TCS: కృత్రిమ మేధలో టీసీఎస్‌ భారీగా పెట్టుబడులు: చంద్రశేఖరన్‌

TCS: సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టీసీఎస్‌ కొత్త తరం టెక్నాలజీల్లో పెట్టుబడులు పెడుతోందని కంపెనీ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు.

Updated : 07 Jun 2023 17:01 IST

దిల్లీ: వ్యాపారాల్లో కృత్రిమ మేధ (artificial intelligence- AI) వంటి అత్యాధునిక సాంకేతికతల ప్రాధాన్యం పెరుగుతోందని ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ (N Chandrasekaran) తెలిపారు. అలాగే క్లౌడ్‌, ఐఓటీ వంటి వాటిలో ఉన్న శక్తిని కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ ఆయా సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. షేర్‌హోల్డర్లకు రాసిన లేఖలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అస్థిరతలోనూ 17% వృద్ధి..

గత ఆర్థిక సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని చంద్రశేఖరన్‌ (N Chandrasekaran) తెలిపారు. అయినప్పటికీ.. టీసీఎస్‌ (TCS) 17.6 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. అలాగే 34.1 బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఆర్డర్లతో గత సంవత్సరాన్ని బలంగా ముగించామని పేర్కొన్నారు.

కొత్త మార్పులు.. పెట్టుబడులు..

పరిశ్రమలు, వ్యాపారాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా టీసీఎస్‌ ఏఐ సాంకేతికతలో పెట్టుబడులు పెడుతోందని చంద్రశేఖరన్‌ (N Chandrasekaran) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణల్లో గణనీయ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే ఐటీ ఇండస్ట్రీ వృద్ధికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ (AI) ఆధారిత ఉత్పత్తులపై టీసీఎస్‌ (TCS) దృష్టి సారించిందని పేర్కొన్నారు. 5జీ, ఐఓటీ, జనరేటివ్‌ ఏఐ, వర్చువల్‌ రియాలిటీ, మెటావర్స్‌, డిజిటల్‌ ట్విన్‌ వంటి కొత్తతరం సాంకేతికల్లో రానున్న రోజుల్లో పెట్టుబడులు భారీ ఎత్తున పెరుగుతాయని చంద్రశేఖరన్‌ అంచనా వేశారు. మరోవైపు వీటికి అనుగుణంగా తమ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు. 

గోపీనాథన్‌కు థ్యాంక్స్‌..

ఇటీవలే కంపెనీని వీడిన సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌కు ఈ సందర్భంగా చంద్రశేఖరన్‌ (N Chandrasekaran) కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ వృద్ధిలో ఆయన పాత్రను కొనియాడారు. అలాగే ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన కె.కృతివాసన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని