Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 122 పాయింట్ల లాభంతో 57,736 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 45 పాయింట్లు లాభపడి 16,996 దగ్గర కొనసాగుతోంది.

Updated : 29 Mar 2023 09:59 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 122 పాయింట్ల లాభంతో 57,736 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 45 పాయింట్లు లాభపడి 16,996 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు కుంగి 82.24 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు ఆరంభంలో లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ మదుపర్లు నిన్న రూ.1,531 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేయడం గమనార్హం. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.156 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు. దీంతో వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ నేడే ముగియనుంది. మరోవైపు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై కూడా మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

గమనించాల్సిన స్టాక్స్‌..

వేదాంతా: ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23) రూ.7,621 కోట్ల మధ్యంతర డివిడెండు చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపిందని వేదాంతా మంగళవారం వెల్లడించింది. ఏప్రిల్‌ 7వ తేదీని డివిడెండు చెల్లించేందుకు రికార్డు తేదీగా నిర్ణయించింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.20.50 చొప్పున అయిదో మధ్యంతర డివిడెండు చెల్లింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

ఎల్‌అండ్‌టీ: రూ.2,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎల్‌అండ్‌టీ రెండు లక్షల మార్పిడి రహిత డిబెంచర్లను జారీ చేసింది. ఇవి 2028 ఏప్రిల్‌ 28న మెచ్యూర్‌ కానున్నాయి.

జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌: అడెనీగఢ్‌- పురునాకటాక్‌ మధ్య రైల్వే సొరంగ మార్గ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును చేపట్టడానికి తూర్పు తీర రైల్వే నుంచి జీఆర్‌ ఇన్‌ఫ్రాకు ‘లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌’ లభించింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.587.59 కోట్లు.

ఎన్‌బీసీసీ ఇండియా: రూ.146 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ ఎన్‌బీసీసీకి లభించింది.

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తున్న నికెల్‌ పిగ్‌ ఐరన్ కంపెనీ ‘న్యూ యాకింగ్‌’లో 49 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ కొనుగోలు చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని