logo

కనుల పండువగా శివయ్య కల్యాణం

ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది.

Updated : 29 Mar 2024 06:05 IST

రాజన్న క్షేత్రంలో వైభవంగా వేడుక

వేములవాడ, న్యూస్‌టుడే: ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోలాహలం మధ్య స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసారి ఛైర్మన్‌ ఛాంబర్‌ ముందు ప్రత్యేకంగా కల్యాణ వేదికను ఏర్పాటు చేసి పూలు, అరటి తోరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం ఆలయంలో తీర్థరాజస్వామి పూజ, అవాహిత దేవతార్చన, దేవతా హోమం, వృషభయాగం, ధ్వజారోహణం, ఎదుర్కోళ్లు తదితర కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఆలయ ప్రధాన ద్వారం ముందు నుంచి ఉత్సవమూర్తులను ఎదుర్కోళ్ల అనంతరం శ్రీపార్వతీ, రాజరాజేశ్వరస్వామివార్లను పల్లకీ సేవపై మేళతాళాలతో కల్యాణవేదికపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.

అభిజిత్‌ లగ్న సుమూహూర్తమున ఉదయం 10.55 నుంచి వేద పండితులు, అర్చకులు మంత్రోచ్చారణల మధ్య స్వామివార్ల పెళ్లి క్రతువును కనుల పండువగా నిర్వహించారు. వరుడు శ్రీరాజరాజేశ్వరస్వామి తరఫున ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌, వధువు శ్రీపార్వతీదేవి తరఫున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వరకట్నంగా రూ.551 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. స్థానాచార్యుడు భీమాశంకర్‌ శర్మ, ఇందిర దంపతులు కన్యదాతలుగా వ్యవహరించారు. కల్యాణం సందర్భంగా శివపార్వతులు తలంబ్రాల బియ్యం సంచితో చేతిలో బాసింగం, త్రిశూలం పట్టుకొని ఊపుతూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు చల్లుకుంటూ శివుడిని పెళ్లాడినట్లు తన్మయత్వం పొందారు. మరికొందరు శివపార్వతులు పసుపు కొమ్మును మెడలో కట్టుకుని శివుడిని పెళ్లాడారు. స్వామివార్ల పెళ్లి జరుగుతున్న సమయంలో శివపార్వతులు, భక్తులు, ఉత్సవమూర్తులపైన తలంబ్రాల బియ్యం చల్లి తరించారు. కల్యాణం సందర్భంగా రూ.77,266లను భక్తులు, శివపార్వతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్వామివారికి కట్నాలు సమర్పించారు. 50 వేల మందిపైగా తరలి వచ్చారు. కల్యాణం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాధవి, ఆర్డీవో రాజేశ్వర్‌, ముఖ్య అతిథులుగా హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, డివిజన్‌ పోలీసులు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది, ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని