logo

ప్రగతి పరుగు!

ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పోరాటాన్ని సాగించిన ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి విషయంలో ప్రత్యేక ముద్ర కనిపిస్తోంది.. పథకాల ద్వారా అందిన సంక్షేమంతోపాటు ప్రత్యేకత నిలిపే అభివృద్ధి కూడా సాకారమైంది.

Published : 01 Jun 2023 05:37 IST

అభివృద్ధిలో ప్రత్యేక మార్కు
రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ఏర్పాట్లు
ఈనాడు, కరీంనగర్‌

ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పోరాటాన్ని సాగించిన ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి విషయంలో ప్రత్యేక ముద్ర కనిపిస్తోంది.. పథకాల ద్వారా అందిన సంక్షేమంతోపాటు ప్రత్యేకత నిలిపే అభివృద్ధి కూడా సాకారమైంది.. సాగుకు దన్నుగా నిలిచేలా ప్రాజెక్టులు.. విద్యా రంగంలో  తెలంగాణ మార్కు చూపించేలా కేజీ టు పీజీ ప్రాంగణంతోపాటు వైద్య సేవల మెరుగుకు వైద్య కళాశాలల ఏర్పాటు రాష్ట్ర ఆవిర్భావం తరవాత ఉమ్మడి జిల్లాకు వన్నె తెస్తున్నాయి.. రేపటి నుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నాలుగు జిల్లాలు ముస్తాబైన నేపథ్యంలో ఇన్నాళ్లు దరిచేరిన అభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం..


చదువుల అడ్డా.. ‘కేజీ టు పీజీ’.!

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టు పీజీ ప్రాంగణం

రాష్ట్రంలో కేజీ టు పీజీ హామీని నెరవేర్చేలా అక్షర ఖ్యాతిని అందించిన బడి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో నెరవేరింది. గత విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ అంగన్వాడీ నుంచి పీజీ విద్య వరకు చదువును అందించే విద్యానిలయంగా ఇది భాసిల్లుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయ స్వప్నంగా పేరొందిన కేజీ టు పీజీ ప్రాంగణాన్ని చిన్నపాటి విశ్వవిద్యాలయాన్ని తలపించేలా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కిండర్‌ గార్డెన్‌ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాంగణమిది. ఇక్కడ మొత్తంగా 2,500ల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద పలు సంస్థలు చేసిన సాయం, ప్రభుత్వ నిధులు దాదాపుగా రూ.8.5 కోట్లు ఖర్చు పెట్టి చూడచక్కని సౌకర్యాలు, వసతులతో ఆహ్లాదభరితమైన బడిగా నిర్మించారు. రెండేళ్ల నుంచి ఆరేళ్ల వరకు వయస్సున్న వారికి అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటలతో 12 గదుల్లో ప్రత్యేక బోధనను అందిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. జూనియర్‌, డిగ్రీ, పీజీలో పలు కోర్సులతోపాటు దూరవిద్యకోర్సులను అందుబాటులోకి తెచ్చారు. అతిపెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఒకేసారి 100 మంది కూర్చునే సౌకర్యాన్ని కల్పించారు. నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుట్టు మిషన్‌తోపాటు ఇతర కులవృత్తులకు చేయూతనిచ్చే సౌలభ్యాన్ని ఇక్కడి బడిలో అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో భవిష్యత్తు చదువుల లోకానికి దీన్ని ఒక నమూనాగా మార్చారు.  


వైద్య కళాశాలలతో మేలు

రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల

ప్రజారోగ్యానికి పెద్దపీట వేసేవిధంగా సర్కారు దవాఖానాలు ఇంతకింతకు బలోపేతమవుతున్నాయి. 9 ఏళ్లలో వైద్య చికిత్సల పరంగా ఊహించని సౌకర్యాలు, సౌలభ్యాలు రోగులకు చేరువయ్యాయి.  ఈ సేవలకు అనుబంధంగా కొత్త వైద్య కళాశాలలు నాలుగు జిల్లాలకు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే కరీంనగర్‌, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలలను మంజూరు చేసి ఇక్కడి ప్రజల చిరకాల కోరికను తీర్చింది. బోధనేతర సిబ్బంది, వైద్య సిబ్బంది నియామకాలు జిల్లాల్లోని వైద్యసేవల్ని మరింత బలోపేతం చేయనున్నాయి.


జలకళనద్దిన కాళేశ్వరం

రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌజ్‌

ఎస్సారెస్పీ కాలువలు ఉన్న ప్రాంతం తప్పితే మిగతా చోట్ల సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఉమ్మడి కరీంనగర్‌లో సరికొత్త జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు కరవు కోరల్లో చివరి తడి నీటి కోసం ఆందోళనలు చేసిన గడ్డ.. ఇప్పుడు జలాశయాల ఖిల్లాగా మారిపోయింది.  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగింది ఉమ్మడి జిల్లా పరిధిలోనే. రూ.లక్ష కోట్లతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు తొలి సాగునీటి ఫలాలు ఉమ్మడి జిల్లాకు అందాయి. మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ) నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం (సరస్వతి) బ్యారేజీ మీదుగా పెద్దపల్లి జిల్లా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల నుంచి ఎల్లంపల్లికి చేరుతుంది. అటు నుంచి నందిమేడారం, గాయత్రి పంప్‌ హౌజ్‌ మీదుగా మధ్యమానేరు జలాశయానికి వెళ్తాయి. సుందిళ్ల (పార్వతి) బ్యారేజీని మంథని మండలం కాసిపేట శివారులో నిర్మించగా జలాశయంలో 8 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. సమీపంలోని గోలివాడ వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌ ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే బోయినపల్లి మండలంలోని మధ్యమానేరు జలాశయం నిర్మాణం వేగంగా పూర్తి చేసుకుంది. నీటి సామర్థ్యం 25 టీఎంసీలు కాగా,  ఈ జలాశయం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెరువులన్నింటిని నింపడంతో ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 2 లక్షల సాగుకు ఆధారమవుతోంది. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌజ్‌ నుంచి వచ్చే నీటితో కరీంనగర్‌ జిల్లాలోని పలు గ్రామాలకు కాళేశ్వరం తొలిఫలాలు అందాయి.

* 2017 వానాకాలంలో 6 లక్షల ఎకరాలు సాగైతే గత వానాకాలంలో కాళేశ్వరం జలాల పుణ్యమా అని దాదాపుగా 10లక్షల ఎకరాల్లో పలురకాల పంటల్ని రైతులు సాగుచేశారు.

* కాళేశ్వరం జలాలతో వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌)కు పునరుజ్జీవ పథకం ద్వారా నీళ్లను అందించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌, మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటల వద్ద పంప్‌హౌజ్‌లను నిర్మించారు. వరద కాలువలోకి వీటి ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్‌ పంపింగ్‌ను అవసరమున్నప్పుడు చేస్తున్నారు. దీని ద్వారా వరద కాలువలో అటు ఎస్సారెస్పీ ఇటు కాళేశ్వర జలాలు ఉండటంతో సమీప గ్రామాల ప్రజల సాగుకు ఇది జీవనాధారమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని