logo

360 డిగ్రీల్లో.. నిఘా

లోక్‌సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది.

Updated : 18 Apr 2024 05:41 IST

సూర్యాపేటలో 360 డిగ్రీల కెమెరాతో తిరుగుతున్న వాహనం

భానుపురి, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నగదు, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు పలు బృందాలను నియమించింది. కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గాల్లో నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. నామినేషన్‌ పర్వం సమీపించటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 360 డిగ్రీల కెమెరాల విధానం సత్ఫలితాలిచ్చింది. ఈ ఎన్నికల్లో దాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఐదు రకాల నిఘా బృందాలు పని చేస్తున్నాయి. పోలీస్‌, రెవెన్యూ, సహకార, ఇతర శాఖలను ఇందులో భాగస్వాములను చేశారు. నిఘా బృందాల వాహనాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 360 డిగ్రీల కెమెరాలు బిగించి పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థుల ప్రచారం, డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీ, అల్లర్లు, ఘర్షణలకు సంబంధించి దృశ్యాలు ఈ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తారు.

ప్రతి నియోజకవర్గానికి మూడు

ప్రతి నియోజకవర్గానికి మూడు చొప్పున వాహనాలు సిద్ధం చేశారు. వాటిని అధికారులు కేటాయించి తిప్పుతున్నారు. వాహనాల కెమెరాలకు జియోట్యాగింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాలకు అనుసంధానించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో జరిగే ఘటనలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీక్షిస్తున్నారు.

అడ్డుకట్ట ఇలా..

నిఘా బృందాలు పకడ్బందీగా పర్యవేక్షిస్తుండటంతో అల్లర్లు, హింస, మద్యం, ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట పడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో నిఘా బృందాల వాహనాలు అభ్యర్థుల వెంట నిరంతరం నీడలా వెంటాడుతున్నాయి. సీ విజిల్‌ యాప్‌, 1950 టోల్‌ఫ్రీ నంబరు ఫిర్యాదుల ఆధారంగా ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. నియమావళిని ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని