3పెగ్గులు 6గ్లాసులు
ముఖ్యమంత్రి, అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి సాక్ష్యం.. రాష్ట్రంలో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతి చోటా కనిపిస్తున్న బెల్టు షాపులే. స్థానిక వైకాపా నాయకులు, కీలక కార్యకర్తల అండదండలతో మూడు పెగ్గులు, ఆరు గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది.
వీధి చివర.. ఇంటి పక్కన.. ఎక్కడ చూసినా బెల్టుషాపులే
ఫోన్ కొడితే ఇంటికే మద్యం డెలివరీ
ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో సంచార దుకాణాలు
ప్రభుత్వ దుకాణాల్లో కొని అదనపు ధరకు అమ్మకం
జిల్లాకో ఊరిలో ‘ఈనాడు’ పరిశీలన
ప్రతి చోటా కనీసం 2, 3 బెల్టుషాపులు
స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలదే దందా
ఒక్క బెల్టుషాపూ లేకుండా చేశామన్న సీఎం జగన్ మాటలు డొల్లే
ఈనాడు-అమరావతి, యంత్రాంగం
ముఖ్యమంత్రి, అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి సాక్ష్యం.. రాష్ట్రంలో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతి చోటా కనిపిస్తున్న బెల్టు షాపులే. స్థానిక వైకాపా నాయకులు, కీలక కార్యకర్తల అండదండలతో మూడు పెగ్గులు, ఆరు గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో ఊరిని ‘ఈనాడు’ పరిశీలించగా 154 బెల్టు షాపులు లెక్క తేలాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న బెల్టు దుకాణాల్లో ఎంత పెద్ద ఎత్తున దందా సాగుతుందో లెక్కకందని విషయం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరినీ మత్తులో ముంచేస్తున్న గొలుసు దుకాణాలపై క్షేత్రస్థాయి ప్రత్యేక కథనం.
నాడు జగన్ ఏమన్నారంటే..
ఫోన్ కొడితే ఇంటికే మద్యం సీసాలు
చంద్రబాబు పాలనలో గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంటు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రతి గ్రామంలోనూ వీధి చివరన, ఇంటి పక్కన, బడి, గుడి పక్కన మద్యం బెల్టు షాపులున్నాయి. ఒకటో రెండో కాదు.. మూడు నాలుగేసి ఉన్నాయి. ఫోన్ కొడితే మినరల్ వాటర్ వస్తుందో లేదో తెలియదు.. కానీ మద్యం సీసాలను నేరుగా ఇంటికే పంపిస్తున్నారు.
- 2018 డిసెంబరు 11న ప్రతిపక్ష నేత హోదాలో జగన్
లక్ష్యాలు విధించి మరీ అమ్మించారు
గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను పెంచాలని ఎక్సైజ్ అధికారులకు లక్ష్యాలను విధించేవారు. విక్రయాలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. రాష్ట్రంలో 43వేల బెల్టు దుకాణాలు నడిపారు. ప్రతి మనిషిని ఎలా తాగుబోతును చేయాలా అనే ఆలోచనతోనే మద్యం విక్రయాలను గ్రామ స్థాయి వరకూ తీసుకెళ్లారు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు దుకాణం లేకుండా చేశామని సభా వేదికగా గర్వంగా చెబుతున్నా.
- 2019 డిసెంబరు 16న అసెంబ్లీలో సీఎం జగన్
ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే బెల్టు షాపులుండవు
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే వారి లాభాపేక్ష కోసం, విక్రయాలను పెంచుకోవడానికి బెల్టు షాపులు పుట్టుకొస్తాయి. అందుకే ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతోంది. మేం అధికారంలోకి వచ్చాక 43వేల బెల్టు దుకాణాలను తొలగించాం.
- 2020 మే 6న నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్
ఇదీ వాస్తవం
శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలోని ఈ కిళ్లీ కొట్టు అచ్చంగా ఓ బెల్టుషాపే. దీని పక్కనే ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం తెరిచి ఉన్నా, మూసి ఉంచినా ఈ పాన్షాప్లో ఎప్పుడు కావాలన్నా సరకు దొరుకుతుంది. ఇలాంటివి ఈ ఊళ్లో నాలుగున్నాయి. పూల కొట్లు, కిరాణా దుకాణాల్లోనూ కొందరు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని గ్రామ సచివాలయం ఎదురుగానే నడుస్తున్నాయంటే ఎవరైనా చూస్తారేమో.. ఫిర్యాదు చేస్తారేమో అనే భయం ఏ కోశానా లేదని అర్థమవుతుంది.
కోరుకున్నచోటే.. కిక్కు కావల్సినంత
రాష్ట్రంలో ప్రతి ఊళ్లోనూ మద్యం బెల్టుషాపులు
పగలూరాత్రీ తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అమ్మకాలు
రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపు అన్నదే లేకుండా తొలగించేశామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ జిల్లాలో చూసినా బెల్టుషాపులే. చిల్లర దుకాణాలు, కిళ్లీ కొట్లు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, దాబాలు, కిరాణా కొట్లు, కూల్డ్రింక్ షాపులు ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే. మరికొందరైతే ఇళ్లనే బెల్టుషాపులుగా మార్చేసి నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో జిల్లాకు ఒక గ్రామంలో ‘ఈనాడు’ పరిశీలించగా ఇలాంటి విషయాలెన్నో కళ్లకుకట్టాయి.
ప్రతి ఊర్లోనూ తక్కువలో తక్కువ రెండు, మూడు బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఈ దుకాణాల నిర్వహణలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులదే ప్రధాన పాత్ర. రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోంది. సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయాలంటే అధికార పార్టీ పెద్దలకు భారీ మొత్తంలో కమీషన్ ఇవ్వాలని, అలా ఇచ్చిన కంపెనీల బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు బెల్టుషాపుల ద్వారా ప్రజల్ని దోచుకుంటున్నారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా గతంలో ఉన్న పర్మిట్ రూమ్లను రద్దు చేశామని ముఖ్యమంత్రి జగన్ పలు సందర్భాల్లో ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు ఏ బెల్టుషాపు వద్ద చూసినా సరే ‘పర్మిట్’ లేని రూమ్లే కనిపిస్తున్నాయి. వాటిలో అడ్డగోలు మద్యం విక్రయాలే దర్శనమిస్తున్నాయి.
బెల్టుషాపులకు ప్రభుత్వ దుకాణాల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అక్కడ పనిచేసే కొంతమంది సిబ్బంది బెల్ట్టుషాపుల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఒక్కో క్వార్టర్ సీసాపై అదనంగా రూ.10- 15 చొప్పున తీసుకుని కావాల్సినన్ని అందిస్తున్నారు. బెల్టుషాపులవారు వాటిని గ్రామాలకు తీసుకెళ్లి ఆ రేటుపై అదనంగా మరో రూ.30-40 వేసి, మందుబాబులకు అమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో రూ.130 ఉండే క్వార్టర్ సీసా.. బెల్టుషాపుల్లో రూ.180 వరకూ విక్రయిస్తున్నారు. అవతలి వారి అవసరాన్ని బట్టి ఈ రేటు ఇంకా పెరుగుతుంది కూడా. కొన్నిచోట్ల ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే సిబ్బందే నేరుగా బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ‘ఈనాడు’ పరిశీలన జరిపిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
వేలం పాడుకుని దక్కించుకున్నారు మరి..
* తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కొత్తవీరాపురంలో ఏడాదిపాటు నాలుగు బెల్టుషాపుల నిర్వహణ కోసం ఈ మే నెలలో స్థానిక వైకాపా నాయకులు వేలం పాట నిర్వహిస్తే కొందరు రూ.70వేలకు దక్కించుకున్నారు. బెల్టుషాపుల ఏర్పాటును వ్యతిరేకించిన గ్రామస్థుల కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడొద్దంటూ దండోరా వేయించడం వైకాపా నాయకుల బరి తెగింపునకు పరాకాష్ఠ. దీంతో మహిళలంతా ఏకమై గ్రామంలో బెల్టుషాపులు తొలగించాలని ఆందోళన చేశారు. అయినా ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి.
* ఏలూరు జిల్లా కైకలూరులో వైకాపా మద్దతుదారులు, కార్యకర్తలు 15 బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. వీటిలో రోజుకు సగటున రూ.లక్ష విలువైన మద్యం అమ్ముతున్నారు.
* అనంతపురం జిల్లా విడపనకల్లులో స్థానిక వైకాపా నాయకుల మద్దతుతో మూడు బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఏపీ మద్యంతో పాటు కర్ణాటక మద్యాన్ని ఇక్కడ టెట్రా ప్యాక్లలో విక్రయిస్తున్నారు.
* వైకాపా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు దత్తత గ్రామమైన పల్నాడు జిల్లా పాటిబండ్లలో బెల్టుషాపుల నిర్వాహకులు వైకాపా సానుభూతిపరులు. గ్రామ నాయకుల అండదండలు వారికున్నాయి.
* పలు చోట్ల వైకాపా కార్యకర్తలు, మద్దతుదారులే బెల్టుషాపులు నిర్వహిస్తుండటం, మరికొన్ని చోట్ల నిర్వాహకులకు స్థానిక వైకాపా నాయకుల మద్దతు ఉండటంతో వాటిపై ఫిర్యాదు చేయటానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్దనాగులవరంలో వైకాపా నాయకుల మద్దతుతో బెల్టుషాపులు నడుస్తున్నందునే ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నట్లు గ్రామస్థుడు ఒకరు చెప్పడం దీనికి నిదర్శనం. చాలా సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా వాటిపై చర్యలు ఉండట్లేదన్న విమర్శలున్నాయి.
సిట్టింగ్ కోసం బెల్ట్ బార్
చిల్లర వస్తువులు అమ్మే ఈ దుకాణంలో మద్యం సీసాలు విక్రయిస్తున్నారు. అక్కడితో ఆగకుండా కూర్చుని తాగేందుకు వీలుగా దుకాణం వెనుక భాగంలోనే అన్ని ఏర్పాట్లు సమకూరుస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజుపూడి గ్రామంలో కిళ్లీకొట్టు ముసుగులో సాగుతున్న బెల్టుషాపు ఇది. ఈ ఊరిలో ఇలాంటివి పది ఉన్నాయి. చీకటి పడితే చాలు ఈ దుకాణాలన్నీ మందుబాబులతో నిండిపోతున్నాయి.
రోడ్డు పక్కనే..
రోడ్డు పక్కనే కూర్చుని ఎంత దర్జాగా మద్యం తాగుతున్నారో చూశారుగా! బాపట్ల జిల్లా చందోలులో కాల్వకట్టపై రోజూ ఇదే దృశ్యం. ఈ కట్టకు సమీపంలో బెల్టు దుకాణాలున్నాయి. ఒక్క ఫోన్ చేస్తే చాలు ద్విచక్ర వాహనాలపై వచ్చి మద్యం సీసాలు అందించే మొబైల్ బెల్టుషాపులనూ కొందరు నడిపిస్తున్నారు.
జనాభా 6 వేలు..బెల్టుషాపులు 16
పేరుకే ఇది చిల్లరకొట్టు. ఎప్పుడు చూసినా మద్యం అమ్మకాలు, మందుబాబులతో కోలాహలంగా కనిపిస్తుంది. 6వేల జనాభా కలిగిన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో ఇదొక్కటే కాదు.. ఇలాంటివి 16 బెల్టుషాపులున్నాయి. వీటి నిర్వహణలో కీలకపాత్రధారులైన నలుగురు వ్యక్తులు ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొని బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారు.
అవును.. ఇవి మొబైల్ బెల్టుషాపులు
* ప్రముఖ పుణ్యక్షేత్రమైన వైయస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోనే బైక్లపై బెల్టుషాపులు నడుస్తున్నాయి. కొందరు యువకులు మద్యం సీసాలను పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ అడిగిన వారికి సరఫరా చేస్తున్నారు. బాపట్ల జిల్లా చందోలులోనూ ఇదే తరహాలో బైక్లపై బెల్టుషాపులు నడుస్తున్నాయి. వీరిలో కొందరు మందుబాబుల నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
* డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, పల్నాడు జిల్లా పాటిబండ్లలో కొందరు బెల్టుషాపుల నిర్వాహకులకు ఫోన్ కొడితే చాలు ఇంటికే మద్యం తెచ్చి అందిస్తున్నారు. మరికొందరైతే ఆటోలనే బెల్టుషాపులుగా మార్చేశారు.
ఉదయం అరువు.. సాయంత్రం వసూలు
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో బెల్టుషాపుల నిర్వాహకులు కొందరు మద్యానికి బాగా బానిసైన వారిని గుర్తించి వారితో ప్రభుత్వ దుకాణాల వద్ద నుంచి మద్యం కొనిపిస్తున్నారు. ప్రతిగా వారికి 90 మి.లీ. ఉచితంగా పోస్తున్నారు.
* ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలకు అరువుపై మద్యం ఇస్తున్నారు. సాయంత్రం వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.
‘బార్లా’ తెరిచేసిన కిళ్లీకొట్లు,ఫాస్ట్ఫుడ్ సెంటర్లు
కాకినాడ జిల్లా రాజపూడిలో ప్రధాన రహదారిని ఆనుకుని సుమారు పది దుకాణాల్లో బెల్టుషాపులు నడుస్తున్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.30 వేల విలువైన మద్యం విక్రయిస్తారు. కిళ్లీ కొట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు వెనుక భాగంలో గ్రీన్ నెట్తో చిన్న గదులు ఏర్పాటు చేసి వాటిని బార్లుగా మార్చేస్తున్నారు. మందుబాబులకు కావాల్సిన ఆహారం, గ్లాసులు వంటివి సరఫరా చేస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. మద్యం అక్రమ రవాణా, అడ్డగోలు విక్రయాలను అరికట్టాల్సిన సెబ్ సిబ్బంది ఇటువైపు కన్నెత్తే చూడట్లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా గండిగుండంలోని ఓ రెండు బెల్టు షాపుల వద్ద కూర్చొని తాగేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇల్లు, చిల్లర దుకాణాలు.. కావేవీ అనర్హం
* చిల్లర దుకాణాలు, పాన్షాప్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, దాబాలు, కిరాణాకొట్లు, కూల్డ్రింక్ షాపులతో పాటు ఇళ్లల్లోనూ బెల్టుషాపులు నడుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ‘ఈనాడు’ పరిశీలించిన అన్నిచోట్లా ఇదే పరిస్థితి. నెల్లూరు జిల్లాలోని పలుకూరివారిపాలెం, జంగాలపల్లిలో గడ్డివాములు, పశువుల కొట్టాల్లో మద్యం నిల్వ చేసి, విక్రయిస్తున్నారు.
* అనంతపురం జిల్లా విడపనకల్లులో ఓ ఇంట్లో మద్యం సీసాలు నిల్వ ఉంచి రోజూ వచ్చేవారికి అమ్ముతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో కొందరు ఇళ్లల్లోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెరలో ప్రభుత్వ మద్యం దుకాణానికి సమీపంలోని కొన్ని ఇళ్లల్లోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి.
* కైకలూరు, కంచికచర్ల, పెద్దనాగులవరం బడ్డీకొట్లు, శీతల పానీయాల దుకాణాలు, చిల్లరకొట్లలో బెల్టుషాపులు నడుస్తున్నాయి. రావులపాలెంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలోనే బెల్టుషాపులు నడిపిస్తున్నారు.
* అనకాపల్లి జిల్లా కశింకోట, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుల్లో టీ, టిఫిన్ దుకాణాలు, కిళ్లీ కొట్లలో యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు.
* శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం గరుగుతండాలో మూడు బెల్టుషాపులు నడిపిస్తున్నారు. కొంతమంది ఇళ్లల్లో నిల్వ ఉంచి తెలిసినవారికి అమ్ముతున్నారు. మరికొందరు కిరాణాదుకాణాల్లో విక్రయిస్తున్నారు. ముదిగుబ్బలోని ప్రభుత్వ దుకాణాల నుంచి వీటికి సరకు సరఫరా అవుతోంది. కర్ణాటక నుంచి అరటిపండ్ల లోడుతోపాటు మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు.
* ప్రభుత్వ మద్యం దుకాణాలకు సమీపంలోని పాన్షాపులు, చిల్లర దుకాణాలు నిర్వహించే వారు కొన్నిచోట్ల బెల్టుషాపులు నడుపుతున్నారు. ప్రభుత్వం దుకాణం మూసి ఉన్న సమయంలో ఇక్కడ అమ్మకాలు జరుపుతుంటారు. చాలా చోట్ల బెల్టుషాపులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి.
ఈనాడు - అమరావతి, యంత్రాంగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్