సత్వరం సత్యం వెలికితీత చాలా ముఖ్యం

న్యాయాన్ని అందించడం.. సకాలంలో సత్యాన్ని వెలికితీయడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 05 Feb 2023 05:37 IST

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ వ్యాఖ్య
ఫోరెన్సిక్‌ సైన్స్‌ వినియోగంపై నల్సార్‌లో సదస్సు

శామీర్‌పేట, న్యూస్‌టుడే: న్యాయాన్ని అందించడం.. సకాలంలో సత్యాన్ని వెలికితీయడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ అభిప్రాయపడ్డారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం ట్రూత్‌ ల్యాబ్‌, నల్సార్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రభావవంతమైన వినియోగం- చట్ట పాలనను నిర్ధారించడం, సమగ్ర న్యాయాన్ని అందించడం, ప్రజావిశ్వాసాన్ని పెంచడం’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. దీనికి జస్టిస్‌ యు.యు.లలిత్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. క్రిమినల్‌, సివిల్‌ కేసుల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఆవశ్యకతను వివరించారు. ఈ అంశంలో ప్రైవేటు సంస్థ అయినప్పటికీ.. ట్రూత్‌ ల్యాబ్స్‌ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. న్యాయవ్యవస్థ నిర్వహణలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రాముఖ్యాన్ని వివరించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్‌ ఛాన్స్‌లర్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ.. దేశంలో క్రిమినల్‌ కేసులు, మానవ అక్రమ రవాణ తదితర నేరాలను ఎదుర్కోవడంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ పాత్ర కీలకమన్నారు. వైల్డ్‌ లైఫ్‌ ట్రాఫికింగ్‌పైనా ట్రూత్‌ ల్యాబ్స్‌ వంటి సంస్థలు పరిశోధనలు జరపాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ జగన్నాథరావు, జస్టిస్‌ వెంకట్రామిరెడ్డి, విశ్రాంత ఐపీఎస్‌ రామ్మోహన్‌రావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌నారాయణ అధ్యక్షత వహించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ స్థాపనలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని సూచించారు. డీజీపీ అంజనీకుమార్‌, లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా విశ్రాంత ఛైర్మన్‌ జస్టిస్‌ పీవీ రెడ్డి, జస్టిస్‌ గోదా రఘురాం, విశ్రాంత ఐపీఎస్‌లు కమల్‌కుమార్‌, ఆంజనేయరెడ్డి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని