పంచాయతీలకు ఉరేసిన జిత్తులమారి జగన్‌

అనగనగా ఒక వేటగాడు... తెల్లారి లేచింది మొదలు అడవిలోని జంతువులను వెంటాడి వేటాడి చంపుతుండేవాడు. అతగాడే అప్పుడప్పుడు వన్యప్రాణి ప్రేమికుడి వేషంకట్టి ఊరికి ఉపన్యాసాలిచ్చేవాడు.

Updated : 18 Apr 2024 16:27 IST

సరవెల్లి తన భద్రత కోసం రంగులు మారుస్తుంది. జగన్‌ మాత్రం ప్రజలను, వ్యవస్థలను నాశనం చేసేందుకు అనుక్షణం ఒక కొత్త రంగు పులుముకుంటూనే ఉంటారు. గత పాలకులపై అక్కసు తలకెక్కించుకుని కక్షపూరిత చర్యలతో ఆంధ్రావనిలో పల్లె.. పట్టుగొమ్మలను నరికేశారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను అపహాస్యం చేశారు. పంచాయతీ పాలనకు పాతరేశారు. సర్పంచులు, కార్యదర్శుల అధికారాలకు కోతేసి.. ప్రకటనలతో పూతేసి.. పంచాయతీ ఖజానాలను కాజేసి.. పల్లెలు ఘొల్లుమనేలా ప్రగతిని దూరం చేశారు.

అనగనగా ఒక వేటగాడు... తెల్లారి లేచింది మొదలు అడవిలోని జంతువులను వెంటాడి వేటాడి చంపుతుండేవాడు. అతగాడే అప్పుడప్పుడు వన్యప్రాణి ప్రేమికుడి వేషంకట్టి ఊరికి ఉపన్యాసాలిచ్చేవాడు. జగన్‌మోహన్‌రెడ్డి కపట నాటకాలను చూస్తే- ఆ వేటగాడి దొంగ వేషాలే గుర్తొస్తాయి. ‘‘బాపూజీ గ్రామ స్వరాజ్యం - జగనన్న ప్రభుత్వ లక్ష్యం’’ అని ప్రకటనలు అచ్చేయించుకున్న జగన్‌... నిజానికి పంచాయతీరాజ్‌ వ్యవస్థకు విషంపెట్టారు. గ్రామీణాంధ్ర జీవకళను హరించారు. ‘‘గ్రామాల రూపురేఖలు మారుస్తా’’నని పైకి చెబుతూ, పంచాయతీ ఖజానాలకు కన్నాలేశారు. కనీసం పారిశుద్ధ్య సేవలకూ నోచుకోని దారుణ దౌర్భాగ్యస్థితిలోకి పల్లెలను నెట్టేశారు.


జగన్‌ చేతుల్లో రాజ్యాంగం ఖూనీ

పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనేవారు బాపూజీ. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పంచాయతీరాజ్‌ వ్యవస్థకోసం రాజ్యాంగ సభలో గట్టిగా వాదించారు మన ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్‌లుగా గ్రామాలను ఎదగనిస్తే ద్రవ్వోల్బణంతో పాటు అనేక ఇక్కట్లు తొలగిపోతాయని రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడిగా ప్రకాశం బల్లగుద్ది చెప్పారు. పైన ఎక్కడో ఒక ప్రభుత్వం కూర్చుని, అన్ని పనులూ అదే చేయాలనుకోవడం సరైంది కాదని టంగుటూరి ఉద్ఘాటించారు. పైనుంచి పంచిపెట్టడం కన్నా గ్రామాలను స్వయంసమృద్ధం చేస్తే ప్రజాసమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రకాశం తదితరుల కృషివల్లే పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రాణంపోసుకుంది. ‘‘గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించాలి. స్వపరిపాలనా యూనిట్లుగా పనిచేసేందుకు అవసరమైన అన్ని అధికారాలను వాటికి కల్పించాలి. అందుకోసం రాజ్యం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని 40వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు పురుడుపోస్తూ 73, 74వ రాజ్యాంగ సవరణలు జరిగాయి. ప్రజాస్వామ్య ఫలాలు పల్లెలకు చేరాలంటే పంచాయతీరాజ్‌ వ్యవస్థతోనే సాధ్యమని ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు విశ్వసించారు. సింహం స్థానంలోకి జిత్తులమారి నక్క జొరపడినట్లు- ‘ఆంధ్రకేసరి’ అధిష్ఠించిన సీఎం పదవిలోకి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు. జాతినిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ అధికరణలను ఆయన అడుసులోకి తొక్కేశారు. సచివాలయాల పేరిట గ్రామపంచాయతీల ఊపిరితీసే సొంత యంత్రాంగాన్ని జగన్‌ సృష్టించారు.


అధికారాన్ని కేంద్రీకరించిన నియంత

గోడ కట్టినట్లు అబద్ధాలాడటంలో అప్రకటిత గోల్డ్‌ మెడలిస్ట్‌ జగన్‌. ఆ ప్రతిభను ప్రదర్శిస్తూ 2019లో గ్రామ సచివాలయాల వ్యవస్థను తెరపైకి తెచ్చారాయన. పంచాయతీల పర్యవేక్షణలోనే అది పని చేస్తుందని మొదట్లో అందరినీ నమ్మించారు. 2021లో పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే తెప్ప తగలేశారు జగన్‌. సచివాలయాలపై నియంత్రణాధికారాన్ని సర్పంచ్‌ల చేతుల్లోంచి తీసేశారు. వాటిపై పర్యవేక్షణకు ప్రత్యేక శాఖను సృష్టించారు. ‘‘గ్రామ, వార్డు సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి అవి అదనపు ఆయుధాలు’’ అని హైకోర్టుకు సమర్పించిన ఓ ప్రమాణపత్రంలో జగన్‌ సర్కారు లోగుట్టు బయటపెట్టేసింది. తమ ఊరికి కావాల్సిందేమిటో స్థానికులందరూ చర్చించుకుని, గ్రామసభల్లో ఒక నిర్ణయం తీసుకుని, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఆ పనులు జరిపించుకునే వాతావరణాన్ని జగన్‌ ఛిద్రంచేశారు. సర్పంచ్‌లను కూరలో కరివేపాకుల్లా తీసిపారేస్తూ- సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక తదితరాలన్నింటినీ సచివాలయాలకు అప్పగించారు. అలా తన గుప్పిట్లో ఉండే సచివాలయాలతో స్థానిక ప్రభుత్వాలకు మరణశాసనం రాశారు జగన్‌. పంచాయతీరాజ్‌ లక్ష్యాలకు భిన్నంగా అధికారాన్ని కేంద్రీకరించారు. తన ఆజ్ఞ లేనిదే రాష్ట్రంలో చీమైనా చిటుక్కుమనరాదనే స్థాయిలో నిరంకుశ రాజ్యాన్ని స్థాపించారు.


ఆగమాగమైన పల్లెలు

మురుగు కాల్వలను శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. తాగునీటి పైప్‌లైన్ల రిపేర్లకు పైసల్లేవు. రహదారులకు చిన్నపాటి మరమ్మతులు చేయించడం మొదలు చెరువుల్లో చెత్త తొలగింపు దాకా అన్నిటికీ కాసుల కటకటే. ఏ పని చేయడానికి కూడా సర్పంచ్‌ల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్‌. ఆఖరికి బ్లీచింగ్‌, ఫాగింగ్‌లకూ డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. పల్లెపట్టుల్లో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి సచివాలయాలతో అద్భుతాలు చేస్తున్నామంటూ జగన్‌ జబ్బలు చరుచుకున్నారు. అంతకు ముందు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేవారు. జగన్‌ వచ్చాక వాటికీ టెండర్‌ పెట్టారు. పంచాయతీ ఎన్నికలు పూర్తికాక మునుపే ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి మరీ ఆ సొమ్ములకు కాళ్లు తెప్పించారు. పల్లెల అవసరాలను పట్టించుకోకుండా సచివాలయాల నిర్మాణం వంటి సొంత ప్రాధాన్య కార్యక్రమాలకు ‘ఉపాధి’ నిధులను ధారపోయించారు. ఏదీ చేయలేక గ్రామస్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచ్‌లు నెత్తీనోరూ కొట్టుకున్నా జగన్‌ వినిపించుకోలేదు. మిమ్మల్ని నమ్మిన పాపానికి నిండా ముంచారని వైకాపా సర్పంచ్‌లూ ఆందోళన బాటపట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. అవమానాలను తట్టుకోలేక రోడ్డెక్కి నిరసనలు తెలిపితే- పోలీసులను ఉసిగొల్పి హాయిగా వేడుక చూశారు జగన్‌. చేసిన పనులకు బిల్లులు రాక బలవన్మరణాలే దిక్కు అనుకునేంతగా పల్లె ప్రజాప్రతినిధులకు నరకం చూపించారాయన.


దున్నపోతు మీద వాన

‘‘మన శరీరమే దేశం అనుకుంటే- ప్రతి గ్రామమూ ఒక జీవకణం వంటిది’’ అని రాజ్యాంగ సభ సభ్యుడిగా సురేంద్రమోహన్‌ ఘోష్‌ అభివర్ణించారు. గ్రామాలకు స్వయం పాలనాధికారం ఇస్తే దేశం ఆరోగ్యకరంగా పురోగమిస్తుందని ఆయన ఉద్బోధించారు. జనం పడుకున్నా లేచినా తన పేరే జపించాలనుకునే జగన్‌- గ్రామ, వార్డు సచివాలయాలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటికి కత్తెరేసి, వాటిని వీఆర్వోలకు అప్పగించేందుకూ జగన్‌ తెగబడ్డారు. జీవో నం.2ను జారీచేయించారు. దాని మూలంగా పంచాయతీలు, సర్పంచ్‌లు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలవుతారని రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆ జీవో అమలును ఆపేసింది. వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని ‘కాగ్‌’ సైతం స్పష్టంచేసింది. ప్రజాప్రతినిధులు, పౌరుల భాగస్వామ్యం లేని ఆ వ్యవస్థ- స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీస్తుందనే కఠోర వాస్తవాన్ని చెప్పింది. కానీ, దున్నపోతు మీద వాన పడినట్లుగా జగన్‌ సర్కారు ‘కాగ్‌’ హితవచనాలను దులపరించేసుకుంది. గ్రామ సచివాలయాలతో సర్పంచ్‌లను నిమిత్తమాత్రులను చేసిందిగాక పంచాయతీలపై అదనపు ఆర్థిక భారాన్నీ మోపారు జగన్‌. సచివాలయాల నిర్వహణ కోసమని ఏడాదికి వంద కోట్ల రూపాయలను పంచాయతీల నుంచే గుంజుకుంటున్నారు. సచివాలయాలపై అజమాయిషీ చేసే అధికారం లేనప్పుడు వాటి నిర్వహణకు పంచాయతీలు ఎందుకు నిధులివ్వాలి? అటువంటి ప్రశ్నలను జగన్‌ను ఎవరూ అడగకూడదు. అడిగినా ఆయన నోరు తెరవరు!


నిధులు కాజేసిన నయవంచకుడు

రాష్ట్రంలోని పంచాయతీల సంఖ్య 13వేలకు పైమాటే. ఏపీ జనాభాలో డెభ్భై శాతానికి పైగా(సుమారు 3.80 కోట్ల మంది) గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పల్లెలపై పగబట్టినట్లు ప్రవర్తించిన జగన్‌- అంతమంది జీవితాలనూ దుర్భరంగా మార్చేశారు. ఏవో కొన్ని మేజర్‌ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెల ప్రగతికి చేయూతనివ్వాల్సిన జగన్‌- ఆ పని చేయలేదు. కానీ, పంచాయతీలకు వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ ‘హాంఫట్‌’ అనిపించారు. విద్యుత్‌ బకాయిలను తీర్చడం కోసమంటూ రూ.1597 కోట్లును అలా దారి తప్పించారు. ఆర్థిక సంఘం నిధులతో కరెంట్‌ బాకీలను తీర్చేందుకు కేంద్రం అనుమతిచ్చిందని జగన్‌ సర్కారు అడ్డంగా బుకాయించింది. వాస్తవానికి ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల్లో పదిశాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలి. ఆ సొమ్ములోంచే విద్యుత్తు బకాయిలను చెల్లించాలి. కానీ, జగన్‌ సర్కారు మాత్రం సగటున 24 శాతం నుంచి 90 శాతం వరకు ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. చట్టాలను చాపచుట్టడంలో చెయ్యితిరిగిన జగన్‌- పంచాయతీల సొమ్ము మళ్లింపులోనూ అంతే అరాచకంగా వ్యవహరించారు. దానిపై దిల్లీకి ఫిర్యాదులు వెళ్లడంతో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఉపకార్యదర్శి నిరుడు సెప్టెంబరులో ఇక్కడకు వచ్చి విచారించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను సర్పంచ్‌లకు తెలియకుండా ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి పనులకు ఉపయోగపడాల్సిన సొమ్మును కాజేసిన జగన్‌- పల్లెల్లో అధ్వాన పరిస్థితులకు ఆజ్యంపోశారు. పంచాయతీల్లోంచి పట్టుకుపోయిన డబ్బును డిస్కమ్‌లకు నిజంగానే జమేశారా అంటే- అదీ తెలియదు. ప్రశ్నించిన వారిని అమ్మనాబూతులు తిట్టడమే తప్ప ప్రజలకు నిజానిజాలు చెప్పే ధైర్యం జగన్‌ సర్కారుకు లేదు.


గ్రామ స్వరాజ్యానికి సమాధి

గ్రామీణాంధ్రకు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ద్రోహాలు ఒకటీ రెండూ కాదు. ‘‘పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం... గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం’’ అంటూ ఎన్నికల సమయంలో జగన్‌ సర్కారు తెగ ఊదరకొట్టింది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచామని తనకుతానే వీరతాళ్లు వేసుకుంది. ఆ మాటలు నమ్మి ఏకగ్రీవమైన పంచాయతీలనూ చివరికి దగా చేశారు. ప్రోత్సాహకాల నిధులను విడుదల చేసినట్లే చేసి ఆ తరవాత చాలాచోట్ల ఖాతాల్లోంచి సొమ్మును మాయం చేయించారు. విద్యుత్‌ బకాయిలకంటూ ఆ నిధులను కొట్టేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి పన్నుల ఆదాయంలో వాటికి వాటా ఇవ్వాలని నాలుగో రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆ నివేదికను నాలుగేళ్లు బయటికి రానివ్వని జగన్‌ సర్కారు- చివరికి సంఘం కీలక సూచనలను చెత్తబుట్టలో పడేసింది. మొత్తమ్మీద సీఎంగా జగన్‌ ఒరగబెట్టిందేంటంటే- గ్రామ స్వరాజ్యానికి సమాధి కట్టారు. పల్లెల్లో ప్రగతి దీపాలను స్వహస్తాలతో కొండెక్కించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని