logo

వీపుపై..కత్తి దించి పరార్‌!

మాజీ సైనికోద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...

Published : 19 May 2022 04:32 IST

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: మాజీ సైనికోద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... నగరంలోని జగదాంబకూడలి సమీప ప్రకాశరావు పేటకు చెందిన మాజీ సైనికోద్యోగి కొల్లి వినోద్‌రావు(54) ఉప గుత్తేదారు పనులు నిర్వహిస్తుంటారు.

* మంగళవారం రాత్రి కూర్మన్నపాలెం వద్ద పనులు ముగించుకొని షీˆలానగర్‌ పోర్టు రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. పోర్టు రోడ్డులో టోల్‌గేటు దాటిన తర్వాత మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రయాణానికి ఆటంకం కల్పించేలా తమ వాహనాన్ని అటు, ఇటూ నడిపారు. తీవ్ర అసహనానికి గురైన వినోద్‌రావు తన వాహనాన్ని నిలిపి... ఇదేమిటని ఆ ఇద్దరినీ ప్రశ్నించారు. దీంతో ఓ వ్యక్తి కత్తితో వినోద్‌రావు వీపు భాగంలో పొడిచాడు. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో.. కత్తి దిగిన చోట బాధిస్తున్నా...వినోద్‌రావు స్వయంగా తన వాహనంపైనే కేజీహెచ్‌కు చేరుకుని చికిత్స చేయించుకుంటున్నారు.
* సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలో వినోద్‌రావుని ప్రశ్నించారు. తనకు ఎవరితో గొడవలు, పాతకక్షలు లేవని... చీకటిలో దాడి చేసిన వారిని గుర్తించలేకపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాజువాక సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని