logo

‘అనిశా’ వలలో తాండూరు ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌

రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ రద్దు కోసం రూ.50వేల లంచం తీసుకుంటూ తాండూరు ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ జమీరుద్దీన్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికారు.

Published : 06 Dec 2022 02:19 IST

రూ.50వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత

అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులు

న్యూస్‌టుడే, తాండూరు: రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ రద్దు కోసం రూ.50వేల లంచం తీసుకుంటూ తాండూరు ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ జమీరుద్దీన్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికారు. ఏసీబీ సూర్యనారాయణ తెలిపిన ప్రకారం తాండూరు పట్టణానికి చెందిన ఇర్షాద్‌ యాలాల మండలం దౌలాపూరు గ్రామానికి చెందిన హీర్యానాయక్‌కు 2019లో రూ.5లక్షలను అప్పుగా ఇచ్చారు. గ్యారంటీ కోసం దౌలాపూర్‌లోనే తనకుచెందిన 1.14ఎకరాల భూమిని తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఇర్షాద్‌కు ఇచ్చారు. గత నవంబరులో అతను రూ.5లక్షలను తిరిగి చెల్లించారు. దీంతో భూమిని తిరిగి ఇచ్చేందుకు డాక్యుమెంటును రద్దు చేయాలని ఇర్షాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. రూ.50వేలు ఇస్తే తప్ప కుదరదన్నారు. విషయాన్ని ఇర్షాద్‌ అనిశాకు తెలిపారు. ఆమేరకు విచారణ జరిపితే వ్యవహారం నిజమేనని తేలింది. అనిశా బృందం సోమవారం తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిసరాలకు చేరుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ సూచన మేరకు ఇర్షాద్‌ పట్టణంలోని డాక్యుమెంట్‌ రైటర్‌ సమద్‌ దగ్గర పనిచేస్తున్న జహీరుద్దీన్‌కు డిమాండ్‌ చేసిన డబ్బులను ఇవ్వాలని సూచించారు. దీంతో ఇర్షాద్‌కు తామిచ్చిన రూ.50వేలను జహీరుద్దీన్‌కు ఇచ్చారు. అదే డబ్బును జహీరుద్దీన్‌ ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌కు కార్యాలయంలో ఇస్తుండగా నేరుగా పట్టుకున్నారు. మంగళవారం నిందితుడిని హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి చంచల్‌ గూడ జైలుకు తరలిస్తామని చెప్పారు.

జమీరుద్దీన్‌


రూ.3 వేల పనికి భారీగా అడిగారు
- బాధితుడు, ఇర్షాద్‌, తాండూరు

రూ.3వేల లోపే పూర్తయ్యే పనికి రూ.50వేలు లంచం అడిగిన విషయంలో తాను నవంబరు 25న ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌పై హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని