YS Avinash Reddy: అవినాష్‌పై హత్యానేరం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నడమేకాక, హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం కూడా చేశారంటూ వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపింది.

Updated : 22 Jul 2023 08:12 IST

భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలూ కుట్రలో భాగమే
రాజకీయ వైరుధ్యాలతోనే కుట్ర
గుండెపోటు అని కట్టుకథ అల్లారు
సాక్ష్యాలను ధ్వంసం చేయించారు
వివేకా హత్యకేసులో దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించడానికీ ప్రయత్నించారు
కృష్ణారెడ్డి, వై.ప్రకాశ్‌, మనోహర్‌రెడ్డిల పాత్రపై ఆధారాల్లేవు
రెండో అనుబంధ అభియోగపత్రంలో సీబీఐ
ఈనాడు - హైదరాబాద్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నడమేకాక, హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం కూడా చేశారంటూ వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపింది. అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కూడా హత్యకుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. వివేకాతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలకు రాజకీయ విభేదాలు ఉండటంతో కుట్రకు తెర తీశారని తెలిపింది. వివేకానందరెడ్డి పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి, పనిమనిషి కుమారుడు వై.ప్రకాష్‌, వైఎస్‌ మనోహర్‌రెడ్డిలపై ఆరోపణలున్నా.. ప్రాసిక్యూషన్‌కు ఆధారాల్లేవని పేర్కొంది. అంతేగాకుండా ఆస్తి వివాదాల్లో భాగంగా కుటుంబసభ్యులైన వైఎస్‌ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అల్లుడి సోదరుడు శివప్రకాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొన్ని అంశాల్లో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, సమాచారం అందిన వెంటనే కోర్టు ముందుంచుతామని తెలిపింది. వివేకా ఇంటిలో ఏర్పాటు చేసిన వై-ఫై రూటర్‌ నుంచి కొంతమంది ఐఎంఓ వినియోగదారులు ఉన్నారని, వీరి సమాచారం తెలుసుకోవడానికి కేంద్రం ద్వారా అమెరికా అధికారులకు పంపినట్లు తెలిపింది. అమెరికా అధికారులు అడిగిన సమాచారాన్ని గత నెల కూడా పంపామంది. వివేకాతో బలవంతంగా రాయించిన లేఖను నిన్‌హైడ్రిన్‌ పరీక్ష కోసం సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు, దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న కొన్ని ఫోన్లను ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం త్రివేండ్రంలోని సీడాక్‌కు పంపామని వెల్లడించింది. ఆయా ప్రాంతాల నుంచి సమాచారం అందిన వెంటనే కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది. సంఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో గంగిరెడ్డితో పాటు ఉదయ్‌కుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపింది. వివేకా భార్య, కుమార్తె రాకముందే రక్తపు మరకలను తుడిచి గుండెపోటుతో మరణించినట్లు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంది. వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేసిన సీబీఐ 2వ అనుబంధ అభియోగపత్రాన్ని ఇటీవల సీబీఐ కోర్టుకు సమర్పించింది. దానిలో ప్రధానాంశాలివీ..

ఆది నుంచీ అంతరమే

వైఎస్‌ కుటుంబంలో రాజారెడ్డి కాలం నుంచే విభేదాలున్నాయి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ కావాలన్న భాస్కరరెడ్డి కుటుంబం కోరిక తీరలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి తర్వాత జగన్‌ రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. వైఎస్‌ మరణం తరువాత కాంగ్రెస్‌ తరఫున వివేకా, వైకాపా తరఫున విజయమ్మ పులివెందులలో పోటీపడ్డారు. తమ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న జగన్‌ అభ్యర్థనను వివేకా అంగీకరించలేదు. భాస్కరరెడ్డికి వివేకాతో సరైన సంబంధాలు లేవు. 2017లో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. భాస్కరరెడ్డికి, అవినాష్‌లకు సన్నిహితుడైన శివంకర్‌రెడ్డే దీనికి కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో షర్మిల, విజయమ్మలకు టికెట్‌ ఇవ్వాలని వివేకా పట్టుబట్టారు. అవినాష్‌రెడ్డికి జమ్మలమడుగు లేదా కమలాపురం ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని సూచించారు. షర్మిలను పోటీకి ఒప్పించారు. తన ఎంపీ టికెట్‌కు వివేకా అడ్డుపడుతున్నారని ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని అవినాష్‌రెడ్డి.. శివశంకర్‌రెడ్డి సాయంతో పథకం వేశారు.

బెంగళూరు సెటిల్‌మెంట్‌లో లబ్ధి పొందలేదు

బెంగళూరు సెటిల్‌మెంట్‌లో వివేకా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదు. బెంగళూరు గెస్ట్‌హౌస్‌లో మద్యం తాగాక సెటిల్‌మెంట్‌ కమీషన్‌లో 50% ఇవ్వాలంటూవివేకాతో గంగిరెడ్డి వాగ్వాదానికి దిగాడు. దీంతో వివేకా గంగిరెడ్డిని తిట్టడమే కాక నన్ను కమీషన్‌ అడిగేంత పెద్దవాడివయ్యావా అని కేకలేసి దస్తగిరితో కలిసి పులివెందులకు వెళ్లిపోయారు. భారీగా కమీషన్‌ తీసుకుని ఇవ్వలేదనుకుని గంగిరెడ్డి ఆయనపై కోపం పెంచుకున్నారు. గజ్జల ఉమాశంకరరెడ్డి, దస్తగిరిలకు కూడా వివేకాపై ఇతర సందర్భాల్లో కోపం ఉంది.

సమయంలో సవరణ

గూగుల్‌ టేక్‌ఔట్‌ ప్రకారం సునీల్‌యాదవ్‌ మార్చి 15న తెల్లవారుజామున 2.42 సమయంలో వివేకా ఇంటిలో ఉన్నారు. 2.34కు వివేకా సమీపంలో ఉన్నారు. యూటీసీ (గ్రీన్‌విచ్‌) కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందు ఉంటుందని సీబీఐ పేర్కొంది. అందువల్ల 2021 అక్టోబరు 26న దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న సమయాన్ని సవరించినట్లు తెలిపింది. వివేకా ఇంట్లో సునీల్‌ యాదవ్‌ మొదటిదానిలో పేర్కొన్నట్లు మార్చి 15న 2.42కు బదులు ఉదయం 8.12 గంటలకు ఉన్నట్లు చదవాలని పేర్కొంది. వైఎస్‌ భాస్కరరెడ్డి/అవినాష్‌ ఇంటిలో మార్చి 15న 1.58కి సునీల్‌యాదవ్‌ ఉన్నట్లు పేర్కొంది.

వాట్సప్‌ డేటా దొరకలేదు..

మార్చి 14/15 తేదీల్లో అందుబాటులోని నిందితుల ఐపీడీఆర్‌ను పరిశీలిస్తే గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డి మధ్య వాట్సప్‌ సందేశాలు జరిగినట్లు తేలింది. ఇద్దరి వాట్సప్‌ ఖాతాలు ఒకే సమయంలో యాక్టివ్‌గా ఉన్నాయి. తెల్లవారుజామున 1.37 నుంచి ఉదయం 5.18 దాకా వారిద్దరి నంబర్ల నుంచి పలు వాట్సప్‌ సందేశాలు అటు ఇటూ వెళ్లాయి. అయితే వాట్సప్‌ డేటా మాత్రం లభ్యం కాలేదు. వాట్సప్‌ సమాచారం రికవరీ కోసం గంగిరెడ్డి ఫోన్‌ను తిరువనంతపురం సీడాక్‌ సెంటర్‌కు పంపినా ఫలితం లేకపోయింది. 2019 ఆగస్టులో గంగిరెడ్డి వాట్సప్‌ను రీఇన్‌స్టాల్‌ చేయడంతో పాత డేటా తుడిచిపెట్టుకుపోయింది. ఉద్దేశపూర్వకంగా వాట్సప్‌ డేటాను తొలగించారని తేలింది. తనవద్ద ఆ ఫోన్లు లేవని, వాటిని ఇవ్వలేనని అవినాష్‌రెడ్డి చెప్పడంతో వాట్సప్‌ డేటా రికవరీ కాలేదని సీబీఐ వెల్లడించింది.

జమ్మలమడుగులో కాదు.. కదిరిలో కార్యక్రమం

మార్చి 15న జమ్మలమడుగులో ఏర్పాటైన రాజకీయ కార్యక్రమానికి వెళుతూ.. వివేకా చనిపోయారని ఫోన్‌ సమాచారంతో వెనక్కి తిరిగి వచ్చానని అవినాష్‌రెడ్డి చెప్పడం అవాస్తవమని సీబీఐ పేర్కొంది. రాజకీయ కార్యక్రమం ఉందని కొందరిని ఇంటికి పిలిచినా అక్కడ అలాంటిదేమీ లేదని దర్యాప్తులో తేలింది. వైకాపాకు చెందిన రామచంద్రారెడ్డి వాంగ్మూలం ప్రకారం.. జమ్మలమడుగుకు వ్యతిరేకదిశలో ఉన్న కదిరిలో 4వేల మందికి భోజన ఏర్పాట్లు ఉన్నాయని.. ఈ కార్యక్రమానికి వివేకా, భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, కొండారెడ్డిలకు ఆహ్వానం అందినట్లు తేలింది.

వివేకా ఫోన్‌లో సాంబశివారెడ్డి పేరుతో షమీమ్‌ నంబరు

వివేకా తన రెండో భార్య షమీమ్‌ నంబరును ఫోన్‌లో సాంబశివారెడ్డి అనే పేరుతో పెట్టుకున్నారు. ఈ నంబరు నుంచి మార్చి 15న తెల్లవారుజామున 1.31కు మెసేజ్‌ వచ్చేసరికి హత్య జరగలేదు. 4.32కు మిస్డ్‌ కాల్‌ ఉంది. మార్చి 8 నుంచి 15 వరకు షమీమ్‌ నుంచి ఫోన్‌ మెసేజ్‌లు వచ్చాయి. వివేకా రెండో వివాహంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి, ఆమె మరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. షమీమ్‌తో వివేకాకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. తన కుమారుడి గురించి పట్టించుకోలేదన్న కోపంతో కొన్ని సందర్భాల్లో తప్ప ఎలాంటి విభేదాల్లేవు. షమీమ్‌ నగల కొనుగోలుకు, ఇతరత్రా అవసరాలకు వివేకా డబ్బులిచ్చారు. వివేకా ఆస్తులన్నీ కంపెనీల పేరుతో ఉండటంతో డైరెక్టర్లుగా ఉన్న కుటుంబసభ్యుల ఆమోదం లేకుండా వాటి బదలాయింపు సాధ్యం కాదు. అందువల్ల ఆస్తులను షమీమ్‌ మైనరు కుమారుడికి బదలాయిస్తారన్న ఆరోపణలపై ఆధారాల్లేవు. వివేకా ఆర్థికావసరాలను ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చూసుకునేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు