మావోయిస్టు అగ్రనేత కన్నుమూత

మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ (69) అనారోగ్య కారణాలతో మృతిచెందారు.

Updated : 05 Jun 2023 06:45 IST

పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్‌ గుండెపోటుతో మృతి
రాడికల్‌ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీల పాత్ర

ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే - బెల్లంపల్లి పట్టణం: మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ (69) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. దాదాపు 50 ఏళ్లు కీలక హోదాల్లో పనిచేసిన ఆయన పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దండకారణ్య గెరిల్లాజోన్‌ పరిధిలో గత నెల 31న మధ్యాహ్నం 12.20 గంటలకు ఆయన కన్నుమూసినట్లు పార్టీ కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీర్ఘకాలిక శ్వాసకోశవ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారని, దండకారణ్యంలోనే అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించిన కేంద్ర కమిటీ.. జూన్‌ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా ఆనంద్‌ స్మారకసభలు నిర్వహించాలని కోరింది.

నక్సల్బరీ పోరాటం ప్రేరణగా ఉద్యమంలోకి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కార్మిక కుటుంబంలో జన్మించిన సుదర్శన్‌.. నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో విప్లవోద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. మైనింగ్‌ డిప్లొమా విద్యార్థిగా ఉంటూ 1975లో రాడికల్‌ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. బెల్లంపల్లి పార్టీ సెల్‌లో సభ్యుడిగా ఉంటూ సింగరేణి కార్మికోద్యమం, రాడికల్‌ విద్యార్థి యువజన ఉద్యమాల్లో ముఖ్యపాత్ర పోషించారు. 1978లో లక్షెట్టిపేట- జన్నారం ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని సమీకరించారు. 1980లో ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉంటూనే దండకారణ్యంలో ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. ఇంద్రవెల్లి ఆదివాసీ రైతాంగ ఉద్యమానికి ప్రత్యక్ష నాయకత్వం వహించారు.

సీఆర్‌బీకి సుదీర్ఘకాలం నాయకత్వం

1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అఖిలభారత ప్రత్యేక కాన్ఫరెన్స్‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో అప్పటి పీపుల్స్‌వార్‌ 9వ కాంగ్రెస్‌లో ఆనంద్‌ను మరోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని సమన్వయం చేయడం కోసం పార్టీ రీజినల్‌ బ్యూరోలను ఏర్పాటు చేసినప్పుడు ఆనంద్‌ కీలకమైన సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో (సీఆర్‌బీ) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిన అనంతరం మూడేళ్లకు 9వ ఐక్యతా కాంగ్రెస్‌ జరిగినప్పుడు ఆయన్ని కీలకమైన పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. 2001-2017 కాలంలో సుదీర్ఘకాలం సీఆర్‌బీ కార్యదర్శిగా కొనసాగి అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతల నుంచి వైదొలగారు. గత రెండేళ్లుగా కేంద్రకమిటీ మీడియా ప్రతినిధిగా పనిచేశారు. 2004 నుంచి వేర్వేరు సమయాల్లో క్రాంతి, ఎర్రజెండా, పీపుల్స్‌వార్‌, పీపుల్స్‌మార్చ్‌ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని