. అలా అయిదు వందలవరకూ చేయడంతో అవీ అమ్ముడుపోయాయి. క్రమంగా రకరకాల డిజైన్లలో నగలూ, వంటింటి సామగ్రి, నీళ్లసీసాలూ, ఆటవస్తువులూ... ఇలా వందరకాలకు పైగా వస్తువుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ ఆశ్రమం గురించి ఆ నోటా ఈనోటా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వృద్ధులకూ తెలియడంతో వాళ్లూ వచ్చి... తమకు ఏదో ఒక పని కల్పించమని అడిగారు. దాంతో పనిచేయగలిగిన పెద్దవాళ్లకు కూడా శిక్షణ ఇప్పించాడు ఖలీల్‌. అలా బయటినుంచి వచ్చినవాళ్లకు జీతం కూడా ఇస్తున్నాడు. క్రమంగా ఆ పెద్దవాళ్లందరికీ వేళకు ఆహారం అందడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించడం వల్ల...తమ బాధల్ని మర్చిపోయి మరింత ఉత్సాహంతో రకరకాల వస్తువులు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలకు అమ్ముతూనే... అమెరికా, జర్మనీ, బెల్జియం, మలేసియా, ఇరాక్‌, సింగపూర్‌, ఫ్రాన్స్‌... వంటి దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ‘ప్రస్తుతం మా దగ్గర నలభైమంది వరకూ వృద్ధులు ఉంటే.. కొందరు పనిచేయడానికి మాత్రమే వస్తారు. వీళ్లు తయారుచేసే వస్తువుల్ని వెలుగు ఏటీకె టెర్రకోట వర్క్స్‌ పేరుతో అమ్ముతున్నాం. ఆ డబ్బును వాళ్ల సంక్షేమం కోసమే కేటాయిస్తున్నా’మని చెబుతాడు ఖలీల్‌. ఇక, వీటి తయారీకి అవసరమైన మట్టిని విజయనగరం, భీమిలి, కడియం, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తారు. పెద్దవాళ్లు ఇంత కష్టపడి వాటిని తయారుచేస్తున్నారు కాబట్టే... ఈ సంస్థకు ‘మహాత్మాగాంధీ సేవా పురస్కారం’ వంటి 150 కి పైగా అవార్డులు రావడం విశేషం.

వానపల్లి తవుడుబాబు

న్యూస్‌టుడే, మయూరికూడలి, విజయనగరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..