మేలో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింత పెరిగాయ్‌

భారత ముడి చమురు దిగుమతులు రష్యా నుంచి గత నెలలో మరింతగా పెరిగాయి. సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ, యూఎస్‌ల నుంచి సంయుక్తంగా దిగుమతి చేసుకున్న పరిమాణంతో పోలిస్తే ఒక్క రష్యా నుంచే అధికంగా చమురు దిగుమతి అయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Published : 05 Jun 2023 01:27 IST

దిల్లీ: భారత ముడి చమురు దిగుమతులు రష్యా నుంచి గత నెలలో మరింతగా పెరిగాయి. సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ, యూఎస్‌ల నుంచి సంయుక్తంగా దిగుమతి చేసుకున్న పరిమాణంతో పోలిస్తే ఒక్క రష్యా నుంచే అధికంగా చమురు దిగుమతి అయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మేలో రష్యా నుంచి రోజుకు 1.96 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వొర్టెక్సా డేటా చెబుతోంది. ఏప్రిల్‌లో దిగుమతి చేసుకున్న అత్యధిక ముడి చమురు పరిమాణంతో పోల్చినా ఇది 15 శాతం ఎక్కువగా ఉంది. ఇటీవల కొన్నేళ్లలో ఒక దేశం నుంచి అత్యధికంగా భారత్‌ ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే ప్రథమం. మొత్తం అన్ని దేశాల నుంచి దిగుమతైన ముడి చమురులో సుమారు 42 శాతం మేర రష్యా నుంచే ఉండటం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి 5,60,000 టన్నుల షిప్‌మెంట్లు జరిగాయి. 2021 ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యల్పమని షిప్పింగ్‌ అనలిటిక్స్‌ కంపెనీ గణాంకాలు తెలిపాయి. ఒపెక్‌ దేశాల నుంచి భారత్‌ దిగుమతి చేసుకున్న చమురు ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి (39 శాతం) పడిపోయింది.


సౌదీ అరేబియా రోజుకు మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తి కోత

ఫ్రాంక్‌ఫర్ట్‌: రోజురోజుకు తగ్గిపోతున్న ముడి చమురు ధరల్ని అదుపు చేసేందుకు సౌదీ అరేబియా రోజుకు మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తి కోతలను ప్రకటించింది. జులై నుంచి కోతలు అమల్లోకి రానున్నాయి. 23 సభ్య దేశాల ఒపెక్‌ సమావేశం ఆదివారం వియన్నాలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. 2024 చివరి వరకు ప్రస్తుత ఉత్పత్తి కోతలను కొనసాగించడానికి మిగతా ఒపెక్‌+ దేశాలు అంగీకరించాయి. ఒపెక్‌ యేతర దేశాల లీడర్‌గా ఉన్న రష్యా మాత్రం ఉత్పత్తి కోతలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చింది. గత ఏడాది అక్టోబరు నుంచి ఒపెక్‌+ దేశాలు ముడి చమురు ఉత్పత్తిలో రెండు సార్లు కోత విధించాయి. తొలిసారిగా అక్టోబరులో రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాయి. మరోసారి ఏప్రిల్‌లో ఎవరూ ఊహించని విధంగా రోజుకు 1.16 మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున ఉత్పత్తి కోత విధించాయి. అయినప్పటికీ ధరల క్షీణత కొనసాగడంతో తాజా కోతలను సౌదీ  ప్రకటించింది.


సంక్షిప్తంగా

* సెప్టెంబరుకు ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) ఐపీఓ ముసాయిదా పత్రాలను ప్రభుత్వం దాఖలు చేసే అవకాశం ఉందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. ఇప్పటికే మర్చంట్‌ బ్యాంకర్లను నియమించామని, కంపెనీ విలువ మదింపు ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు.

* బాల్కోలో 49 శాతం వాటాను పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా విక్రయించాలనుకుంటున్న ప్రభుత్వం.. ఇందుకు ప్రమోటర్‌ సంస్థ వేదాంతాతో మధ్యవర్తిత్వ దావా ఉపసంహరణకు చర్చలు జరుపుతున్నట్లు దీపం కార్యదర్శి పాండే పేర్కొన్నారు. ఫలితంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో కంపెనీ నమోదు ప్రక్రియకు ఆటంకాలు ఉండవని అన్నారు.

* మరిన్ని విదేశీ గమ్యస్థానాలకు భారత్‌ నుంచి నాన్‌-స్టాప్‌ విమానాలు ఉండాల్సిన అవసరం ఉందని ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ అభిప్రాయపడ్డారు. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేకపోవడం వల్ల మంచి దేశీయ విమానయాన పరిశ్రమ లేకుండా పోయిందని అన్నారు. ఇండిగో మంచి విజయాలు సాధిస్తోందని, టాటా ఎయిర్‌లైన్స్‌ కూడా ధీటైన పోటీదారు కానుందని వెల్లడించారు.

* గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 180 రుణ పరిష్కార ప్రణాళికలకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. ఒత్తిడి ఆస్తుల నుంచి మొత్తం రూ.51,424 కోట్లు రాబట్టనున్నారు. 2018-19లో 77 దివాలా ప్రక్రియల నుంచి రూ.1.11 లక్షల కోట్లు రాబట్టిన తర్వాత ఇదే అత్యధికం.

* భారత్‌కు అద్భుతమైన ఇంజినీరింగ్‌ శక్తి ఉందని, ఈ శక్తిని వినియోగించుకుని ఉంటే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అత్యుత్తమ కంపెనీలు భారత్‌లో పుట్టి ఉండేవని ప్లగ్‌ అండ్‌ పే వ్యవస్థాపక సీఈఓ సయిద్‌ అమీదీ అభిప్రాయపడ్డారు.

* ఈ ఏడాది ఏప్రిల్‌లో 379 మౌలిక రంగ ప్రాజెక్టుల వ్యయ అంచనాలు రూ.4.64 లక్షల కోట్లకు పైగా పెరిగాయని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ.150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

* ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌ షేర్‌హోల్డింగ్‌ 89 శాతం నుంచి 85 శాతానికి తగ్గింది. ప్రస్తుతం కంపెనీ చేపట్టిన  బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ ఇందుకు కారణం.

* సహారా లైఫ్‌ పాలసీలు, ఆస్తుల బదిలీ వల్ల ఎస్‌బీఐ లైఫ్‌ బ్యాలెన్స్‌ షీట్‌పై భారీ ప్రభావం ఉండే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని