logo

Prakasam - Woman Murder: ప్రాణాలు తీసిన తోడేళ్ల గుంపు

ఇద్దరూ కలిసి చదువుకున్నారు. వివాహం తర్వాత కూడా మంచి స్నేహితులుగా మెలిగారు. శ్రేయోభిలాషుల్లా మసిలారు. మిత్రుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని చలించారు.

Updated : 20 May 2023 09:56 IST

మంటగలిసిన స్నేహధర్మం
మహిళపై పైశాచికత్వం
న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం, కనిగిరి

ఇద్దరూ కలిసి చదువుకున్నారు. వివాహం తర్వాత కూడా మంచి స్నేహితులుగా మెలిగారు. శ్రేయోభిలాషుల్లా మసిలారు. మిత్రుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని చలించారు. ఆర్థికంగా చేయూతనందిస్తే కుదురుకుంటాడని తలిచారు. ఏకంగా రూ.80 లక్షల కష్టార్జితాన్ని ఆ దంపతులు అతనికిచ్చారు. వ్యసనాలకు బానిసైన ఆ వ్యక్తి స్నేహ ధర్మాన్ని మంటగలిపి అందుకు భిన్నంగా వ్యవహరించాడు. కష్టాల్లో అండగా నిలిచి భవిష్యత్తుకు భరోసా నింపేలా చేయూతనిచ్చిన స్నేహితురాలినే కడతేర్చాలని పథకం రచించి పక్కాగా అమలుచేశాడు. ఈ విషయం తెలియని ఆ మహిళ అతన్ని నమ్మింది. తీసుకున్న డబ్బులో కొంత చెల్లిస్తానంటే తనవెంటే వెళ్లింది. నమ్మి వచ్చిన మహిళపై అత్యంత క్రూరంగా, పాశవికంగా, దుర్మార్గంగా వ్యవహరించాడు. గుంపుతో కలిసి బతికుండగానే నరకం చూపాడు. చివరికి ప్రాణాలు తోడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడులో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనలో అనేక విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  

జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి, సుబ్బలక్ష్మమ్మ దంపతుల కుమార్తె కోట రాధ(35). ఈమెకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మోహన్‌రెడ్డితో వివాహమైంది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాధ బాల్య స్నేహితుడైన కేతిరెడ్డి కాశిరెడ్డి అలియాస్‌ చినకాశయ్య అప్పటికే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి కుటుంబ స్నేహితుడిగా మసిలేవాడు. హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తనకొక ప్రాజెక్టు ఆలోచన ఉందని.. అందుకు డబ్బు అవసరమని రాధ, మోహన్‌రెడ్డి దంపతులకు చెప్పాడు. స్నేహధర్మంగా వారు రూ.80 లక్షల వరకు అప్పుగా ఇచ్చారు. అనంతరం అతను ఎంతకీ తిరిగివ్వక పోవడంతో జిల్లెళ్లపాడు నుంచి తన తల్లిదండ్రులు, బంధువులతోనూ రాధ అడిగించారు. అనేకసార్లు అతన్ని ఫోన్లో నిలదీశారు. అయినా లాభం లేకుండా పోయింది. చౌడేశ్వరి కొలుపులు ఉండటంతో ఈ నెల 11న తన చిన్నకుమారుడితో కలసి రాధ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు కనిగిరి వస్తే తన అనుచరులు వచ్చి కొంత నగదు ఇస్తారని ఈ నెల 17న ఆమెను నమ్మించాడు.


ఆ కారులో వచ్చిందెవరు...

బ్బులు ఇస్తానని కాశిరెడ్డి సందేశం పంపడంతో రాధ స్వగ్రామం నుంచి చిన్న కుమారుడిని తీసుకుని కనిగిరి చేరుకున్నారు. కుమారుడిని తన చిన్నాన్న ఇంటిలో వదిలి పామూరు బస్టాండు సెంటర్‌కు చేరుకుంది. సరిగ్గా సాయంత్రం 6.47 గంటల సమయంలో ఆ ప్రాంతానికి ఒక ఎరుపు రంగు కారు వచ్చి ఆగింది. అందులోని వ్యక్తులను చూసి ఆమె ఒకడుగు వెనక్కి వేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు  నమోదయ్యాయి. ఆ తర్వాత పామూరు రోడ్డులోని గుజ్జుల యలమందారెడ్డి విగ్రహం వద్ద ఆమెను తిరిగి కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం దారుణంగా హింసించి హత్య చేశారు. ఆ కారులో కాశిరెడ్డి ఉండి ఉంటాడని.. అపరిచిత వ్యక్తులు కూడా ఉండటంతో ఆమె సందేహించి వెనకడుగు వేసి ఉంటారని భావిస్తున్నారు. అయినప్పటికీ పట్టువిడవని కాశిరెడ్డి ఆమెను నమ్మించి తీసుకెళ్లి మట్టుబెట్టి ఉంటాడనే చర్చ సాగుతోంది. అసలు ఆ కారులో ఎవరెవరు ఉన్నారనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో కనిపించిన ఆ కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యలో పాల్గొన్నవారు హైదరాబాద్‌ నుంచి వచ్చారా.? బెంగళూరు వారా..? స్థానికంగా ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.


ఆమెపై ఎందుకంత కక్ష...

దారుణహత్యకు గురైన రాధ, కీలక నిందితుడిగా భావిస్తున్న కాశిరెడ్డి పక్కపక్క గ్రామాలకు చెందినవారే. పైగా చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాల, కళాశాలలో చదువుకున్నవారు. కుటుంబ స్నేహితులు కూడాను. హైదరాబాద్‌లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని కోల్పోయిన తరుణంలో కాశిరెడ్డికి ఆమె భరోసాగానూ నిలిచారు. భర్తతో కలిసి రూ.80 లక్షల వరకు అప్పు కూడా ఇప్పించారు. స్నేహితుడని నమ్మి చేసిన సాయమే చివరికి ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. అప్పు చెల్లించకపోవడంతో దంపతులిద్దరూ పలుమార్లు అడిగి చూశారు. అసలు అప్పుగా ఇచ్చిన రాధను అంతమొందిస్తే ఎలాంటి సమస్య ఉండదని భావించి ఈ కిరాతకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అత్యంత పైశాచికంగా, క్రూరంగా హింసించి ప్రాణాలు తీయడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాధను చంపిన నిందితులు ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించేందుకు ఆ తర్వాత  యత్నించినట్టు అర్థమవుతోంది. హత్యకు ముందు నిందితుడు ఎవరెవరితో మాట్లాడారు.. కనిగిరి చుట్టుపక్కల వారు ఈ ఘాతుకంలో పాల్గొన్నారా.. స్నేహితులు ఎవరైనా ఉన్నారా.. ఇతర జిల్లాల, రాష్ట్రాలకు చెందిన కిరాయి హంతకుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే మృతురాలు రాధ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ముందు ఆమె ఎవరెవరితో మాట్లాడారు.. నిందితుడు కాశిరెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.


అఘాయిత్యమా! అప్పు కోసమా!!

దర్యాప్తు చేస్తున్నాం

కనిగిరి, న్యూస్‌టుడే: కోట రాధను హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు రాష్ట్రంతో పాటు, తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాలకు పోలీసు ప్రత్యేక బృందాలను పంపినట్టు కనిగిరి డీఎస్పీ రామరాజు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేతిరెడ్డి కాశిరెడ్డిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రతి చెక్‌ పోస్ట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. కాశిరెడ్డితో పాటు, మరో నలుగురు ఈ హత్యోదంతంలో పాల్గొన్నట్టు భావిస్తున్నామని, అత్యాచారం చేసి హత్య చేశారా.. లేక తీసుకున్న అప్పు అడుగుతుందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. కాశిరెడ్డి స్నేహితులు, బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. రాధ కారులో ఎక్కే ముందు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కనిగిరి సర్కిల్‌ పోలీస్‌లు అప్రమత్తమై కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని