Elon Musk: రోజుకు 4 మిలియన్‌ డాలర్ల నష్టం.. ఉద్యోగుల కోత తప్పలేదు: మస్క్‌

ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న వారానికే కంపెనీలో దాదాపు 50 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు ఎలాన్‌ మస్క్‌. మరో అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

Published : 05 Nov 2022 11:14 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను(Twitter) ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దాదాపు సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌(Elon Musk). దీనిపై విమర్శలు వ్యక్తమవడంతో స్పందించిన మస్క్‌ ఉద్యోగుల కోతలను సమర్థించారు. కంపెనీ రూ.వేల కోట్ల నష్టాల్లో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్విటర్‌లో తెలిపారు.

‘‘ట్విటర్‌ రోజుకు 4 మిలియన డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు.. దురదృష్టవశాత్తూ సిబ్బంది తగ్గింపు మినహా మరో అవకాశం కన్పించలేదు. అయితే కంపెనీ నుంచి నిష్క్రమించిన ప్రతి ఉద్యోగికి మూడు నెలల వేతన చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇది 50శాతం ఎక్కువే’’ అని మస్క్‌ రాసుకొచ్చారు.

44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. వారం రోజుల్లోనే సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. కొనుగోలు ప్రక్రియ ముగిసిన కొద్ది గంటలకే సీఈఓ పరాగ్‌ అగర్వాల్ సహా నలుగురు ఉన్నతోద్యోగులను విధుల నుంచి ఇంటికి పంపించేసిన ఆయన.. తాజాగా కంపెనీలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలికారు. తొలగింపు సమాచారాన్ని ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా పంపారు. ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌కు 7500 వరకు ఉద్యోగులుండగా.. 3738 మందికి ఈ లేఆఫ్‌ మెయిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లకు ముందు ఉద్యోగులు, వినియోగదార్ల డేటా భద్రత దృష్ట్యా తాత్కాలికంగా అన్ని కార్యాలయాలను ట్విటర్‌ మూసివేయనుంది.

వారి వల్లే రెవెన్యూ తగ్గింది..

ఇక ట్విటర్‌ (Twitter) ఆదాయం తగ్గడానికి సామాజిక కార్యకర్తలే కారణమని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మండిపడ్డారు. ‘‘కంటెంట్‌ నియంత్రణలో ఏమీ మారనప్పటికీ కొందరు సామాజిక కార్యకర్తలు.. ప్రకటనదారులపై ఒత్తిడి చేశారు. దీనివల్లే ట్విటర్‌ ఆదాయం భారీగా పడిపోయింది. కార్యకర్తలను శాంతింపజేసేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా గందరగోళంగా ఉంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వారు నాశనం చేస్తున్నారు’’ అని మస్క్ తెలిపారు. అయితే సంస్థకు ఎంతమేర నష్టం కలిగిందని, ఆ కార్యకర్తలు ఎవరు అన్నదానిపై ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని