logo

Crime News: అనుమాన భూతం.. కడతేరిన జీవితం

భర్త వ్యసనాలు, అప్పులు ఆ ఇంట్లో చిచ్చు రేపాయి. అనుమాన పిశాచానికి ఓ అమాయకురాలి నిండు జీవితం కడతేరిపోయింది.

Published : 12 Nov 2023 07:18 IST

భర్తే.. చంపాడంటున్న కుటుంబ సభ్యులు

వెంకటేశ్వర్లు, సాయిహరిత (పాత చిత్రం)

చాగల్లు, న్యూస్‌టుడే: భర్త వ్యసనాలు, అప్పులు ఆ ఇంట్లో చిచ్చు రేపాయి. అనుమాన పిశాచానికి ఓ అమాయకురాలి నిండు జీవితం కడతేరిపోయింది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన చాగల్లు మండలం ఊనగట్లలో శనివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గుత్తులవారిపాలెంనకు చెందిన సాయిహరిత(25)కు ఊనగట్లకు చెందిన డి.వెంకటేశ్వర్లుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వెంకటేశ్వర్లు పొక్లెయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ, వ్యసనాలకు బానిసై ఆర్థికంగా నష్టపోయాడు. దీనికితోడు భార్యపై అనుమానంతో అయిదు నెలల క్రితం ఖమ్మం పట్టణానికి మకాం మార్చారు. అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవ్వడంతో సొంతూరు వెళ్లిపోమని సాయిహరిత తల్లి చెప్పేవారు. దానికి వెంకటేశ్వర్లు ఏమాత్రం ఒప్పుకొనేవాడు కాదు. ఇలా ఉండగా ఈనెల 1న భీమవరంలో శుభకార్యం నిమిత్తం సాయిహరిత పిల్లలతో పాటు వచ్చింది. 5న ఊనగట్లకు వచ్చింది. శనివారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి ఊనగట్లకు వచ్చాడు. అప్పటివరకు కోడలుకు సాయంగా పడుకున్న ఆదమ్మ.. కొడుకు రావడంతో బయటకు వెళ్లి వరండాలో పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి కుమారుడు కనిపించలేదు. కోడలి ముఖంపై దుప్పటి కప్పి ఉంది. పిలిచినా పలక్కపోవడంతో అనుమానం వచ్చి బంధువులను పిలిచి చూడగా సాయిహరిత మృతిచెందినట్లు గుర్తించారు. గ్రామీణ ఎస్సై వైవీ రమణ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌ తెలిపారు.

ఆడపిల్ల లేదని పెంచుకుంటే: సాయిహరిత తల్లి ధనలక్ష్మి, తండ్రి వెంకటేశ్వరరావులు కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నారు. ధనలక్ష్మి సోదరి పుణ్యవతికి కుమారులే ఉన్నారు. కుమార్తెలు లేరు. ఈ క్రమంలో పుణ్యవతి.. సాయిహరితను పెంచారు. ధనలక్ష్మి దుబాయిలో ఉంటూ అప్పుడప్పుడు వస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని