రుతుపవనాలు వచ్చేశాయ్‌.. కేరళ, తమిళనాడుల్లోకి ప్రవేశం

నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌, కేరళ, తమిళనాడులతోపాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను ఇవి తాకాయి.

Updated : 09 Jun 2023 05:07 IST

మరో వారంలో మన రాష్ట్రానికి

ఈనాడు, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌, కేరళ, తమిళనాడులతోపాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను ఇవి తాకాయి. రానున్న 48 గంటల్లో తమిళనాడు, మరికొన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కేరళలో గడిచిన 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురవడం, అరేబియా సముద్రం మీదుగా పడమటి గాలులు బలంగా వీయడంతో పాటు సముద్రంలో దట్టమైన మేఘాలు ఆవరించడం వంటి పరిస్థితులను లెక్కలోకి తీసుకొని కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ధ్రువీకరించింది. సాధారణంగా జూన్‌ 1న కేరళను రుతుపవనాలు తాకుతాయి. ప్రతికూల పరిస్థితుల వల్ల కొంత ఆలస్యంగా వస్తాయని గత నెలాఖరున ఐఎండీ ప్రకటించింది. అరేబియా సముద్రంలో తుపాను వల్ల రుతుపవనాల రాకకు కొంత అవరోధం ఏర్పడింది. ఈ తుపాను మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున రుతుపవనాలు మందగమనంతో సాగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న 48 గంటల్లో కేరళ, తమిళనాడులోని అధిక ప్రాంతాల్లో,  కర్ణాటకలోని కొన్ని చోట్ల, ఈశాన్య భారతంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని భావిస్తున్నారు. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 14 తరువాత ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని