మరణ భీతి

ప్రతి మనిషీ సంతోషాన్ని కోరుకుంటాడు. తన జీవితం ఆనందభరితం కావాలని ఆశిస్తాడు.

Published : 28 Nov 2022 00:13 IST

ప్రతి మనిషీ సంతోషాన్ని కోరుకుంటాడు. తన జీవితం ఆనందభరితం కావాలని ఆశిస్తాడు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా సగటు మనిషి గుర్తించలేడు. మరేదో వస్తేనే ఆనందం అని భ్రమపడతాడు. అందరూ ఒకేలా ఉండరు. ఒకేలా ఆలోచించరు. ఎవరి దృక్పథాలు వారివి. ఒకరికి సంతోషాన్ని ఇచ్చిన సందర్భం మరొకరికి ఇవ్వదు. వైద్యశాస్త్రం ప్రసాదించిన ఔషధాలు సైతం ఒక జబ్బుకు ఒకరికి పనిచేసినట్లు మరొకరికి పనిచేయకపోవచ్చు. ఇది ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనం.

ఒక వ్యక్తికి జబ్బు చేసినప్పుడు మందులు వాడితే శారీరక బాధ నయమవుతుంది. అయినా కొందరు తమ వ్యాధి ఇంకా తగ్గలేదని వాపోతారు. అందుక్కారణం జబ్బు ఆత్మలో లయం కావడమే అన్నది విజ్ఞుల భావన. ఆత్మకు పట్టిన జబ్బును భౌతిక ఔషధాలు నయం చేయలేవు. ధ్యానం వల్లనే అది సాధ్యం అంటారు గురువులు.

నిజానికి మనిషి భయస్తుడు. పశు పక్షి మృగాలు తమ శరీరానికి ఏదో అయిపోతుందని బెంగపడవు. శత్రువు అలికిడి అయితే ఉలిక్కిపడతాయి. వెంబడిస్తే పారిపోతాయి. మనిషి  భయానికి అనేక కారణాలు! ఉన్నది పోతుందని, రాబోయేది దక్కదని మనిషి మాత్రమే భయపడతాడు. ఏ ఇతర ప్రాణికీ లేని మృత్యుభయం మనిషిని వెంటాడుతుంది. తనలోని ఆత్మకు చావు లేదని మనిషి బలంగా విశ్వసించినప్పుడు, ఈ శరీరం పోతుందేమో అన్న భయం నుంచి కొంతవరకు ముక్తుడవుతాడు. అలా మనిషి మృత్యుభయాన్ని జయించవచ్చునంటారు ఆధునిక భాష్యకారులు శ్రీకృష్ణ గీతోపదేశానికి కొనసాగింపుగా. మృత్యు భయాన్ని ఆధునిక వైద్య శాస్త్రం సైతం పోగొట్టలేకపోతోంది. చాలా వ్యాధులను అది పూర్తిగా నయం చేయలేదు. కేవలం నియంత్రిస్తుంది. మనిషి మరణ సమయాన్ని వాయిదా వేయగలుగుతుంది. అంతే! మృత్యు భీతిని జయించే మార్గాన్ని ఉటంకిస్తూ ఓషో ధ్యానాన్ని సూచించాడు. నిరంతరం అభ్యసిస్తే ధ్యానం ఒక్కటే మనిషి మరణ భయాన్ని తొలగించగల దివ్య ఉపకరణమన్నది ఆయన భావన.

మరణం అన్న పదం నిష్క్రమణ అర్థాన్ని సూచిస్తుంది. ఆత్మ, దేహం నుంచి నిష్క్రమించడం మరణం. అప్పుడు మనిషి అనుభవించే నిరంతర బాధలకు ముక్తి కలుగుతుంది. ముక్తి దేహానికి, దేహబాధలకే గాని ఆత్మకు కాదన్నది ఇక్కడ కీలకాంశం. ఆత్మకు బంధాలు లేవు. ముక్తీ లేదు. బంధాలు, ముక్తి దేహానికే అన్నది సత్యం! ఒక కొత్త వస్తువు సమకూరితే ఆనందం కలుగుతుంది. కొన్నింటిని వదిలించుకున్నప్పుడు ఆనందం లభిస్తుంది. ఓ రోగం దూరమైనప్పుడు ఆనందానుభవం చూడవచ్చు. తృప్తిని మించిన ఆనందం మరొకటి లేదు. ఏది ఉన్నా, ఏది లేకపోయినా తృప్తి అన్నది ఒకటుంటే మనిషికి బతుకంతా ఆనందమే!

ఒక ప్రాణాంతక వ్యాధి నయమైతే మనిషి మృత్యువును జయించాడంటారు. నిజానికి చావును వాయిదా వేయగలిగాడన్నది వాస్తవం. మరణాన్ని ఎంతకాలం వాయిదా వేయగలిగితే అంత ఆరోగ్యంగా మనిషి జీవించాడని చెప్పవచ్చు. మరణాన్ని ఎవరూ ఆపలేరు. చేయగలిగింది చావు తేదీని పొడిగించడమే! జయించగలిగింది మరణాన్ని కాదు, మరణభీతిని అన్నది తెలుసుకోవలసిన నిజం.

 గోపాలుని రఘుపతిరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని