PM Modi: వైకాపా వైఫల్యాలు, అవినీతిపై ‘ఛార్జిషీట్‌’

వైకాపా ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు రూపొందించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని ఆదేశించారు.

Updated : 12 Nov 2022 06:48 IST

సిద్ధం చేయాలని భాజపా నేతలకు ప్రధాని నిర్దేశం
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
కేంద్రం రాష్ట్రానికి ఏం ఇస్తోందో చెప్పాలి
పార్టీ కోర్‌ కమిటీ నేతలకు మోదీ కర్తవ్యబోధ

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు రూపొందించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని ఆదేశించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలన్నారు. ‘ఒకప్పుడు గుజరాత్‌, కర్ణాటక, ఏపీల్లో పార్టీ పరిస్థితి ఒకేలా ఉండేది. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఇప్పుడు బాగా పటిష్ఠమైంది. కానీ ఏపీలో పరిస్థితి బాలేదు. రాష్ట్రంలో పార్టీ పటిష్ఠానికి అందరూ కృషి చేయాలి. మనకు మన పార్టీ ముఖ్యం’ అని ఆయన స్పష్టం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి సుమారు గంటన్నరసేపు పార్టీ రాష్ట్ర శాఖ కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పరిచయ కార్యక్రమం ముగిసిన అనంతరం నేతలు మాట్లాడే సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉండాలి

‘వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోంది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ అవినీతి, లోపాలు తీవ్రస్థాయిలో ఎండగట్టాలి. ఇందుకు వెనుకాడొద్దు. దీనికి సమాంతరంగా రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు గురించీ వివరించాలి. రాజకీయాల్లో నిదానం అసలు పనికిరాదు. నిత్యం వేగంగా ఉండకపోతే మన స్థానాన్ని మరొకరు ఆక్రమించేస్తారు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా స్థానిక సమస్యలు, పరిష్కారం కోసం నిత్యం గళమెత్తుతూనే ఉండాలి. ఉప ప్రధానిగా ఆడ్వాణీ ఉన్నప్పుడు 500 మీటర్ల రోడ్డు ప్రారంభానికి పిలిస్తే తొలుత సంకోచించారు. వెళ్లి వచ్చాక సంతృప్తి వ్యక్తం చేశారు. వందే భారత్‌ రైళ్లను స్వయంగా జెండా ఊపి ప్రారంభిస్తున్నా. ఈ కార్యక్రమానికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు వెళ్తున్నాను? అభివృద్ధి కోసం మనం చేసే కృషి గురించి ప్రజలకు తెలియాలి కదా! అభివృద్ధి గురించి చెప్పడంలో, ప్రభుత్వ లోపాలు ఎండగట్టడంలో మీమాంస వద్దు’ అని దిశానిర్దేశం చేశారు.

కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు నిర్వహించాలి

‘అంగన్‌వాడీల దగ్గర నుంచి పార్టీ కార్యకలాపాలు కొనసాగాలి. పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందుతుందో లేదో మహిళా మోర్చల ద్వారా నిశితంగా పరిశీలించాలి. యువకులకు కబడ్డీ, వాలీబాల్‌ పోటీలను నిర్వహించాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ ప్రజలకు మరింత చేరువవుతుంది. గుజరాత్‌లో పార్టీ పటిష్ఠత కోసం మేమెన్నో కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు చేరువయ్యాం. మన పార్టీ మనకు ముఖ్యం. జాతీయ స్థాయి నిర్ణయాలు మేం చూసుకుంటాం. పార్టీ పటిష్ఠతపైనే మీ దృష్టి పూర్తిగా ఉండాలి. ఇప్పటికే రాజకీయాలపై ప్రజల్లో విసుగొచ్చింది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు పార్టీని చేరువ చేయాలి’ అని నేతలకు కర్తవ్యబోధ చేశారు.

పార్టీ అభివృద్ధి కోసం ఏం చేశారు?

‘పార్టీ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏం చేశారు? శక్తి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?’ అని ప్రధాని మోదీ రాష్ట్ర భాజపా నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందిస్తూ.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై సభలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో ఓ సీనియర్‌ నేత భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని, వాటిపై పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఒకరు మాట్లాడుతూ.. వైకాపాతో భాజపా సన్నిహితంగా ఉందనేలా ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

సోము వీర్రాజు తడబాటు

రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయని ప్రధాని మోదీ సోము వీర్రాజును అడగ్గా, ఆయన 21 అని చెప్పడంతో వెంటనే పక్కనున్నవారు 26 అని అందించారు. మండలాలెన్ని ఉన్నాయని అడగ్గా వీర్రాజు జవాబు చెప్పడానికి తడబడ్డారు. పక్కనున్న మరో నేత గణాంకాలు వివరించారు. ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, మాజీ ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్‌, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. మీ తండ్రి పీవీ చలపతిరావు ఆరోగ్యం ఎలా ఉందంటూ ఎమ్మెల్సీ మాధవ్‌ను మోదీ ఆరా తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు